TPCC Complaint to Governor: మంత్రి కేటీఆర్ ను భర్తరఫ్ చేయాలి - రేవంత్ రెడ్డి-telangana congress leaders meet governor tamilisai over tspsc paper leak case issue ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Congress Leaders Meet Governor Tamilisai Over Tspsc Paper Leak Case Issue

TPCC Complaint to Governor: మంత్రి కేటీఆర్ ను భర్తరఫ్ చేయాలి - రేవంత్ రెడ్డి

HT Telugu Desk HT Telugu
Mar 22, 2023 02:37 PM IST

Telangana congress Leaders Meet Governor Tamilisai: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అంశంపై గవర్నర్ ను కలిసింది తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందం. పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో... గవర్నర్ కు నేతలు ఫిర్యాదు చేశారు. కమిషన్ రద్దు విషయంలో గవర్నర్ తన విశేషాధికారాలను వినియోగించాలని కోరారు.

గవర్నర్ కు కాంగ్రెస్ ఫిర్యాదు
గవర్నర్ కు కాంగ్రెస్ ఫిర్యాదు

TSPSC Paper Leak case issue: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో తవ్వే కొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలువురి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు... వారిచ్చిన సమాచారంతో పలువురు అభ్యర్థులకు కూడా నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉంటే... మరోవైపు పేపర్ లీక్ అంశంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. మంత్రి కేటీఆర్ టార్గెట్ గా తీవ్రస్థాయిలోనూ విమర్శలు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై గురువారం గవర్నర్ ను కలిశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. పేపర్ లీక్ అంశంపై ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఉన్న బోర్డును రద్దు చేసే విశేషాధికారాలను ఉపయోగించాలని కోరారు.

గవర్నర్ కు ఫిర్యాదు అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ద్వారా లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందన్నారు. పేపర్ లీక్ పై గవర్నర్ కు ఫిర్యాదు చేశామన్న ఆయన... మంత్రి కేటీఆర్ శాఖ ఉధ్యోగులదే పేపర్ లీక్ లో కీలకపాత్ర అని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ కు అప్లికేషన్ పెట్టామని చెప్పారు. వ్యాపం కుంభకోణంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కోడ్ చేస్తూ అప్లికేషన్ ఇచ్చామని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఉన్న టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యులను సస్పెండ్ చేసే అధికారం గవర్నర్ కు ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ అంశంలో ప్రభుత్వం అందర్నీ సస్పెండ్ చేసి..పారదర్శక విచారణ చేస్తారని భావించామని చెప్పారు. కానీ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోలేదన్న ఆయన... విచారణ పూర్తయ్యే వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆ అధికారం గవర్నర్ కు ఉందన్నారు. పేపర్ లీకేజీ లో ప్రభుత్వ పెద్ద ల పాత్ర ఉందని ఆరోపించారు. కోట్లాది రూపాయలకు పేపర్ అమ్ముకున్నారని చెప్పిన రేవంత్ రెడ్డి.. కేటీఆర్, జనార్దన్ రెడ్డి ,అనితా రామచంద్రన్ ను ప్రాసిక్యూట్ చేయడానికి అవకాశం ఇవ్వాలని గవర్నర్ ను కోరామని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో గవర్నర్ తనకు ఉండే విశేష, విచక్షణాధికారాలను ఉపయోగించాలని కోరారు.

లీగల్ ఓపినీయన్ తీసుకుని నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ చెప్పారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కేటీఆర్ ను భర్తరఫ్ చేసేందుకు అనుమతివ్వాలని గవర్నర్ తమిళిసైను కోరినట్టుగా చెప్పారు. గవర్నర్ ను కలిసిన వారిలో పొన్నాల లక్ష్మయ్య, మధు యాష్కీ, సంపత్ కుమార్, మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, మల్లు రవి, వేం నరేందర్ రెడ్డితో పాటు పలువురు నేతలు ఉన్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం