TS Temperatures : తెలంగాణలో మండుతున్న ఎండలు.. ఇవాళ రికార్డు ఉష్ణోగ్రతలు నమోదు
Temperatures Updates: రాష్ట్రంలో భానుడి ప్రతాపం క్రమంగా పెరుగుతోంది. రోజురోజుకూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సమ్మర్ సీజన్ ప్రకారం చూస్తే… గురువారం కామారెడ్డి జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.
Today Telangana Temperatures : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఓ వైపు ఉక్కపోతతో వేడితో జనం అల్లాడుతున్నారు. కొద్దిరోజుల వరకు వర్షాల ప్రభావంతో చల్లబడిన వాతావరణం.... మార్చి 27 నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఉత్తర, తూర్పు, దక్షిణ తెలంగాణల్లో వేడిగాలులు వీస్తున్నాయి. అయితే ఈ సమ్మర్ సీజన్ లో ఇవాళే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైంది.
గురువారం కామారెడ్డి జిల్లాలోని బీక్నూరులో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా... హైదరాబాద్ లోని తిరుమలగిరిలో 39.6 డిగ్రీలుగా రికార్డు అయింది. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఇవే అత్యధిక ఉష్ణోగ్రతలు. ఇక శేరిలింగంపల్లి 39.3 డిగ్రీలు, సైదాబాద్ 39.1 డిగ్రీలు, షేక్ పేట్ 38.9 డిగ్రీలు, రాజేంద్రనగర్ 38.7 డిగ్రీలు నమోదు కాగా... నాంపల్లిలో 38.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇక జిల్లాల్లో చూస్తే నిర్మల్ జిల్లాలోని దస్తూరాబాద్ లో 42.7 డిగ్రీలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మర్తనపేట వద్ద 42.4 డిగ్రీలు, నిజామాబాద్ లో 42.3 డిగ్రీలు, సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాకలో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. ఉదయం వేళలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు తగినంత స్థాయిలో నీరు తాగాలని చెబుతున్నారు. నేరుగా ఎండ ఇంట్లో పడకుండా జాగ్రత్త పడాలని.. ఈ మేరకు తగిన చర్యలు తీసుకువాలని అంటున్నారు.బయటికు వెళ్లవలసి వస్తే… గొడుగు, టోపీ, సన్స్క్రీన్ ధరించాలని అడ్వైజ్ చేస్తున్నారు. కచ్చితంగా బయటకు వెళ్లవలసి వస్తే సాయంత్రం తర్వాత వెళ్తే బెటర్ అని చెబుతున్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఇవాళ అత్యధిక విద్యుత్ వినియోగించినట్లు విద్యుత్ శాఖ ప్రకటించింది. గురువారం ఉదయం 11.01 నిమిషాలకు 15,497 మెగా వాట్ల విద్యుత్ (అత్యధిక పీక్ డిమాండ్) నమోదు అయ్యిందని పేర్కొన్నారు.
సంబంధిత కథనం