CM Jagan Review On Cyclone : సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టండి, తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష
CM Jagan Review On Cyclone : తుపాను ప్రభావంపై సీఎం జగన్ కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించాలన్నారు.
CM Jagan Review On Cyclone : ఏపీలో మిచౌంగ్ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంపై 8 జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ... ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హుద్హుద్ లాంటి పెద్ద పెద్ద తుపాన్లను చూసిన అనుభవం మనకు ఉందన్నారు. తుపాన్లను ఎదుర్కోవడంలో ఏపీ యంత్రాంగానికి మంచి అనుభవం ఉందన్నారు. తుపాను పట్ల అప్రమత్తంగాఉండాలన్నారు. బాపట్ల సమీపంలో రేపు సాయంత్రం తుపాను తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారన్నారు. గంటకు 110 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్తున్నారన్నారు. 7వ తేదీ నాటికి పరిస్థితులు కుదుటపడే అవకాశాలున్నాయన్నారు. ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు నిధులు విడుదల చేశామన్నారు.
ధాన్యం సేకరణపై దృష్టి
అత్యవసర ఖర్చులకు ప్రతి జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున నిధులు ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని సీఎం జగన్ తెలిపారు. ప్రతి జిల్లాకు సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నామని, వీరంతా జిల్లా యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తారన్నారు. ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు. పశువులకూ ఎలాంటి ప్రాణనష్టం కలగకూడదన్నారు. కోతకు వచ్చిన ఖరీఫ్ పంటను కాపాడుకోవడం చాలా ముఖ్యమన్నారు. నిన్న ఒక్కరోజే 97 వేల టన్నులు ధాన్యాన్ని సేకరించామనమన్నారు. 6.5 లక్షల టన్నుల ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. పంటకోయని ప్రాంతాల్లో వీలైనంత మేర కోయకుండా వాయిదా వేసుకుంటే మంచిదని అధికారులు సూచిస్తున్నారన్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని, కోసిన ధాన్యాన్ని వెంటనే సేకరించడంపై అధికారులు దృష్టిపెట్టాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు. తేమ, రంగు లాంటి అంశాలను పట్టించుకోకుండా రైతులకు అండగా నిలవాలన్నారు. తుపాను దృష్ట్యా రైతులకు తోడుగా నిలవాలన్నారు.
రూ. 10 వేల సాయం
"తుపాను ప్రభావం ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. 308 శిబిరాల ఏర్పాటుకు గుర్తించామని, ఇప్పటివరకూ 181 తెరిచామని అధికారులు చెప్తున్నారు. అవసరమైన చోట వెంటనే శిబిరాలను తెరిచి ప్రజలను అక్కడకు తరలించాలి. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ 5, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ 5 సిద్ధంగా ఉన్నాయి. సచివాలయాలు, వాలంటీర్లను సమర్థవంతంగా వినియోగించుకోండి. సహాయక శిబిరాల్లో వచ్చే ప్రజలకు మంచి సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. మందులు, తాగునీరు, మంచి ఆహారం అందించాలి. క్యాంపు నుంచి ఇంటికి తిరిగి వెళ్లే ముందు ప్రతి ఒక్కరికీ రూ.1000 లేదా కుటుంబానికి గతంలో మాదిరిగా కాకుండా రూ.500 పెంచి రూ.2500 ఇవ్వాలి. క్యాంపులకు రాకుండా, ఇళ్లలోకి నీళ్లు చేరిన వారికి 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కిలోచొప్పున అందించాలి. గాలులు వల్ల, వర్షాల వల్ల గుడిసెల్లాంటివి దెబ్బతింటే వారికి రూ.10వేలు అందించాలి. తుపాను తగ్గు ముఖం పట్టిన 24 గంటల్లో వీటిని అందించాలి"-సీఎం జనగ్
వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య శిబిరాలు
తుపాను వల్ల వచ్చే వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాలన్నారు. విద్యుత్, రవాణా సౌకర్యాలకు అంతరాయం ఏర్పడితే వెంటనే యుద్ధ ప్రాతిపదికిన వాటిని సరిచేయాలన్నారు. సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై ప్రత్యేకాధికారులు దృష్టిపెట్టాలని ఆదేశించారు. ఒక ఫోన్ కాల్ దూరంలో మేం ఉంటామని, ఏం కావాలన్నా వెంటనే అడగాలన్నారు. సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.