తెలంగాణలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రవేశాల కోసం నిర్వహించే సీపీగెట్ -2024 ఫస్ట్ ఫేజ్ సీట్లను ఇప్పటికే కేటాయించారు. ఇక రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఇవాళ్టి(సెప్టెంబర్ 21) నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు సెప్టెంబర్ 27వ తేదీ వరకు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. https://cpget.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది.
సెప్టెంబర్ 21 నుంచి 27 తేదీల్లోనే ధ్రువపత్రాల పరిశీలన కూడా ఉంటుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఇందుకు 4వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అక్టోబర్ 5వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు. అక్టోబర్ 09వ తేదీన రెండో విడత సీట్లను కేటాయిస్తారు. అక్టోబర్ 17వ తేదీలోపు సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ సీపీగెట్ - 2024 (కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్) ఫలితాలు ఇటీవలే విడుదలయ్యాయి. మొత్తం 73,342 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా… ఇందులో 64,765 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 61,246 మంది విద్యార్థులు అర్హత సాధించారు. 2024-25 విద్యా సంవత్సరానికి విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ పూర్తి అయింది.
రాష్ట్రంలోని ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, మహిళా యూనివర్సిటీలు, జేఎన్టీయూహెచ్ పరిధిలో ఉన్న 297 పీజీ కాలేజీల్లో( ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం, ఎంపీఈడీ కోర్సు) ప్రవేశాలకు సీపీగెట్ నిర్వహించారు.సీపీగెట్ పరీక్షలను జూలై 6వ తేదీ నుంచి కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించారు.జులై 17వ తేదీతో అన్ని పరీక్షలు పూర్తి అయ్యాయి.
సంబంధిత కథనం