TS Government Whips : ప్రభుత్వ విప్ లుగా నలుగురు ఎమ్మెల్యేలు - నియామక ఉత్తర్వులు జారీ
Telangana Government Whips : తెలంగాణ ప్రభుత్వ విప్లుగా నలుగురు ఎమ్మెల్యేలను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, రామచంద్రు నాయక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను నియమిస్తున్నట్లు ప్రకటన విడుదలైంది.
Government Whips in Telangana Assembly: ప్రభుత్వ విప్లుగా నలుగురు ఎమ్మెల్యేలు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణా శాసనసభలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్గా నియామకమయ్యారు.
విప్ అంటే… దీనికి ఆదేశం అని అర్థం వస్తుంది. ఒక రాజకీయ పార్టీ పార్లమెంటు లేదా శాసనసభలో తమ సభ్యులు ఎలా వ్యవహరించాలో తెలియజేస్తూ జారీ చేసే ఆదేశాన్ని విప్ అంటారు. తాజాగా నియమితులైన నలుగురు విప్ లు కూడా తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే సామాజిక వర్గాలను పరిగణనలోకి తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం… ఈ పదవులను కట్టబెట్టినట్లు తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి గెలిచిన యాదవ సాామాజికవర్గానికి చెందిన ఐలయ్యను విప్ గా నియమించారు. ఇక మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన వేమలువాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు… ఎస్సీ సామాజికవర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు… ఎస్టీ సామాజికవర్గానికి చెందిన రామచంద్రు నాయక్ ను విప్ గా నియమించారు. ఫలితంగా ఇద్దరు బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీకి ఈ పదవులను కేటాయించినట్లు అయింది.
మరోవైపు ప్రభుత్వ చీఫ్ విప్ కు సంబంధించి కూడా నియామక ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. ఈ పదవి కోసం…. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మల్ రెడ్డి రంగారెడ్డితో పాటు వేముల వీరేశం, వివేక్ తో పాటు పలువురి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.