Godavari Floods: ధవళేశ్వరం వద్ద గోదావరి ఉద్ధృతి... ప్రమాద హెచ్చరికలు జారీ
Godavari Floods 2022 : మళ్లీ గోదావరి ఉప్పొంగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద ఉద్ధృతి దాటికి ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారిపోతున్నాయి. భద్రాచలం, ధవళేశ్వరం వద్ద ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.
flood at dowleswaram barrage: తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉద్ధృతి మరింతగా పెరిగింది. ఎగువ నుంచి వస్తున్న వరద దాటికి.. నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం 10.7 అడుగులకు చేరింది. 12 లక్షల 66వేల క్యూసెకుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా... రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.
నీటిమట్టం 53 అడుగులను దాటితే మూడో ప్రమాద హెచ్చరికను జారీచేస్తారు. మంగళవారం వర్షాలు కొనసాగడంతో గోదావరి బేసిన్లో ఎగువన వరద స్థిరంగా కొనసాగుతోంది. ఇప్పటికే కట్కూర్, కోయాది పరిధిలో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అల్లూరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గోదావరికి వరద పెరగటంతో...లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఈ ఏడాది ఇప్పటివరకు కలిసిన గోదావరి జలాలను పరిగణలోకి తీసుకుంటే.. ధవళేశ్వరం బ్యారేజ్ చరిత్రలో గోదావరికి ఈ ఏడాది వచ్చిన ప్రవాహం ఏడో అతిపెద్ద వరద ప్రవాహం.
భద్రాచలం వద్ద ఇలా…
భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వరద పెరిగింది. మంగళవారం రాత్రి 51.80 అడుగులుగా ఉన్న నీట్టం బుధవారం స్థిరంగా కొనసాగుతున్నది. బుధవారం ఉదయం 6 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 51.7 అడుగులగా ఉన్నది. ప్రస్తుతం 13.55 లక్షల క్యూసెక్కల నీరు ప్రవహిస్తున్నది. దీంతో అధికారులు రెండ్ర ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో భద్రాచలం నుంచి పలు ఊర్లకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల వెళ్లే రోడ్డుపై వరద ప్రవహిస్తున్నది.
తూరుబాక, నెల్లిపాక, బూర్గంపాడు మండలం సారపాక వద్ద రోడ్డుపైకి వరద చేరింది. కూనవరం, వీఆర్ పురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంత ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు.