CM Revanth Reddy :పారిశ్రామికవేత్తల ప్రతి పైసా పెట్టుబడికి రక్షణ, మూడు క్లస్టర్లుగా తెలంగాణ అభివృద్ధి-సీఎం రేవంత్ రెడ్డి-hyderabad news in telugu cm revanth reddy says congress govt follows friendly industrial policy ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy :పారిశ్రామికవేత్తల ప్రతి పైసా పెట్టుబడికి రక్షణ, మూడు క్లస్టర్లుగా తెలంగాణ అభివృద్ధి-సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy :పారిశ్రామికవేత్తల ప్రతి పైసా పెట్టుబడికి రక్షణ, మూడు క్లస్టర్లుగా తెలంగాణ అభివృద్ధి-సీఎం రేవంత్ రెడ్డి

Bandaru Satyaprasad HT Telugu
Jan 06, 2024 07:28 PM IST

CM Revanth Reddy : హైదరాబాద్ తరహాలో రాష్ట్రమంటతా అభివృద్ధి జరగాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫ్రెండ్లీ పారిశ్రామిత విధానమని స్పష్టం చేశారు.

సీఐఐ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి
సీఐఐ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : 2050 నాటికి తెలంగాణ అంతటా పారిశ్రామిక వృద్ధి జరగాలనే భవిష్యత్తు లక్ష్యంతో మెగా మాస్టర్ పాలసీ రూపకల్పన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం సెక్రెటేరియట్ లో భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణలో 1994 నుంచి 2004 వరకు పరిశ్రమల అభివృద్ధికి అనుసరించిన ఫార్ములా ఒక తీరుగా ఉంటే.. 2004 నుంచి 2014 వరకు అది మరో మెట్టుకు చేరుకుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇది అత్యున్నత వృద్ధి దశకు చేరుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

ఫ్రెండ్లీ పారిశ్రామిక పాలసీ

పరిశ్రమల అభివృద్ధికి, పెట్టుబడులను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఫ్రెండ్లీ పాలసీని అనుసరిస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పారిశ్రామిక అభివృద్ధి విషయంలో అపోహలు, అనుమానాలకు తావు లేదని అన్నారు. పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టే ప్రతి పైసా పెట్టుబడికి రక్షణ కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రజల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుందనే ఆలోచనలకు భిన్నంగా కొత్త పాలసీని తమ ప్రభుత్వం అనుసరిస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఒక్కచోటే పారిశ్రామిక అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా.. తెలంగాణలోని అన్ని ప్రాంతాలు హైదరాబాద్ తరహాలోనే అభివృద్ధి చెందాలనే ఆకాంక్షను వ్యక్తపరిచారు. గ్రామీణ ప్రాంతాలకు పరిశ్రమలు విస్తరించాలనేది తమ లక్ష్యమని అన్నారు. నగరాలు, పట్టణాల్లో అభివృద్ధి ఫలాలు, పెట్టుబడులతోనే గ్రామాలు, గ్రామీణ ప్రాంతాల సౌభాగ్యం, సంక్షేమం కూడా ముడిపడి ఉంటుందని అన్నారు. పారిశ్రామికంగా అన్ని రంగాలు అభివృద్ధి చెందేలా ఫ్రెండ్లీ పాలసీని అమలు చేసేందుకు ఔత్సాహికులు, పారిశ్రామికవేత్తలు సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు.

మూడు క్లస్టర్లుగా అభివృద్ధి

ఈ పారిశ్రామిక పాలసీలో భాగంగా తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల అర్బన్ క్లస్టర్, ఓఆర్ఆర్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు వరకు మధ్యలో ఉన్న ప్రాంతం సెమీ అర్బన్ క్లస్టర్ గా, రీజనల్ రింగ్ రోడ్డు తర్వాత చుట్టూరా ఉన్న ప్రాంతాన్ని రూరల్ క్లస్టర్ గా గుర్తించి పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. ఫార్మాసిటీ విషయంలో ప్రభుత్వానికి స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయని తెలిపారు. ఫార్మాసిటీగా కాకుండా ఫార్మా విలేజీలను డెవెలప్ చేస్తామన్నారు. ఓఆర్ఆర్ పై 14 రేడియల్ రోడ్లు ఉన్నాయని, వీటికి 12 జాతీయ రహదారుల కనెక్టివిటీ ఉందని.. వీటికి అందుబాటులో ఉండేలా దాదాపు వెయ్యి నుంచి 3 వేల ఎకరాలకు ఒక ఫార్మా విలేజీని అభివృద్ధి చేస్తామని అన్నారు. ప్రజల జీవనానికి ఇబ్బంది లేకుండా కాలుష్యం లేకుండా, పరిశ్రమలతో పాటు స్కూల్స్, హాస్పిటల్స్, అన్ని మౌలిక సదుపాయాలుండేలా వీటిని అభివృద్ధి చేసే ప్రణాళికలను తమ ప్రభుత్వం రూపొందిస్తుందని అన్నారు.

రాజకీయాలు, అభివృద్ధి వేరు

జహీరాబాద్ లో ఐటీ, ఫార్మా, హెల్త్ తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, స్పోర్ట్స్, ఆటోమొబైల్, ఆర్గానిక్ క్లస్టర్లుగా అక్కడ పరిశ్రమల ఏర్పాటు జరగాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రక్షణ రంగం, నావికా రంగానికి అవసరమైన పరికరాల తయారీ, ఉత్పత్తికి హైదరాబాద్ లో అపారమైన అవకాశాలున్నాయని, పారిశ్రామికవేత్తలు వీటిపై దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. కొత్తగా సోలార్ పవర్ పాలసీని రూపొందిస్తామని, సోలార్ ఎనర్జీ పరిశ్రమలకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. ఎన్నికలు, రాజకీయాలు వేరు.. అభివృద్ధి వేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దార్శనికతతో పారదర్శకమైన అభివృద్ధి తమ లక్ష్యంగా ఎంచుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమల వృద్ధికి సహకరించదని, అపోహాలు అవసరం లేదని, ఎవరికి వారుగా తమకున్న అభిప్రాయాలు ఇతరులపై రుద్దవద్దని హితవు పలికారు. 24 గంటల పాటు తాను ఆఫీసు లేదా క్యాంపు కార్యాలయంలో అందరికీ అందుబాటులో ఉంటానని, తనతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోవాలని పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను ఆహ్వానించారు. తమతోనూ, ప్రభుత్వ ప్రతినిధులు అయిన అధికారులతో మాట్లాడకుండానే తొందరపడి ఒక అభిప్రాయానికో, నిర్ణయానికో రావద్దని అన్నారు.

స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటు

రాష్ట్రంలో సుమారు 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, గత ప్రభుత్వం తరహాలో వీరిని తాము భారంగా భావించటం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వీరందరినీ పరిశ్రమల అభివృద్ధిలో పాలుపంచుకునే మానవ వనరులుగా భావిస్తున్నామని తెలిపారు. యువతీ యువకులకు స్కిల్స్ నేర్పించేందుకు స్కిల్ యూనివర్సిటీలను నెలకొల్పుతామని అన్నారు. స్కిల్ యూనివర్సిటీల్లో డిగ్రీలు పొందిన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని, పోటీ ప్రపంచంలో ఎక్కడైనా నిలదొక్కుకునే సామర్థ్యం వాళ్ల సొంతమవుతుందని అన్నారు.

IPL_Entry_Point