Amith Sha Telangana Tour : 16న హైదరాబాద్‍కు అమిత్ షా - టూర్ షెడ్యూల్ ఇదే-amit shah to attend telangana liberation day event in hyderabad on sept 17 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Amith Sha Telangana Tour : 16న హైదరాబాద్‍కు అమిత్ షా - టూర్ షెడ్యూల్ ఇదే

Amith Sha Telangana Tour : 16న హైదరాబాద్‍కు అమిత్ షా - టూర్ షెడ్యూల్ ఇదే

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 13, 2023 11:07 AM IST

Amit Shah Telangana Tour:కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈనెల 16వ తేదీనే రాష్ట్రానికి రానున్న ఆయన.. 17వ తేదీన నిర్వహించే తెలంగాణ విమోచన వేడుకల్లో పాల్గొంటారు.

కేంద్రమంత్రి అమిత్ షా (ఫైల్ ఫొటో)
కేంద్రమంత్రి అమిత్ షా (ఫైల్ ఫొటో)

Amit Shah Telangana Tour Updates: మరికొద్దిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర నేతలు సీరియస్ కామెంట్స్ చేస్తుండగా... మరోవైపు జాతీయ పార్టీల అగ్రనేతలు రాష్ట్రానికి తరలిరానున్నారు. ఇప్పటికే సీడబ్యూసీ భేటీ కోసం హైదరాబాద్ ను ఖరారు చేయగా.. మరోవైపు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు బీజేపీ అగ్రనేత అమిత్ షా కూడా రానున్నారు. ఇందుకు సంబంధించిన టూర్ కూడా ఖరారైంది. ఫలితంగా ఇరు పార్టీల అగ్రనేతలు రాష్ట్రానికి వస్తున్న వేళ... తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారబోతున్నాయి.

మొదట అమిత్ షా టూర్ పై క్లారిటీ రాలేదు. తాజాగా చూస్తే... ఆయన ఈనెల 16వ తేదీనే హైదరాబాద్ కు రానున్నారు. రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. బీజేపీ తెలంగాణ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న నిర్వహించనున్న విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. 16 రాత్రి హైదరాబాద్ కు చేరుకోనున్న ఆయన... రాష్ట్ర నేతలతో కీలక సమావేశం నిర్వహించునున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు, రాష్ట్రంలోని పరిస్థితులతో పాటు జమిలీపై కూడా నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గతేడాది మాదిరిగా ఈ ఏడాది 17న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న విమోచన దినోత్సవంలో కేంద హోంమంత్రి అమిత్‌ షా ముఖ్యఅతిథిగా పాల్గొంటారని వెల్లడించారు. ఇందులో పాల్గొనాలని తెలంగాణతో సహా కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.

ఇక అమిత్ షా టూర్ చూస్తే... సెప్టెంబర్ 16వ తేదీ రాత్రి 7 తర్వాత ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ్నుంచి హైదరాబాద్‌లోని సీఆర్పీఎఫ్ సెక్టార్ ఆఫీసర్స్ మెస్‌కు చేరుకుని బస చేస్తారు.ఇక 17వ తేదీ ఉదయం 8.35 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌కు అమిత్ షా చేరుకుంటారు. పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే తెలంగాణ విమోచన వేడుకల్లో పాల్గొంటారు. అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. 11.15 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరుతారు. 11.50కి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారని తెలుస్తోంది.

అమిత్ షా టూర్ ను విజయవంతం చేసేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. పరేడ్ గ్రౌండ్ వేదికగా నిర్వహించే సభకు భారీగా జనాలను తరలించేలా కార్యాచరణను సిద్ధం చేసింది. ఇక ఈ వేదిక నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ పై అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం