Netizens On MLC Kavitha Statement: కవితక్క.. తెలంగాణ అంటే మీరొక్కరే కాదు!-netizens fires on brs mlc kavitha statement on ed notices over delhi liquor case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Netizens Fires On Brs Mlc Kavitha Statement On Ed Notices Over Delhi Liquor Case

Netizens On MLC Kavitha Statement: కవితక్క.. తెలంగాణ అంటే మీరొక్కరే కాదు!

HT Telugu Desk HT Telugu
Mar 08, 2023 06:06 PM IST

ED Notices to MLC Kavitha: కవితకు ఈడీ నోటీసుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే వీటిపై కవిత స్పందించగా…బీఆర్ఎస్ నేతలు కూడా ఆమెకు మద్దతుగా మాట్లాడుతూ కేంద్రంపై ఫైర్ అవుతున్నారు. అయితే కవిత చేసిన ప్రకటనపై రాజకీయ నేతలే కాదు నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు.

ఎమ్మెల్సీ కవిత
ఎమ్మెల్సీ కవిత

Delhi Liquor Case Updates: లిక్కర్ కేసులో ఈడీ వేగం పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు ప్రముఖులను అరెస్ట్ చేసిన దర్యాప్తు సంస్థ... తాజాగా మరోసారి కవితకు నోటీసులు ఇచ్చింది. ఢిల్లీకి విచారణకు రావాలని స్పష్టం చేసింది. అయితే వీటిపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత... ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ఢిల్లీలో విచారణకు రావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొందని కవిత తెలిపారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా దర్యాప్తుకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

ముందస్తు అపాయింట్‌మెంట్ల ఉన్నందున విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటానని చెప్పారు. కేసీఆర్‌, బిఆర్‌ఎస్‌ పార్టీలను లొంగ దీసుకోవడం కుదరదని బీజేపీ తెలుసుకోవాలన్నారు. ఈనెల 10న దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద భారత్‌ జాగృతి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఉందని, మహిళా బిల్లు కోసం ఒకరోజు నిరాహార దీక్ష తలపెట్టినట్లు కవిత చెప్పారు.

మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలన్నది బీఆర్‌ఎస్ ప్రధానమైన డిమాండ్ అని, ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాటం చేస్తామని ప్రకటించారు.బీజేపీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని, కేంద్రంలోని ప్రజావ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచదని అని కవిత ట్వీట్‌ చేశారు.

అయితే తెలంగాణ ఎప్పటికీ తలవంచదు అంటూ కవిత చేసిన కామెంట్స్ పై రాజకీయ నేతలతో పాటు నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. వ్యక్తిగత స్వార్థం కోసం చేసిన పనులకు... తెలంగాణ సమాజానికి ముడిపెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ స్కామ్ కు తెలంగాణ ఎందుకు తలవంచాలి అంటూ నిలదీస్తున్నారు. కల్వకుంట్ల చేసే అక్రమాలకు తెలంగాణ ప్రజలతో పాటు సెంటిమెంట్ ను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ ఆలోచించాలని కోరారు. ఇక మరికొందరూ నెటిజన్లు... కరుణానిధి కుమార్తె కనిమొళి, కవితకు దగ్గరి పోలికలు ఉన్నాయంటూ సెటైర్లు విసురుతున్నారు.

అరెస్ట్ విషయం ముందే తెలుసు కాబట్టి మహిళా రిజర్వేషన్ అని కవిత కొత్త రాగం ఎత్తుకున్నారు.. ఎవరికి తెలియవు ఇవన్నీ? అంటూ మరో నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇవేకాకుండా... కవిత కామెంట్స్ పై మీమ్స్ కూడా ఓ రేంజ్ లో క్రియేట్ అవుతున్నాయి. ఆమెతో పాటు కేసీఆర్, కేటీఆర్ లను టార్గెట్ చేస్తూ... తెగ ట్రోల్స్ చేస్తున్నారు. తెలంగాణ అంటే మీరొక్కరే కాదు..” మీకు నోటీసులిస్తే యావత్ తెలంగాణకి ఇచ్చినట్టు కాదు అంటూ రాసుకొస్తున్నారు. ఇదిలా ఉంటే... మరోవైపు కవితకు మద్దతుగా బీఆర్ఎస్ తో పాడు జాగృతి నేతలు పోస్టులు చేస్తున్నారు. బీజేపీ విధానాలపై పోరాడుతామని అంటున్నారు. ఆడబిడ్డను ఇబ్బంది పెట్టడం సరికాదని... కేసీఆర్ ను రాజకీయంగా కొట్టేందుకే ఇలాంటి విధానాలకు శ్రీకారం చుడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు బీజేపీ నేతలు కూడా కవిత వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. అసలు తెలంగాణ సమాజానికి లింక్ పెడుతూ మాట్లాడమేంటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ అంటే... కల్వకుంట్ల కుటుంబమేనా అని నిలదీస్తున్నారు. ఇవాళ సాయంత్రం ఎమ్మెల్సీ కవిత ఢిల్లీకి వెళ్లారు. అంతకుముందు సీఎం కేసీఆర్ ఫోన్ లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈడీ నోటీసుపై చర్చించినట్లు సమాచారం. ఇక ఢిల్లీకి వెళ్లిన కవిత... ఈడీ విచారణకు హాజరవుతారా..? లేక 10వ తేదీన జరిగే దీక్షలో పాల్గొనేందుకే వెళ్లారా..? అనేది ఆసక్తికరంగా మారింది.

WhatsApp channel

సంబంధిత కథనం