తెలంగాణ ఐసెట్ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ఐసెట్ ప్రవేశాలకు సంబంధించి స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ జారీ అయింది. ఇప్పటికే తుది విడత కౌన్సెలింగ్ పూర్తి అయింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక విడత కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించారు. సెప్టెంబర్ 30వ తేదీన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవటంతో పాటు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. అక్టోబర్ 1వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. అక్టోబర్ 4వ తేదీలోపు సీట్లు కేటాయిస్తామని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
రిజిస్ట్రేషన్ తో పాటు ధ్రువపత్రాల పరిశీలన పుర్తి అయిన అభ్యర్థులు అక్టోబర్ 1 నుంచి 2వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. 2వ తేదీన ఫ్రీజ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 4వ తదీలోపు అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తారు. అక్టోబర్ 4 నుంచి 5 తేదీల్లో సీట్లు పొందిన విద్యార్థులు నిర్ణయించిన ఫీజును చెల్లించాలి. అక్టోబర్ 5 నుంచి 7 తేదీల్లో ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
ఈసారి ఐసెట్ ప్రవేశాలకు పుల్ డిమాండ్ ఉంది. ఈ ఏడాది మొత్తం 34,748 సీట్లు ఉండగా… 30,300 సీట్లు ఫస్ట్ ఫేజ్ లోనే భర్తీ అయ్యాయి. ఫైనల్ విడతలో మరికొన్ని సీట్లు భర్తీ అయ్యాయి. మిగిలిన సీట్ల భర్తీ కోసం స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ ను జారీ చేశారు. ఈ ఏడాది ఐసెట్ ప్రవేశాలకు బాగా డిమాండ్ పెరిగిందని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఈ విడత కూడా పూర్తి అయితే…. స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది. దీనిపై అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఏడాది నిర్వహించిన తెలంగాణ ఐసెట్ పరీక్ష కోసం 86156 మంది దరఖాస్తు చేసుకున్నారు. 77942 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 71 వేల 647 మంది ఉత్తీర్ణులు కాగా.. ఉత్తీర్ణత శాతం 91.92 శాతంగా నమోదైంది.జూన్ 5, 6 తేదీల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 116 కేంద్రాల్లో ఐసెట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.