Gautam Adani Retirement : గౌతమ్ అదానీ రిటైర్మెంట్.. అదానీ గ్రూప్స్‌ కొత్త బాస్ ఎవరు?-gautam adani retires soon who is new boss to adani groups ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gautam Adani Retirement : గౌతమ్ అదానీ రిటైర్మెంట్.. అదానీ గ్రూప్స్‌ కొత్త బాస్ ఎవరు?

Gautam Adani Retirement : గౌతమ్ అదానీ రిటైర్మెంట్.. అదానీ గ్రూప్స్‌ కొత్త బాస్ ఎవరు?

Anand Sai HT Telugu

Gautam Adani Retirement : భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరైన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ పదవీ విరమణ చేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం అదానీ వయసు 62 ఏళ్లు కాగా ఆయన స్థానంలో త్వరలో కొత్త చీఫ్ రానున్నారు.

చిన్న మనవరాలితో గౌతమ్ అదానీ

గౌతమ్ అదానీ పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రిచ్ పర్సన్ ఇన్ ఇండియా. కోట్ల ఆస్తులు, ఎన్నో కంపెనీలు ఆయన సొంతం. ప్రస్తుతానికి అదానీ గ్రూప్స్ అధినేతగా ఆయనే కొనసాగుతున్నారు. అదానీ గ్రూప్ చైర్మన్ ఉన్న గౌతమ్ అదానీ వయసు ఇప్పుడు 62 ఏళ్లు. 70 ఏళ్ల వయసులో పదవి నుంచి వైదొలగాలని ఆయన యోచిస్తున్నారు. బ్లూమ్‌బెర్గ్ న్యూస్‌కి ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 2030 ల ప్రారంభంలో తన కుమారులు, వారి బంధువులకు అదానీ గ్రూప్స్ బాధ్యతలు అప్పగిస్తారు.

అదానీ పదవీ విరమణ చేసినప్పుడు అతని నలుగురు వారసులు తెరపైకి వస్తారు. అందులో అతని ఇద్దరు కుమారులు కరణ్, జీత్‌తోపాటుగా అతని బంధువులు ప్రణవ్, సాగర్ కుటుంబ ట్రస్ట్ సమాన లబ్ధిదారులుగా ఉంటారు. ఒక రహస్య ఒప్పందం వాటాలను వారసులకు బదిలీ చేయడాన్ని నిర్దేశిస్తుందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం గౌతమ్ అదానీ పెద్ద కుమారుడు కరణ్ అదానీ అదానీ పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉండగా, అతని చిన్న కుమారుడు జీత్ అదానీ అదానీ ఎయిర్‌పోర్ట్స్ డైరెక్టర్‌గా ఉన్నారు.

ప్రణవ్ అదానీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ డైరెక్టర్‌గా, సాగర్ అదానీ అదానీ గ్రీన్ ఎనర్జీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారని అదానీ గ్రూప్ వెబ్‌సైట్‌లో ఉంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం ప్రణవ్, కరణ్‌లలో ఎవరో ఒకరు చివరకు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టే సమర్థులుగా ఉన్నారని తెలుస్తోంది. 'వ్యాపార స్థిరత్వానికి వారసత్వం చాలా ముఖ్యం. పరివర్తన క్రమబద్ధంగా ఉండాలి. నేను ఎంపికను రెండో తరానికి వదిలేశాను.' అని గౌతమ్ అదానీ అన్నారు.

అదానీ పదవీవిరమణ చేసిన తర్వాత కూడా సంక్షోభం లేదా ముఖ్యమైన వ్యూహాత్మక సమయాల్లో ఉమ్మడి నిర్ణయం తీసుకోవడం కొనసాగుతుందని అదానీ పిల్లలు బ్లూమ్‌బెర్గ్‌కు వేర్వేరు ఇంటర్వ్యూలలో చెప్పారు.

అదానీ గ్రూప్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ మొదటి త్రైమాసికంలో రెట్టింపు లాభాలను ఆర్జించింది. పునరుత్పాదక శక్తిలో ఎక్కువ పెట్టుబడులు పెట్టడం ద్వారా కొత్త ఇంధన వ్యాపారాన్ని విస్తరించింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ తన ఫుడ్-ఎఫ్‌ఎంసీజీ విభాగాన్ని విల్మార్‌తో కలిపి నడుపుతుంది. ఎడిబుల్ ఆయిల్ మేజర్ అదానీ విల్మార్ లిమిటెడ్ ఈ వ్యాపారంపై మరింత దృష్టి సారించడం ద్వారా వాటాదారుల విలువను విస్తరించే వ్యూహంలో భాగంగా అదానీ కమోడిటీస్ LLPలో తన వ్యూహాత్మక పెట్టుబడులను చేస్తుంది. అదానీ విల్మార్ లిమిటెట్ అనేది అదానీ గ్రూప్, సింగపూర్‌కు చెందిన విల్మార్ గ్రూప్ మధ్య సమాన జాయింట్ వెంచర్. అదానీ కమోడిటీస్‌, విల్మార్‌లకు ఒక్కో కంపెనీలో 43.94 శాతం వాటా ఉంది. మిగిలిన 12 శాతం వాటా ఇన్వెస్టర్లకు చెందుతుంది.