TS SI Exam: ఎస్సై అభ్యర్థులకు గుడ్ న్యూస్... ప్రతి ఒక్కరికి 8 మార్కులు
TS SI Preliminary Exam: ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాథమికంగా విడుదల చేసిన కీ లో 8 తప్పులు దొర్లినట్లు ప్రకటించింది. ఈ మేరకు 8 మార్కులు కలపాలని నిర్ణయించింది.
TS SI Preliminary Exam Key: శుక్రవారం ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అభ్యంతరాలను స్వీకరించేందుకు కూడా అవకాశం కల్పించింది రిక్రూట్ మెంట్ బోర్డు. ఇదిలా ఉన్నప్పటికీ.... ఎస్సై ప్రాథమిక రాత పరీక్ష ప్రశ్నపత్రంలో పలు తప్పులు దొరినట్లు గుర్తించింది. ఏకంగా 8 తప్పులు దొర్లినట్లు ప్రకటించింది. మరో 6 ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు సరైనవేనని గుర్తించారు.
తెలంగాణ పోలీస్ రిక్రూమ్ మెంట్ బోర్డు.... ఈ నెల 7 వ తేదీన 554 పోస్టులకు ప్రాథమిక పరీక్ష నిర్వహించగా... శుక్రవారం ప్రిలిమినరీ కీ ని విడుదల చేసింది. ఇందులో భాగంగా పలు తప్పులను గుర్తించారు. ఇంగ్లీష్-తెలుగు వెర్షన్లోని ‘A’ బుక్లెట్లో 43, 111, 146, 173, 180, 184, 195, 199 ప్రశ్నల్లో తప్పులు దొర్లినట్లు తేల్చారు. ఈ క్రమంలో ప్రతి అభ్యర్థికి 8 మార్కులు కలపాలని బోర్డు నిర్ణయించింది.
ఇక ప్రిలిమినరీ పరీక్షలోని మొత్తం 200 ప్రశ్నలకు 60 మార్కులను (30%) అర్హతగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. బోర్డు తాజా నిర్ణయం నేపథ్యంలో 52 మార్కులొచ్చిన అభ్యర్థి సైతం పరీక్షలో అర్హత సాధించినట్లు అవుతుంది. ఆయా అభ్యర్థులు తదుపరి శారీరక సామర్థ్య పరీక్షలకు కూడా క్వాలిఫై అవుతారు. మరో ఆరు ప్రశ్నలకు ఒకటికంటే ఎక్కువ సమాధానాలు సరైనవేనని గుర్తించారు. ‘A’ బుక్లెట్లో 54వ ప్రశ్నకు 3 సరైన సమాధానాలుండగా.. 114, 183, 186, 192, 197 ప్రశ్నలకు రెండేసి సరైన సమాధానాలున్నాయి. వీటిలో దేనికి ఆన్సర్ చేసినా మార్కులిచ్చే అవకాశం కనిపిస్తోంది.
అయితే విడుదలైన కీ లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 15 వ తేదీ వరకు పంపవచ్చని పోలీస్ రిక్రూట్ మెట్ బోర్డు ప్రకటించిది. www.tslprb.in వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది. ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ తెలపవచ్చు. ప్రతి ప్రశ్నను వేరువేరుగా సమర్పించాలని, సంబంధిత ధ్రువపత్రాలను జతచేయాలని బోర్డు స్పష్టం చేసింది.
కీ ని ఇలా డౌన్లోడ్ చేసుకోండి.
అభ్యర్థులు మొదటగా www.tslprb.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
PRELIMINARY KEY ENGLISH-TELUGU VERSION అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. లేక ప్రింట్ తీసుకోవచ్చు.
అభ్యంతరాల కోసం ఇదే లింక్...
అభ్యర్థులు మొదటగా www.tslprb.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
PRELIMINARY KEY ENGLISH-TELUGU VERSION కీ అబ్జెక్షన్ పై క్లిక్ చేయాలి.
మీ మొబైల్ నెంబర్, పాస్ వర్డ్ ను ఎంటర్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
రాష్ట్రంలో 544 ఎస్ఐ పోస్టుల కోసం ఏప్రిల్ 25న నోటిఫికేషన్ విడుదల కాగా.. 2,47,217 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టు 7న జరిగిన ప్రాథమిక పరీక్షకు 91.32 శాతం మంది హాజరయ్యారు. మొత్తం 2,25,759 మంది పరీక్ష రాసినట్లు రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది.