BRS Rajya Sabha : బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర, రేపు నామినేషన్ దాఖలు-hyderabad news in telugu brs rajya sabha candidate vaddiraju ravi chandra name confirmed ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Rajya Sabha : బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర, రేపు నామినేషన్ దాఖలు

BRS Rajya Sabha : బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర, రేపు నామినేషన్ దాఖలు

Bandaru Satyaprasad HT Telugu
Feb 14, 2024 08:45 PM IST

BRS Rajya Sabha : రాజ్యసభ అభ్యర్థిని బీఆర్ఎస్ ఖరారు చేసింది. వద్దిరాజు రవిచంద్ర పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు.

బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర
బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర

BRS Rajya Sabha : బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్రను పేరును బీఆర్ఎస్ ఖరారు చేసింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ పెద్దలతో, ముఖ్యులతో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని ప్రకటించింది. కేసీఆర్ ఆదేశాలతో రేపు (ఫిబ్రవరి 15)న వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. వరుసగా రెండోసారి వద్దిరాజుకు రాజ్యసభ అవకాశం కల్పించారు కేసీఆర్. మొదటి దఫాలో వద్దిరాజు రెండేళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.

వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) తెలంగాణకు చెందిన గ్రానైట్ వ్యాపారవేత్త. ఆయన 2019లో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరాడు. రవిచంద్రను 2022 బీఆర్ఎస్ రాజ్యస‌భ సభ్యుడిగా ఖరారు చేసింది. ఈ రాజ్య సభ ఉప ఎన్నికలో ఒక నామినేషన్‌ దాఖలు కావడంతో రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు.

రేపటితో ముగినయనున్న నామినేషన్లు

రాజ్యసభ నామినేషన్ల (Rajya Sabha Elections 2024)గడువు రేపటితో ముగియనుంది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 56 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఇందులో తెలంగాణ నుంచి మూడు ఖాళీలు ఉన్నాయి. భారత రాష్ట్ర సమితి పార్టీకి(BRS Party) చెందిన బడుగుల లింగయ్య యాదవ్‌, జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, వద్దిరాజు రవిచంద్ర రిటైర్ అవుతున్న వారిలో ఉన్నారు. ఈ మూడు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎమ్మెల్యేల ఓట్ల ద్వారా ఎన్నికయ్యే ఈ సీట్లు ఎవరికి దక్కబోతున్నాయనేది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యేల సంఖ్యా బలం రీత్యా అధికార కాంగ్రెస్ పార్టీకి(Telangana Congress) రెండు స్థానాలు దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ ఒక స్థానాన్ని గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఒక్కో రాజ్యసభ సభ్యుడు గెలవాలంటే కనీసం 39 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు ఓటేయాల్సి ఉంది. పోటీకి దించాలంటే కనీసం పది మంది ఎమ్మెల్యేలు ఆయన్ను ప్రతిపాదిస్తూ సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఈ సమీకరణాల ప్రకారం చూస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్​ మాత్రమే నామినేషన్లు వేసే అవకాశం ఉంది. మూడు స్థానాలు ఖాళీగా ఉండగా అంతకన్నా ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉంటే ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్​, సీపీఐ కలిపి 65 మంది సభ్యులు, ఇద్దరు అభ్యర్థులకు కేటాయిస్తే ఒకరికి 33, రెండో అభ్యర్థికి 32 ఓట్లు వస్తాయి. బీఆర్ఎస్ తరపున ఉన్న 39 మంది ఓటేస్తే వారికి ఒక సీటు ఖరారు అవుతుంది. ఈ లెక్కన వరుసగా అత్యధిక ఓట్లు దక్కించుకున్న అభ్యర్థులు గెలిచినట్లు ప్రకటిస్తారు.

కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు

తెలంగాణ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖరారు అయ్యారు. ఖమ్మం జిల్లాకు చెందిన రేణుకా చౌదరి, హైదరాబాద్ కు చెందిన అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ప్రకటించింది ఆ పార్టీ హైకమాండ్. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. కర్ణాటక రాష్ట్రం నుంచి అజయ్ మాకెన్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్ పేర్లు ఖరారయ్యాయి. రేపటితో నామినేషన్లు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో వీరంతా రేపు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం