Notices To Allu Arjun : అల్లు అర్జున్ కు మరోసారి పోలీసుల నోటీసులు, రేపు విచారణకు హాజరవ్వాలని ఆదేశాలు-sandhya theatre incident chikkadpally police notice to hero allu arjun attend inquiry ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Notices To Allu Arjun : అల్లు అర్జున్ కు మరోసారి పోలీసుల నోటీసులు, రేపు విచారణకు హాజరవ్వాలని ఆదేశాలు

Notices To Allu Arjun : అల్లు అర్జున్ కు మరోసారి పోలీసుల నోటీసులు, రేపు విచారణకు హాజరవ్వాలని ఆదేశాలు

Notices To Allu Arjun : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు మరోసారి అల్లు అర్జున్ కు నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరవ్వాలని కోరారు.

అల్లు అర్జున్ కు మరోసారి పోలీసుల నోటీసులు, రేపు విచారణకు హాజరవ్వాలని ఆదేశాలు

Notices To Allu Arjun : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో భాగంగా హీరో అల్లు అర్జున్ కు హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. డిసెంబర్ 4వ తేదీ రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద గల సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు అల్లు అర్జున్ ప్రశ్నించనున్నారు. పుష్ప 2 సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్‌ తీవ్రగాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తొక్కిసలాట ఘటనకు సంబంధించి మొత్తం 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్‌ ఏ11గా ఉన్నారు. డిసెంబర్ 13న అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. నాంపల్లి కోర్టు ఆయనకు రిమాండ్‌ విధించింది. హైకోర్టు అల్లు అర్జున్ కు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో అల్లు అర్జున్‌కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు.

అల్లు అర్జున్ ఇంటికి లీగల్ టీమ్

హైదరాబాద్‌లోని వెస్ట్ జోన్ డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం, ఆదివారం సాయంత్రం కొంతమంది వ్యక్తులు అకస్మాత్తుగా చేతిలో ప్లకార్డులు పట్టుకుని జూబ్లీహిల్స్‌లోని హీరో అల్లు అర్జున్ ఇంటివైపు దూసుకెళ్లి నినాదాలు చేయడం ప్రారంభించారు. వారిలో ఒకరు కాంపౌండ్‌పైకి ఎక్కి టమోటాలు అల్లు అర్జున్ ఇంటిపై విసిరారు. భద్రతా సిబ్బంది అభ్యంతరం చెప్పి గోడపై నుంచి దిగమని వారితో చెప్పినప్పుడు, ఆందోళనకారులు గొడవకు దిగారు. ఆందోళన చేస్తున్న వారు గోడ దూకి లోపలికి ప్రవేశించి భద్రతా సిబ్బందిపై దాడి చేసి, ర్యాంప్ వెంట ఉంచిన కొన్ని పూల కుండీలను ధ్వంసం చేశారు. ఓయూ జేఏసీలో భాగమని చెప్పుకుంటున్న ఆరుగురు ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వారిని అరెస్టు చేయగా...కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తన ఇంటిపై దాడి, తాజా ఘటనలు, పోలీసుల నోటీసుల నేపథ్యంలో అల్లు అర్జున్ తన లీగల్ టీమ్ తో భేటీ అయ్యారు. సోమవారం సాయంత్రం లీగల్ టీమ్ అల్లు అర్జున్ ఇంటికి వచ్చారు.

సాయం కొనసాగించండి

తన కుమారుడికి వైద్యసాయం కొనసాగించాలని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ కోరారు.

"నా కొడుకు ఆసుపత్రి నుండి బయటకు వచ్చే వరకు తెలంగాణ ప్రభుత్వం, అల్లు అర్జున్ బృందం సాయం కొనసాగించమని అభ్యర్థిస్తున్నాను. అల్లు అర్జున్ రూ.10 లక్షలే ఇచ్చారు. మిగతా రూ.15 లక్షలు తర్వాత ఇస్తామన్నారు. మంత్రి కోమటిరెడ్డి తన ఫౌండేషన్ ద్వారా రూ.25 లక్షలు ఇచ్చారు. నేను మొదట్లో ఒక రూ.50 వేలు మాత్రమే బిల్లు కట్టాను. ఆ తర్వాత ఆసుపత్రి ఖర్చు అంతా అల్లు అర్జున్ బృందం, ప్రభుత్వమే పెట్టుకుంటుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డిలకు ధన్యవాదాలు"- శ్రీతేజ్ తండ్రి భాస్కర్

సంబంధిత కథనం