KTR Letter : విశాఖ ఉక్కుపై గొంతెత్తిన కేటీఆర్.. కేంద్రం కుట్ర చేస్తుందంటూ ఫైర్
Vizag Steel Plant Privatization:వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపాలన్నారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పట్ల మోదీకి ఎందుకు ఔదార్యం లేదని ప్రశ్నించారు.
KTR On Vizag Steel Plant Privatization: కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలు మానాలని హితవు పలికారు. వర్కింగ్ కాపిటల్, ముడిసరుకు కోసం నిధుల సమీకరణ పేరిట స్టీల్ ప్లాంట్ తాళాలను ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు కేంద్రం కొత్త కుట్ర చేస్తుందని ఆరోపించారు.
తన కార్పొరేట్ మిత్రులకు 12.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన ప్రధానమంత్రి మోదీకి... వైజాగ్ స్టీల్ ప్లాంట్ పట్ల ఇదే ఔదార్యం ఎందుకు లేదని ప్రశ్నించారు కేటీఆర్. కేంద్రమే ఈ వర్కింగ్ కాపిటల్ కోసం ఆర్థిక సహాయం అందించి వైజాగ్ స్టీల్ నుంచి స్టీల్ ఉత్పత్తులు కొనాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా విస్తరణ ప్రణాళికల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ వీలీనాన్ని పరిశీలించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వమే తక్షణం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి అవసరమైన మేరకు కనీసం ఐదువేల కోట్ల రూపాయలను వేంటనే కేటాయించాలన్నారు.
గతంలో పీవీ నరసింహారావు, అటల్ బిహార్ వాజ్ పేయి ప్రధానులుగా ఉన్నప్పుడు ఇచ్చిన నిధులను వైజాగ్ స్టీల్ ప్లాంట్ వడ్డీతో సహా తిరిగి ఇచ్చిందని గుర్తు చేశారు కేటీఆర్. లక్షన్నర కోట్ల రూపాయల విలువ కలిగిన స్టీల్ ప్లాంట్ ను అప్పనంగా ప్రవేట్ పరం చేసే కుట్రలను కేంద్రం ఆపాలని లేఖలో పేర్కొన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం విడుదల చేసిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో చేసుకోబోయే ఒప్పందం విషయంలో ఎలాంటి నిర్దిష్ట నిబంధనలు లేవన్నారు. ఇది ముడి సరుకులకు మూలధనం పేరిట స్టీల్ ప్లాంట్ ని తమ అనుకూల ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పే కుట్రగా అభివర్ణించారు.
వైజాగ్ ఉక్కు తెలుగు వారి హక్కు… దీని కాపాడుకోవడం తెలుగువారి బాధ్యత అన్నారు కేటీఆర్. భారత రాష్ట్ర సమితి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలకు సంఘీభావం తెలపాలని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోటా చంద్రశేఖర్ కి సూచించారు. కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా చేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలను ఆపేందుకు లక్షలాది PSUల కార్మికులు బిఆర్ఎస్ తో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.
సంబంధిత కథనం