TTD Tamil Nadu Issue: తమిళ ప్రజలకు టీటీడీ శీఘ్రదర్శనం పునరుద్ధరించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి-tamil nadu government appeals to restore ttd quick darshan to people ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Tamil Nadu Issue: తమిళ ప్రజలకు టీటీడీ శీఘ్రదర్శనం పునరుద్ధరించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి

TTD Tamil Nadu Issue: తమిళ ప్రజలకు టీటీడీ శీఘ్రదర్శనం పునరుద్ధరించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి

TTD Tamil Nadu Issue: టూరిజం కార్పొరేషన్లకు కేటాయించే శీఘ్రదర్శనం టిక్కెట్లను రద్దు చేయడం వల్ల తమిళప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో వాటిని పునరుద్ధరించాలని తమిళనాడు ప్రభుత్వం ఏపీకి విజ్ఞప్తి చేసింది. కొత్త పాలకమండలి ఏర్పాటయ్యాక అన్ని టూరిజం కార్పొరేషన్లకు దర్శనం టిక్కెట్లను టీటీడీ రద్దు చేసింది.

ఏపీ మంత్రులకు జ్ఞాపిక అందచేస్తున్న మంత్రి రాజేంద్రన్

TTD Tamilnadu Issue: తమిళనాడు ప్రజలకు టిటిడి శీఘ్రదర్శన టికెట్లను పునరుద్ధరించాలని, ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని తమిళనాడు టూరిజం మంత్రి రాజేంద్రన్ కోరారు. తమిళనాడు టూరిజం కార్పొరేషన్‌కు ఎప్పటిలాగే తిరుమల తిరుపతి శీఘ్ర దర్శన టిక్కెట్లను కేటాయించాలని ఆ రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి రాజేంద్రన్‌ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మంత్రి ఆనంకు లేఖను అందజేశారు.

చెన్నై నుంచి నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన తమిళనాడు పర్యాటక శాఖ మంత్రి రాజేంద్రన్‌కు మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ, ఎన్‌ఎండి ఫరూక్‌ ఘనస్వాగతం పలికారు. వేదపండితుల వేద ఆశీర్వాచనాలతో ఘనంగా సత్కరించారు.

1974వ సంవత్సరం నుంచి తమిళనాడు టూరిజం డెవలప్‌మెంటు కార్పొరేషన్‌కు టీటీడి దర్శన టిక్కెట్లను కేటాయిస్తుందని, దీంతో తమిళనాడులోని భక్తులు చాలామంది ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ శ్రీవారిని దర్శించు కుంటున్నారని మంత్రి రాజేంద్రన్‌ చెప్పారు.

తమిళనాడు నుంచి తిరుమల వెళ్లే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ ప్రభుత్వం టీటీడీ ద్వారా కల్పించిన అవకాశాన్ని భక్తుల సేవ కోసం వినియోగిస్తున్నట్లు తమిళనాడు టూరిజం మంత్రి రాజేంద్రన్‌ మంత్రి ఆనంకు వివరించారు.

అయితే ఇటీవల అన్ని టూరిజం కార్పొరేషన్లకు ఈ శీఘ్ర దర్శన టికెట్ల కోటాను టీటీడీ బోర్డు రద్దు చేసిందని, దీనిని వెంటనే పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన మంత్రి ఆనంకు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన మంత్రి ఆనం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.