SSMB28 Movie Update: మహేష్-త్రివిక్రమ్ మూవీకి షార్ట్ బ్రేక్.. ప్రారంభమయ్యేది అప్పుడేనా..!-ssmb28 movie shoot can possible to restart in 2023 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ssmb28 Movie Update: మహేష్-త్రివిక్రమ్ మూవీకి షార్ట్ బ్రేక్.. ప్రారంభమయ్యేది అప్పుడేనా..!

SSMB28 Movie Update: మహేష్-త్రివిక్రమ్ మూవీకి షార్ట్ బ్రేక్.. ప్రారంభమయ్యేది అప్పుడేనా..!

Maragani Govardhan HT Telugu
Nov 16, 2022 12:01 PM IST

SSMB28 Movie Update: మహేష్ బాబు నటించిన తాజా చిత్రం SSMB28. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడప్పుడే మొదలయ్యేలా కనిపించట్లేదు. తండ్రి మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న మహేష్ పరిస్థితి దృష్టిలో ఉంచుకున్న ఎస్ఎస్ఎంబీ టీమ్ కాస్త బ్రేక్ తీసుకోనుందని సమాచారం.

మహేష్-త్రివిక్రమ్ మూవీ
మహేష్-త్రివిక్రమ్ మూవీ

SSMB28 Movie Update: మహేష్ బాబుకు ఈ ఏడాది ఏ మాత్రం కలిసి రాలేదనేది వాస్తవం. ఎందుకంటే జనవరిలో ఆయన సోదరుడు రమేష్ బాబు కన్నుమూయగా.. సెప్టెంబరు 28న ఆయన తల్లి ఇందిరా దేవి తుదిశ్వాస విడిచారు. తాజాగా సూపర్‌స్టార్ కృష్ణ కూడా స్వర్గస్తులవడంతో మన ప్రిన్స్‌కు ఒకే ఏడాదిలో మూడు విషాదాలు చుట్టుముట్టాయి. దీంతో ఆయన ఆ క్లిష్టపరిస్థితుల నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. SSMB28గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఇటీవలే ఈ సినిమా షూటింగ్ వాయిదా పడగా.. తాజా పరిణామాల నేపథ్యలో ఈ ఏడాదిలో త్రివిక్రమ్ కాంబో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రారంభమయ్యేది అనుమానంగా మారింది. తండ్రి మరణంతో బాధల్లో ఉన్న మహేష్ ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే సమయం కావాలి. ఇందుకు కనీసం ఓ నెల రోజుల సమయమైన పడుతుంది.

త్రివిక్రమ్ టీమ్ ఇప్పటికే షూటింగ్ కోసం డిసెంబరు రెండో వారం నుంచి పలువురు నటీ, నటుల డేట్లను తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజా పరిణామాల దృష్ట్యా ఆయన తన ప్రయత్నాలకు కాస్త విరమించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని విషయాలను పరిశీలిస్తే.. ఈ సినిమా షూటింగ్ 2023లోనే తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలే ఈ సినిమా స్క్రిప్టుకు సంబంధించి చాలా వరకు మార్చారని సమాచారం. ఫలితంగా మొత్తం షూటింగ్ తిరిగి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

త్రివిక్రమ్ కాంబినేషన్‌లో అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరికి కాస్త గ్యాప్ రావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. మహేశ్‌తో హై యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటిగ్ బాధ్యతలు చూస్తున్నారు. మహేశ్ బాబుకు ఇది 28వ చిత్రం కావడం గమనార్హం. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం