Gorumudda: నేటి నుంచి జగనన్న గోరుముద్దలో మరో పోషకాహారం…-millet diet for school children in ap cm jagan will launch new diet under jagananna gorumudda scheme ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Gorumudda: నేటి నుంచి జగనన్న గోరుముద్దలో మరో పోషకాహారం…

Gorumudda: నేటి నుంచి జగనన్న గోరుముద్దలో మరో పోషకాహారం…

HT Telugu Desk HT Telugu

Gorumudda: జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా బడి పిల్లలకు ఇచ్చే ఆహారంలో మరో పోషకాహారాన్ని చేర్చారు. నేటి నుంచి బడి పిల్లలకు ఇచ్చే డైట్ మెనూలో రాగి జావను కూడా చేర్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు ఉదయం ఆహారంలో జావను అందిస్తారు.

సీఎం జగన్

Gorumudda: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు డైట్‌లో నేటి నుండి ఉదయం పూట రాగి జావ అందిస్తారు. జగనన్న గోరుముద్దలో భాగంగా నేటి నుండి వారానికి 3 రోజుల పాటు రాగి జావ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 44,392 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లోని 37,63,698 మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరుస్తూ ఏటా రూ. 86 కోట్ల అదనపు వ్యయంతో రాగిజావ అందించే కార్యక్రమాన్ని సీఎం క్యాంప్‌ కార్యాలయం నుండి లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌ లాంఛనంగా ప్రారంభించనున్నారు.

విద్యార్ధుల మధ్యాహ్న భోజన పథకాల కోసం గత ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఏటా సగటున రూ. 450 కోట్లు ఖర్చు చేస్తే దాదాపు 4 రెట్లు అధికంగా జగనన్న గోరుముద్ద పథకంలో ఏడాదికి చేస్తున్న రూ. 1,824 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం చెబుతోంది. తాజాగా విద్యార్ధులకు రాగి జావ అందించడానికి ఏటా మరో రూ. 86 కోట్లతో మొత్తం రూ. 1,910 కోట్ల రుపాయల వ్యయం చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

మధ్యాహ్న భోజన పథకంలో ఇప్పటికే సమూల మార్పులు చేసి జగనన్న గోరుముద్ద ద్వారా ప్రతి రోజూ విద్యార్ధులకు అందించే ఆహార పదార్థాల మెనూ మార్చి బలవర్ధకమైన, మెరుగైన, రుచికరమైన, నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నట్లు చెబుతున్నారు.

ఐరన్, కాల్షియం వంటి పోషకాలు అందించడం ద్వారా విద్యార్ధుల్లో రక్తహీనత, పోషకాల లోపాన్ని నివారించేందుకు వారానికి మూడు రోజులు , ప్రతి మంగళ, గురు, శనివారాల్లో బెల్లంతో కూడిన రాగిజావను విద్యార్ధులకు అందించనున్నారు. మిగిలిన 3 రోజులు గోరుముద్దలో భాగంగా చిక్కీలను అందిస్తారు.

జగనన్న గోరుముద్దలో భాగంగా ఇప్పటికే వారానికి 15 వెరైటీలు, ఐదు రోజుల పాటు గుడ్డు, 3 రోజులు చిక్కీ, ఇకపై 3 రోజులు రాగిజావ కూడా అందించనున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా చిరుధాన్యాలు పండించే రైతులకు ప్రోత్సాహంగా ఉంటుందని, ఈ ఏడాది అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం కావడం గమనార్హమని తెలిపారు.

గోరు ముద్దలో రాగి జావ అందించే పథకాన్ని అమలు చేయడానికి భాగంగా శ్రీ సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నారు. మరోవైపు గత ప్రభుత్వం ఇచ్చిన దానికి 3 రెట్లు అధికంగా వంట సహాయకులకు నెలకు రూ. 3,000 గౌరవ భృతి, క్రమం తప్పకుండా గోరుముద్ద బిల్లుల చెల్లిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం చెబుతోంది.