MP Kesineni Nani :వైసీపీ ఎమ్మెల్యే, టీడీపీ ఎంపీ పరస్పరం ప్రశంసల వర్షం - అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని హామీ
MP Kesineni Nani : టీడీపీ, వైసీపీ నేతలు ఎప్పుడూ విమర్శలు చేసుకుంటూ ఉంటారు. అయితే నందిగామ నియోజకవర్గంలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. టీడీపీ ఎంపీ, వైసీపీ ఎమ్మెల్యే ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు.
MP Kesineni Nani : విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలు మరోసారి టీడీపీలో కలకలం రేపుతున్నాయి. ఇన్నాళ్లు అసంతృప్తితో ఉన్నా ఎప్పుడూ పార్టీపై కామెంట్స్ చేయని ఆయన.. ఏకంగా వైసీపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. అభివృద్ధి కోసం వైసీపీతో కలిసి పనిచేస్తానని అనడంతో టీడీపీ నేతలు ఇరుకున పడ్డారు. నందిగామలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని, స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ బాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఎమ్మెల్యే జగన్మోహన్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషిచేస్తు్న్నారన్నారు. టీడీపీ, వైసీపీ సిద్ధాంతాలు వేరైనా అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని అన్నారు.
ఇరుకున పడ్డ నందిగామ టీడీపీ నేతలు
నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు మండలం తోటరావులపాడులో ఎమ్మెల్యే జగన్మోహన్ తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎంపీ కేశినేని నాని ప్రారంభించారు. రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం అవ్వాలని ఆయన అన్నారు. అభివృద్ధి కోసం పార్టీలన్నీ కలిసి పనిచేయాలన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు కలిసి పనిచేస్తే దేశం చాలా అభివృద్ధి చెందుతుందని ఎంపీ కేశినేని నాని అన్నారు. నందిగామ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై స్థానిక టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వసూల్ బ్రదర్స్ అంటూ నందిగామ టీడీపీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విమర్శలు చేస్తు్న్నారు. అయితే టీడీపీ ఎంపీ కేశినేని నాని సడన్ గా ఎమ్మెల్యేపై ప్రశంసలు కురిపించడంతో నందిగామ టీడీపీ నేతలు ఇరుకున పడ్డారు. ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయి.
ఎంపీ కేశినేని నానిపై ఎమ్మెల్యే ప్రశంసలు
టీడీపీ ఎంపీ కేశినేనిపై వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు ప్రశంసలు కురిపించారు. కేశినేని నాని ప్రజా సమస్యలపై పోరాడుతూ, అభివృద్ధిలో ముందుంటారని కితాబిచ్చారు. టీడీపీ, వైసీపీ సిద్ధాంతాలు వేరైనా అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని ఆయన కూడా వెల్లడించారు. నందిగామ నియోజకవర్గంలో ఏ పనిచేయాలని అడిగినా, ఆయన వెంటనే చేస్తున్నారన్నారు. టాటా ట్రస్ట్ ద్వారా ఈ ప్రాంతంలో చాలా కార్యక్రమాలు చేపట్టారని కేశినేని నానిపై ప్రశంసలు కురిపించారు. అభివృద్ధిలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని కోరారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడే ప్రజలకు మంచి చేయగలమని ఎమ్మెల్యే జగన్మోహన్ రావు అన్నారు.
ఎంపీ కేశినేని నాని కామెంట్స్ పై నందిగామ టీడీపీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఎంపీ కేశినేని నాని కావాలనే ఈ వ్యాఖ్యలు చేశారా? తన తమ్ముడు కేశినేని చిన్ని వర్గానికి నందిగామ టీడీపీ నేతలు మద్దతు తెలుపుతున్నారా? ఇలా స్థానిక నేతలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా కేశినేని నాని వ్యాఖ్యలు వైసీపీకి ఒక అస్త్రాన్ని ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది.