AP Half Day Schools : ఏపీ విద్యార్థులకు అలర్ట్, రేపటి నుంచి ఒంటిపూట బడులు
17 March 2024, 16:56 IST
- AP Half Day Schools : ఏపీలో రేపటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
రేపటి నుంచి ఒంటిపూట బడులు
AP Half Day Schools : ఏపీ వ్యాప్తంగా రేపటి(మార్చి 18) నుంచి ఒంటిపూట బడులు(AP Half Day Schools) ప్రారంభం కానున్నాయి. విద్యాశాఖ ఆదేశాల మేరకు 1వ తరగతి నుంచి 9వ తరగతి (1 to 9th Class)వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒంటిపూట తరగతులు నిర్వహించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, అన్ ఎయిడెట్, మెడల్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్, జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు తెలిపారు. పదో తరగతి(AP SSC Exams) పరీక్షా కేంద్రాలుగా ఉన్న బడుల్లో పరీక్షలు జరిగే రోజుల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఒంటిపూట బడుల సమయంలో మధ్యాహ్నం భోజనం(Midday Meal) తర్వాతే విద్యార్థులను ఇంటికి పంపాలని అధికారులు ఆదేశించారు. నిర్దేశించిన మెనూ ప్రకారమే విద్యార్థులకు భోజనాలు అందించాలని అధికారులు స్పష్టం చేశారు.
ఒంటిపూట తరగతుల నిర్వహణ సూచనలు
బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద తరగతులు నిర్వహించరాదని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. విద్యార్థులకు తాగునీరు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలన్నారు. ఎండల నేపథ్యంలో పాఠశాలల్లో ఓఆర్ఎస్ (ORS)ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. విద్యార్థులకు ఎండదెబ్బ తగిలితే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాలన్నారు. మధ్యాహ్న భోజన సమయంలో స్థానికుల సహాయంతో మజ్జిగ ఏర్పాటు చేయాలన్నారు. ఎస్ఏ2 పరీక్షల షెడ్యూల్లో మార్పులు లేవని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు.
రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు
ఏపీ ఎస్.ఎస్.సి పబ్లిక్ పరీక్షల(AP SSC Exams) నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ అన్నారు. ఆదివారం పదో తరగతి పరీక్షల(AP 10th Exams) నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు ఎస్.ఎస్.సి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 09:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు అంటే 3 గంటల 15 నిమిషాల పాటు నిర్వహించనున్నారు. విద్యార్థులను 08:45 AM నుంచి 09:30 AM వరకు పరీక్షా కేంద్రాలలోకి ప్రవేశించడానికి అనుమతిస్తారు. హాల్ టిక్కెట్లు మార్చి 4 నుంచి అధికారిక వెబ్సైట్లో ఉంచారు. విద్యార్థులు స్వయంగా హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా సంబంధిత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడి నుంచి పొందవచ్చని సురేష్ కుమార్ తెలిపారు. అభ్యర్థులందరూ తమ పరీక్షా కేంద్రాన్ని ముందుగానే చూసుకొని, సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 3473 పరీక్షా కేంద్రాలు
రాష్ట్రంలో మొత్తం 3,473 పరీక్షా కేంద్రాలు(Exam Centers) ఏర్పాటు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రా లలో అభ్యర్థులకు సౌకర్యంగా బెంచీలు, సరిపడా వెలుతురు, ఫ్యాన్లు, తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్ల వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్లు(3473), డిపార్ట్మెంటల్ అధికారులు (3473), ఇన్విజిలేటర్లు(32,000) , ఇతర సహాయక సిబ్బందిని నియమించామన్నారు. పరీక్షా (AP SSC Exams)కేంద్రాల వద్ద అవకతవకలను తనిఖీ చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 156 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 682 సిట్టింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 130 సమస్యాత్మక పరీక్షా కేంద్రాలలో నిఘా కోసం CCTV కెమెరాలు అమర్చినట్లు అధికారులు తెలిపారు. కాన్ఫిడెన్షియల్ ఎగ్జామినేషన్ మెటీరియల్, 12/24 పేజీల ఆన్సర్ బుక్లెట్లు, గ్రాఫ్ షీట్లు, ఇతర ఎగ్జామినేషన్ మెటీరియల్లు ఇప్పటికే జిల్లా ప్రధాన కేంద్రాలకు పంపించామన్నారు.