BRS public meeting in Nanded: నాందేడ్‌లో 5న బీఆర్ఎస్ బహిరంగ సభ..-brs to hold public meeting in nanded on feb 5 its first rally outside telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Brs To Hold Public Meeting In Nanded On Feb 5 Its First Rally Outside Telangana

BRS public meeting in Nanded: నాందేడ్‌లో 5న బీఆర్ఎస్ బహిరంగ సభ..

HT Telugu Desk HT Telugu
Jan 30, 2023 03:46 PM IST

ఇటీవల ఖమ్మంలో జరిగిన తొలి బహిరంగ సభ విజయవంతం కావడంతో, తెలంగాణ వెలుపల తొలి సమావేశం మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఫిబ్రవరి 5న నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్ వర్గాలు సోమవారం తెలిపాయి.

జనవరి 19న ఖమ్మం బహిరంగ సభలో కేసీఆర్
జనవరి 19న ఖమ్మం బహిరంగ సభలో కేసీఆర్ (Mohammed Aleemuddin)

హైదరాబాద్: ఇటీవల ఖమ్మంలో జరిగిన తొలి బహిరంగ సభ విజయవంతం కావడంతో, తెలంగాణ వెలుపల తొలి సమావేశం మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఫిబ్రవరి 5న భారత రాష్ట్ర సమితి నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు సోమవారం తెలిపాయి. తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలు ఇటీవల పొరుగు రాష్ట్రానికి వెళ్లి జన సమీకరణ ప్రణాళికలతో సహా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ట్రెండింగ్ వార్తలు

‘తెలంగాణ వెలుపల బిఆర్‌ఎస్‌కి ఇది మొదటి సమావేశం. కేసీఆర్ (కె.చంద్రశేఖర్ రావు) ఈ సభలో ప్రసంగిస్తారు. నాందేడ్ ప్రాంతానికి చెందిన కొందరు ముఖ్య నాయకులు పార్టీలో చేరే అవకాశం ఉంది’ అని పార్టీ వర్గాలు తెలిపాయి. కేసీఆర్ నాందేడ్‌లోని ప్రసిద్ధ గురుద్వారాను సందర్శించి, సమావేశానికి ముందు ప్రార్థనలు చేసే అవకాశం ఉందని వారు తెలిపారు. 

నాందేడ్ జిల్లా తెలంగాణకు సమీపంలో ఉంది. అలాగే తెలుగు మాట్లాడే ప్రజలు గణనీయమైన సంఖ్యలో ఉన్నందున ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై పొరుగు రాష్ట్రంలోని పలు గ్రామాలను తెలంగాణలో కలపాలని అక్కడి వారు భావిస్తున్నారని కేసీఆర్ గతంలో మీడియా ప్రతినిధులతో చెప్పారు. 

2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌ నినాదం ‘అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ (ఈసారి రైతుల సర్కారు) అని పేర్కొన్న కేసీఆర్‌.. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు అత్యధికంగా కొనసాగుతున్నాయని ఇటీవల అన్నారు. నాందేడ్‌ సమావేశంలో రైతుల సమస్యలపైనే కేసీఆర్ ప్రసంగం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

పరేడ్ గ్రౌండ్‌లోనూ సభ

సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో కూడా బీఆర్‌ఎస్ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బీహార్ డిప్యూటీ సిఎం తేజస్వి యాదవ్, జెడి(యు) జాతీయ అధ్యక్షుడు లాలన్ సింగ్ (బీహార్ సిఎం నితీష్ కుమార్ ప్రతినిధిగా హాజరుకానున్నారు) బహిరంగ సభకు హాజరు కానున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్, ఇతర ప్రముఖులు హాజరవుతారని తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గత వారం ఒక ప్రకటనలో తెలిపారు. 

బహిరంగ సభకు ముందు ఆ రోజు ఇక్కడ తెలంగాణ కొత్త సచివాలయ సముదాయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా నాయకులు హాజరుకానున్నారు. వేద పండితులు సూచించిన శుభ ముహూర్తం ఫిబ్రవరి 17న ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య బీఆర్ అంబేద్కర్ పేరు మీద ఉన్న భవనాన్ని కేసీఆర్ ప్రారంభిస్తారని రెడ్డి తెలిపారు.

WhatsApp channel