Lok Sabha elections: లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ లో కేరళలో నలుగురు మృతి-lok sabha elections 4 men collapse and die amid phase 2 voting in kerala ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Lok Sabha Elections: లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ లో కేరళలో నలుగురు మృతి

Lok Sabha elections: లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ లో కేరళలో నలుగురు మృతి

HT Telugu Desk HT Telugu
Apr 26, 2024 02:40 PM IST

Lok Sabha Phase 2 elections: 2024 లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. కేరళలో మధ్యాహ్నం 12.30 గంటల వరకు 34 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, పోలింగ్ సందర్భంగా వేర్వేరు ఘటనల్లో కేరళలో నలుగురు మృతి చెందారు.

పాలక్కాడ్ లోని ఒక పోలింగ్ బూత్ లో ఓటు వేస్తున్న వ్యక్తి
పాలక్కాడ్ లోని ఒక పోలింగ్ బూత్ లో ఓటు వేస్తున్న వ్యక్తి (AP)

Lok Sabha Phase 2 elections: 2024 లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ శుక్రవారం ప్రారంభమైన తర్వాత కేరళలోని వివిధ ప్రాంతాల్లో నలుగురు మరణించారు. మృతుల్లో ముగ్గురు ఓటర్లు కాగా, ఒకరు పోలింగ్ ఏజెంట్ అని అధికారులు తెలిపారు. కేరళలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.

నలుగురు దుర్మరణం

2024 లోక్ సభ ఎన్నికల రెండో దశ (Lok Sabha Phase 2 elections) పోలింగ్ సందర్భంగా కేరళలోని పాలక్కాడ్ నియోజకవర్గం పరిధిలోని ఒట్టపాలెంలో 68 ఏళ్ల ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం కుప్పకూలిపోయారు. అతడిని వెంటనే హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే, అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. శుక్రవారం ఒట్టపాలంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత, 39 శాతం తేమ నమోదైంది. కోజికోడ్ పట్టణంలోని బూత్ నంబర్ 16లో లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ పోలింగ్ ఏజెంట్ అనీస్ అహ్మద్ (66) కుప్పకూలి మృతి చెందాడు. కోజికోడ్ లో శుక్రవారం 33 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో పాటు 61 శాతం తేమ నమోదైంది. మలప్పురం జిల్లా తిరూర్ లో లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసి ఇంటికి తిరిగి వచ్చిన 63 ఏళ్ల మదర్సా టీచర్ కుప్పకూలి మృతి చెందారు. తిరూర్ లో శుక్రవారం 34 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, 60 శాతం తేమ నమోదైంది. అదేవిధంగా అలప్పుజ జిల్లాలోని అంబలప్పుజలో 76 ఏళ్ల వృద్ధుడు ఓటింగ్ ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మరణించారు. అంబలప్పుజలో శుక్రవారం 33 డిగ్రీల ఉష్ణోగ్రత, 68 శాతం తేమ నమోదైంది.

కేరళలో పోలింగ్

కేరళ (kerala)లో లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ (Lok Sabha Phase 2 elections) లో మధ్యాహ్నం 12.30 గంటల వరకు 34 శాతం పోలింగ్ నమోదైంది. కేరళలో మొత్తం 20 నియోజకవర్గాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. వయనాడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అభ్యర్థిత్వంపై సర్వత్రా ఆసక్తి నెలకొనగా, రాష్ట్రం నుంచి ఇద్దరు సిట్టింగ్ కేంద్ర మంత్రులు కూడా బరిలో ఉన్నారు. కేంద్ర సహాయ మంత్రి వి.మురళీధరన్ అట్టింగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. సమీప తిరువనంతపురం నియోజకవర్గంలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ ప్రెన్యూర్ షిప్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తో పోటీ పడుతున్నారు.

WhatsApp channel