KCR Letter : బీఆర్‌ఎస్‌పై బీజేపీ దాడులు చేస్తోంది.. పార్టీ శ్రేణులకు కేసీఆర్ సందేశం-cm kcr open letter to brs activists and telangana people ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Cm Kcr Open Letter To Brs Activists And Telangana People

KCR Letter : బీఆర్‌ఎస్‌పై బీజేపీ దాడులు చేస్తోంది.. పార్టీ శ్రేణులకు కేసీఆర్ సందేశం

HT Telugu Desk HT Telugu
Mar 20, 2023 05:48 PM IST

KCR Open Letter : బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కేసీఆర్ ఆత్మీయ సందేశం పంపారు. ప్రజల ఆశీర్వాదం, నిబద్ధతో కలిగిన లక్షలాది కార్యకర్తల కృషితో రెండు సార్లు బీఆర్ఎస్ అధికార పగ్గాలు చేపట్టిందని తెలిపారు.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్

అన్నంతినో అటుకులు తినో.. ఉపాసం వుండో 14ఏండ్లు పేగులు తెగేదాక కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. అధికారం లేకున్నా ఉద్యమ కాలంలో జెండా భుజాన వేసుకొని.. రేయింబవళ్లు శ్రమించి పార్టీని కాపాడుకున్న కీర్తి గులాబీ సైనికులకే దక్కుతుందని చెప్పారు. ఈ మేరకు పార్టీ శ్రేణులకు బహిరంగ లేఖ రాశారు.

ట్రెండింగ్ వార్తలు

కేసీఆర్ రాసిన లేఖలో ఏం ఉందంటే..

ప్రజల ఆశీర్వాదం.. నిబద్ధత కలిగిన లక్షలాది కార్యకర్తల అసమాన కృషితో అపురూప విజయాలు సాధించి రెండుసార్లు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికార పగ్గాలు చేపట్టింది. ఉద్యమ వీరులుగా ఆనాడు.. నవ తెలంగాణ నిర్మాణయోధులుగా ఈనాడు పట్టుదల.. అంకితభావంతో పనిచేస్తూ అపూర్వ విజయాలు సాధించిపెట్టింది మీరే..! మీరిచ్చిన బలంతోనే 60 లక్షల సభ్యత్వంతో అజేయమైన శక్తిగా ఎదిగింది. బీఆర్ఎస్.. పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఎవ్వరికీ సాధ్యంకాని.. ఏకపక్ష విజయాలు సాధిస్తూ రికార్డులను తిరగరాసింది. 21 ఏండ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని.. ఆటుపోట్లను తట్టుకొని మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతూ గమ్యాలను ముద్దాడిన గట్టిసిపాయి మన పార్టీ!

కష్టసుఖాలల్లో కలిసినడుస్తూ.. ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ పల్లెల్లో... గల్లీల్లో గులాబీ పతాకాన్ని పరెపలాడించి నాకు కొండంత అండగా నిలిచిన మీ రుణాన్ని ఎన్నడూ తీర్చుకోలేను..! ఇతరులకు పాలిటిక్స్ అంటే గేమ్.. బీఆర్ఎస్ కు మాత్రం టాస్క్..! రాజకీయాన్ని ప్రజల ఆకాంక్షలను నెరవెర్చే పవిత్ర కర్తవ్యంగా భావించి కొత్తపంథాలో నడుస్తూ కోటి ఆశలతో ఏర్పడ్డ తెలంగాణను కోటి కాంతులు విరజిమ్మే నేలగా తీర్చిదిద్దుకున్నం

కష్టాలు.. కన్నీళ్లు.. కరువులతో అల్లాడిన తెలంగాణ.. ఇవ్వాళ పచ్చని పంటలతో చిరునవ్వులతో కళకళలాడుతున్నది..! ఆగమైపోయిన తెలంగాణ నేడు కుదుటపడ్డది.. కడుపునిండాతిని.. కంటినిండా నిద్రపోతున్నది.. ఒక్కో పథకం ఒక్కో ఆణిముత్యమై దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది..! కలలో కూడా ఊహించని కార్యాలను చేపట్టి.. అసాధ్యం అనుకున్న పనులు సుసాధ్యం చేసి చూపించి... తెలంగాణను దేశానికి నమూనాగా నిలబెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం.! అడిగినవీ.. అడగనవీ.. చెప్పినవీ.. చెప్పనవీ ఎన్నో పనులుచేస్తూ.. అందరి బంధువుగా నిలిచాం..ఏ వర్గాన్నీ చిన్నబుచ్చలేదు.. ఏ ఒక్కరినీ విస్మరించలేదు..! మనకు కులం లేదు.. మతం లేదు.. తెలంగాణ సమాజానికి పొత్తుల సద్దిమూట బీఆర్ఎస్... సంపదను పెంచుతూ.. ప్రజలకు పంచుతూ భారతదేశాన్ని సాకే ఐదారు రాష్ట్రాల్లో ఒకటిగా అవతరించి ఉజ్వలంగా వెలుగొందుతున్నది తెలంగాణ.. !

మనం ఇట్లావుంటే.. దేశం కథ ఇంకోలెక్కన వుంది..! 75 ఏండ్ల స్వతంత్రం తర్వాత కూడా కోట్లాది మందికి తాగడానికి నీళ్లులేవు.. తినడానికి తిండిలేదు..! నదుల నిండా నీళ్లున్నా.. పొలాలకు సాగునీళ్లు రాలేదు. కరెంట్ కష్టాలు తీరలేదు. అన్నీ వనరులూ వసతులూ వుండికూడా భారతదేశం భంగపడుతున్నది. చైనా.. సింగపూర్.. దక్షిణ కొరియా లాంటి దేశాలు అద్భుతమైన ప్రగతిని సాధిస్తుంటే మనం ఇంకా కులాల, మతాల కుమ్ములాటల్లో మునిగిపోయి ముందడుగు వేయలేకపోతున్నం..!

మన ఒక్క రాష్ట్రం బాగుంటే సరిపోదు.. దేశం కూడా బాగుండాలి. దేశాన్ని ఇన్నాళ్లు పాలించిన కాంగ్రెస్.. బీజేపీ పార్టీలకు తెలివి లేదు.. విజన్ లేదు.. సంకల్పం లేదు. అందుకే దేశానికి కొత్త ఎజెండాను నిర్దేశించి.. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు భారత రాష్ట్ర సమితిగా మరో ప్రస్థానాన్ని మొదలుపెట్టినం. ఏదైనా పని మొదలు పెడితే.. కడదాకా కాడిదించే అలవాటేలేని ఉక్కు సంకల్పం మనది.

అబ్కీ బార్ కిసాన్ సర్కారు నినాదం ఎత్తుకొని దేశం కోసం బయలెల్లిన మన పార్టీ పైన కేంద్రంలోని బీజేపీ పార్టీ బరితెగింపు దాడులు చేస్తూ.. తెలంగాణ ప్రగతిని అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నది. వేల దాడులు.. లక్షల కుట్రలను ఛేదించి నిలిచి గెలిచిన పార్టీ మనది. నాడు మనం భయపడితే తెలంగాణ వచ్చేదా? సాహసమే ఊపిరిగా సాగుతున్న ప్రయాణంలో.. మీరే నా బలం.. మీరే నా బలగం..!

తెలంగాణ చైతన్యం తొణికిసలాడే గడ్డ. ప్రజలే కేంద్రం బిందువుగా.. వారి సమస్యలే ఇతివృత్తంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ సమాజం ఎన్నడూ వదులుకోదు. చిల్లర మల్లర రాజకీయ శక్తులను ఎప్పుడూ ఆదరించదు. తెలంగాణతో బీఆర్ఎస్ పార్టీది పేగుబంధం. పురిటిగడ్డపైన మరోసారి గులాబీ పార్టీ మరోసారి బ్రహ్మాండమైన విజయం సాధించడం తథ్యం..!

ఇది ఎన్నికల సంవత్సరం.. నిరంతరం ప్రజల్లో వుంటూ పనికిమాలిన పార్టీలు పనికట్టుకొని చేసే దుష్ప్రచారాలను అప్రమత్తతతో తిప్పికొట్టాలి. భారత రాష్ట్ర సమితిని మరింత బలోపేతం చేసే బాధ్యత మీ భుజ స్కంధాలపైనే వుంది. ధర్మమే జయిస్తుంది..!

IPL_Entry_Point

టాపిక్