Gurukala Student Suicide: రంజోల్‌ గురుకులంలో ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య-an inter student committed suicide in ranjol gurukulam of sangareddy district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Gurukala Student Suicide: రంజోల్‌ గురుకులంలో ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య

Gurukala Student Suicide: రంజోల్‌ గురుకులంలో ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య

HT Telugu Desk HT Telugu

Gurukala Student Suicide: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పరిధిలోని రంజోల్‌లోని గురుకులంలో ఆదివారం ఇంటర్‌ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య

Gurukala Student Suicide: సంగారెడ్డి జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం గీతం యూనివర్సిటీలో చదువుతున్న యువతీ బిల్డింగ్ మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవకముందే, ఆదివారం రోజు జహీరాబాద్ మండల పరిధిలోని రంజోల్ గ్రామంలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ చదువుతున్నవిద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని తూముకుంట గ్రామానికి చెందిన బేగరి రాజు, వనజ దంపతులకు ఇద్దరు కుమార్తెలు స్వప్న, స్వాతి ఒక కుమారుడు ప్రశాంత్ ఉన్నారు.

పెద్ద కూతురు స్వప్న(17) జహీరాబాద్ మండలం రంజోల్ గురుకుల పాఠశాలలో ఇంటర్(బైపీసీ) మొదటి సంవత్సరం అక్కడే హాస్టల్ లో ఉండి చదువుకుంటుంది. స్వప్న ఆదివారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్న సమయంలో పుస్తకాలు తెచుకుంటానని చెప్పి తన హాస్టల్ గదికి వెళ్ళింది.

హాస్టల్‌ గదిలోనే స్వప్న ఫ్యాన్ కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. పుస్తకాలు తెచ్చుకుంటానని వెళ్లిన బాలిక ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో తోటి విద్యార్థులు వెళ్ళి కిటికీలోనుండి చూడగా స్వప్న ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. విద్యార్థులు వెంటనే ఉపాధ్యాయులకు తెలిపారు.

వెనువెంటనే వారు స్వప్నని జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. ఆమెను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధృవీకరించారు. విషయం తెలుసుకున్న తల్లితండ్రులు అక్కడికి చేరుకొని భోరున విలపించారు. స్వప్న మృతితో తూముకుంట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

విద్యార్థిని స్వప్న మృతిచెందిన విషయం తెలుసుకున్న జహీరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు గురుకుల పాఠశాలకు చేరుకొని మృతిపై వివరాలు తెలుసుకునేందుకు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

అప్పటికే ఈ ఘటనపై తూముకుంట గ్రామస్థులు, సామాజిక సంఘాల వారు గురుకులానికి వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలనీ ఆందోళనకు దిగడంతో, ఎమ్మెల్యే కూడా వారితో కలిసి ఆందోళనకు మద్దతు పలికారు . విద్యార్థిని కుటుంబానికి తగిన సహాయం చేసి ఆదుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

జ్యూడిషియల్‌ విచారణ జరిపించాలని ఎమ్మెల్యే మాణిక్ రావు డిమాండ్ చేసారు. దోషులు ఎవరో కనిపెట్టి, వారిని తగిన విదంగా శిక్షించాలని అన్నారు. జహీరాబాద్ ఆర్డీవో వెంకట్ రెడ్డి మాట్లాడుతూ బాలిక కుటుంబానికి నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి అవుట్ సోర్సింగ్‌ ఉద్యోగం కలిపించాలని నివేధిక పంపిస్తామన్నారు.

జహీరాబాద్‌ మండలం తూంకుంటకు చెందిన బాలిక సాంఘిక సంక్షేమశాఖ బాలికల గురుకుల కళాశాలలో అయిదో తరగతి నుంచి చదువుతూ.. ప్రస్తుతం ఇంటర్‌కు చేరుకుంది. వార్షిక పరీక్షల షెడ్యూల్‌ రావడంతో గురుకులంలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది.