CM KCR Review : అన్నదాతలు ఆందోళన చెందవద్దు, తడిసిన ధాన్యాన్ని గింజ పోకుండా సేకరిస్తాం - సీఎం కేసీఆర్-hyderabad cm kcr review meet promises to farmers buy wet grain at normal price ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Kcr Review : అన్నదాతలు ఆందోళన చెందవద్దు, తడిసిన ధాన్యాన్ని గింజ పోకుండా సేకరిస్తాం - సీఎం కేసీఆర్

CM KCR Review : అన్నదాతలు ఆందోళన చెందవద్దు, తడిసిన ధాన్యాన్ని గింజ పోకుండా సేకరిస్తాం - సీఎం కేసీఆర్

Bandaru Satyaprasad HT Telugu
May 02, 2023 09:28 PM IST

CM KCR Review : అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని మామూలు వరి ధాన్యం ధరకే సేకరిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. రైతన్న ఎటువంటి ఆందోళన చెందవద్దని కేసీఆర్ భరోసా ఇచ్చారు.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ (Twitter )

CM KCR Review : అకాలంగా కురుస్తున్న వర్షాల వల్ల చేతికొచ్చిన వరిపంట తడిసిపోతుందని రైతన్నలు ఎటువంటి ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్ని కూడా గింజలేకుండా సేకరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతన్నలకు భరోసానిచ్చారు. మామూలు వరిధాన్యానికి చెల్లించిన ధరనే తడిసిన ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని సీఎం స్పష్టం చేశారు. వ్యవసాయాన్ని కాపాడుతూ రైతుల కష్టాల్లో భాగస్వామ్యం పంచుకోవడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ తెలిపారు. గతానికి భిన్నంగా అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో యాసంగి వరి కోతలు మార్చి నెలలోపే వచ్చే విధంగా ఎటువంటి విధానాలు పాటించాలో అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ దిశగా రాష్ట్ర రైతాంగాన్ని చైతన్యం చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.

యాసంగి ధాన్యం కొనుగోలు

అకాల వర్షాలు కొనసాగుతున్న కారణంగా వరికోతలను మరో మూడు నాలుగు రోజులు వాయిదా వేసుకోవడం మంచిదని రైతులకు సీఎం కేసీఆర్ సూచించారు. మంగళవారం సచివాలయంలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు తీరు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షాలపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నో రాష్ట్రాలను అధిగమిస్తూ తెలంగాణ రైతులు వరి ధాన్యాన్ని పండిస్తున్నారన్నారు. అదే సందర్భంలో ఎంత పండిస్తే అంత పంటను గింజలేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కష్టాలకోర్చైనా రైతుల కల్లాలకాడికే పోయి సేకరిస్తున్నామన్నారు. రైతుల కోసం చిత్తశుద్ధితో కార్యాచరణ అమలు చేస్తున్న ప్రభుత్వం ఈ దేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అకాలంగా కురుస్తున్న వడగండ్ల వానలు ఎడతెరిపిలేకుండా కొనసాగుతుండడం బాధాకరమన్నారు.

రూ.10 వేల పరిహారం

వడగండ్ల వానలతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 10 వేల రూపాయలను అందిస్తూ ఇప్పటికే ఆదుకుంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఆర్థికంగా రాష్ట్ర ఖజానాకు ఎంత భారమైనా వెనుకంజ వేయకుండా రైతన్నలను ఆదుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నదన్నారు. యాసంగి వరి ధాన్యం తడుస్తున్న నేపథ్యంలో..రైతన్నల ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకుందని, వారి కష్టాన్ని పంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సిద్ధమైందన్నారు. తడిసిన వరి ధాన్యాన్ని కూడా సేకరించాలని నిర్ణయించిందన్నారు. వీలైనంత త్వరగా ఒక్క గింజ కూడా పోకుండా వరిధాన్య సేకరణ పూర్తి చేస్తామన్నారు. రైతన్నలు ఏమాత్రం ఆందోళన చెందవద్దని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

మరో మూడు రోజులు ఆగండి

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే యాసంగి వరిధాన్యం సేకరణ జరుగుతోందని, ఆ వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ధాన్యం సేకరణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని, కొన్ని చోట్ల అకాల వానలు కొనసాగుతుండడంతో సేకరణకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని అధికారులు వెల్లడించారు. అయినా త్వరలోనే ధాన్య సేకరణ పూర్తి చేయనున్నట్టు సివిల్ సప్లైస్ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ సీఎం కేసీఆర్ కు వివరించారు. మరో మూడు నాలుగు రోజులపాటు వానలు కొనసాగనున్నాయని అధికారులందించిన వివరాల మేరకు....అప్పటిదాకా వరిపంటను కోయకుండా సంయమనం పాటించడం మంచిదని రైతులకు సీఎం సూచించారు.

ముందస్తుగా నాట్లు, మార్చి నెలాఖరుకు కోతలు పూర్తి

అకాల వానలను గుణపాఠంగా తీసుకుని భవిష్యత్తులో నష్టాలు జరగకుండా ముందస్తు అవగాహనను ఏర్పరుచుకోవాలని అటు వ్యవసాయ శాఖకు, ఇటు రైతాంగానికి సీఎం కేసీఆర్ సూచించారు. ప్రతి ఏటా మార్చినెలాఖరుకల్లా యాసంగి వరికోతలు పూర్తయ్యేలా రైతాంగం వరిని ముందస్తుగానే నాటుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. మార్చి నెల తర్వాత అకాల వానలు పడే అవకాశాలున్నందున ఆ లోపే కోతలు పూర్తి చేసుకోవడం మంచిదన్నారు. ఏప్రిల్, మే నెలలు వచ్చేదాకా వరిపంట నూర్పకుంటే ఎండలు ఎక్కువయ్యి ధాన్యంలో నూకశాతం పెరిగిపోతుందన్నారు. అకాల వానల నుంచి తప్పించుకోవటం ఇటు నూకలు కాకుండా ఉండాలంటే మార్చి నెలాఖరుకల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ కోతకొచ్చేలా ముందస్తుగానే నాట్లు వేస్తుకోవాలని రైతాంగానికి సీఎం సూచించారు. అదే సందర్భంలో... ఫర్టిలైజర్స్ వాడే విషయంలో కూడా రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి

రాష్ట్రంలో నిర్మించిన రైతు వేదికలను వేదికగా చేసుకుని వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అలసత్వం వహిస్తే కఠిన చర్యలుంటాయన్నారు. ఈ దిశగా పనితీరును పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సీఎం ఆదేశించారు. తెలంగాణ వ్యవసాయం అత్యంత వేగంగా పురోగతిని సాధిస్తుందని తెలిపారు. ఈ స్పీడును అందుకునే దిశగా వ్యవసాయశాఖ నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏ మాత్రం అలసత్వం వహించినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ప్రభుత్వ వ్యవసాయ విధానాలను, లక్ష్యాలను అర్థం చేసుకుంటూ మరింత డైనమిక్ గా పనిచేయాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు.

IPL_Entry_Point