03 March Telugu News Updates : విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-andhra pradesh and telangana telugu news updates 03 march 2023 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Andhra Pradesh And Telangana Telugu News Updates 03 March 2023

గ్లోబల్ సమ్మిట్‌ ప్రారంభించిన సిఎం జగన్, ముఖేష్ అంబానీ తదితరులు

03 March Telugu News Updates : విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్

12:52 PM ISTHT Telugu Desk
  • Share on Facebook
12:52 PM IST

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అంగరంగ వైభవంగా మొదలైంది . ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు  పారిశ్రామిక వేత్తల సమక్షంలో  ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సును ప్రారంభించారు. రెండ్రోజుల పాటు జరిగే సదస్సుకు దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు.

Fri, 03 Mar 202312:51 PM IST

తొలిరోజు ఎన్ని పెట్టుబడులు అంటే…

విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. తొలిరోజు రాష్ట్రంపై పెట్టుబడుల వర్షం కురిసింది. సమ్మిట్ తొలిరోజు రూ. 11, 87, 756 కోట్ల మొత్తంతో 92 ఎంవోయూలు చేసుకున్నట్టు సీఎం జగన్ వెల్లడించారు. ఫలితంగా దాదాపు 4 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. మిగిలిన 248 ఎంవోయూలను శనివారం (మార్చి 4వ తేదీన) కుదుర్చుంటామన్నారు. రెండో రోజు స‌మ్మిట్‌లో రూ. 1.15 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకోబోతున్నామని, దీని ద్వారా మరో 2 లక్షల మందికి పైగా ఉపాధి లభిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సమ్మిట్ ద్వారా మొత్తం 6 లక్షల మందికిపైగా ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయని ముఖ్యమంత్రి ప్రకటించారు.

Fri, 03 Mar 202312:00 PM IST

షర్మిల ప్రశ్నలు 

మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దీక్షను చేపట్టనున్నారు. ఢిల్లీ వేదికగా మార్చి 10వ తేదీన నిరాహార దీక్షను చేపట్టనున్నట్లు ప్రకటించారు. అయితే కవిత దీక్షపై ట్విట్టర్ వేదికగా స్పందించారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదు.. ప్రగతిభవన్ ముందు.. ఫామ్ హౌజ్ ముందు అంటూ హితవు పలికారు. బతుకమ్మ ఆడుతూ లిక్కర్ స్కామ్ కు పాల్పడిన మీరు.. మహిళలకే తలవంపు తెచ్చారంటూ కవితను టార్గెట్ చేశారు. ఇప్పుడు ఆ స్కాంను పక్కదారి పట్టించేందుకే ఈ కొత్త డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.

Fri, 03 Mar 202311:28 AM IST

కస్టడీ

నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహరకృష్ణను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు.

Fri, 03 Mar 202310:29 AM IST

గడ్కరీ కామెంట్స్ 

 గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగించారు. ఏపీ పారిశ్రామిక వృద్ధిలో రోడ్‌ కనెక్టివిటీ కీలకమని పేర్కొన్నారు. పరిశ్రమలకు లాజిస్టిక్స్ ఖర్చు తగ్గించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఏపీలో మూడు పారిశ్రామిక కారిడార్లు వస్తున్నాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో మత్స్య పరిశ్రమ చాలా కీలకంగా మారిందని గడ్కరీ పేర్కొన్నారు. రాష్ట్రంలో మల్టీ మోడల్‌ లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుకు సిద్ధమని ప్రకటించారు. 50-50 భాగస్వామ్యంతో లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు.

Fri, 03 Mar 202310:28 AM IST

కిసాన్ అగ్రి షో 

హైదరాబాద్ లో భారతదేశ అతిపెద్ద అగ్రి షో ‘కిసాన్’ ను తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారభించారు. ఈ షోలో దేశం నలుమూలలకు చెందిన 150కి పైగా ఎగ్జిబిటర్లు, 30 వేల మంది సందర్శకులు పాల్గొననున్నారు.

Fri, 03 Mar 202309:51 AM IST

షాకింగ్ వీడియో… 

హైదరాబాద్ లోని నాగోల్ లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రోడ్డుపై నడిచి వెళ్తున్న వ్యక్తిని అదుపుతప్పి వచ్చిన ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చేరాడు. కుషాయిగూడ సమీపంలోని నాగారంలో నివసించే జైకుమార్‌... నాగోలులోని ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం నాగోలులోని రామాలయం వద్ద నడుస్తూ సంస్థ కార్యాలయం వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు బలంగా ఢీకొంది. బాధితుడు అమాంతం గాల్లోకి ఎగిరి 15 అడుగుల దూరంలో పడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే 108లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారులోని మహిళ సైతం అతని వెంట ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించారు. ప్రస్తుతం అతనికి ప్రాణాపాయం లేదని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన సీసీ పుటేజీ వైరల్ గా మారింది

Fri, 03 Mar 202309:39 AM IST

కీలక నిర్ణయం 

ఎంసెట్ 2023 పరీక్షకు సంబంధించి మరో అప్డేట్ ఇచ్చింది జేన్టీయూ హైదరాబాద్. ప్రశ్నాపత్రాన్న కేవలం ఇంగ్లీష్ భాషలోనే కాకుండా... తెలుగు, ఉర్దూ భాషల్లోనూ ఇచ్చేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇంగ్లీష్ లోనే ప్రశ్నా పత్రం ఉండాలనే నిబంధనను సడలించారు. మే 7 నుంచి 11 వరకు జరగనున్న ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాప్రతాలు... ఇంగ్లీష్-తెలుగు, ఇంగ్లీష్-ఉర్దూ వెర్షన్ లలో ఉండనున్నాయి.

Fri, 03 Mar 202308:52 AM IST

అంబానీ ప్రసంగం

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా మొదలైంది . ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు పారిశ్రామిక వేత్తల సమక్షంలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సును ప్రారంభించారు. రెండ్రోజుల పాటు జరిగే సదస్సుకు దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. ఈ సదస్సులో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ మాట్లాడుతూ.... ఏపీ వేదికగా వ్యవసాయ, వాటి అనుబంధ ఉత్పత్తులకు సంబంధించిన పెట్టుబడులు పెడుతామని చెప్పారు. ఇక్కడ్నుంచి దేశవ్యాప్తంగా సరఫరా చేస్తామని అన్నారు.

Fri, 03 Mar 202308:05 AM IST

గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా  బిఆర్‌ఎస్ ఆందోళన

వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ సికింద్రాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ వద్ద నిర్వహించిన ధర్నాలో  మంత్రి తలసాని పాల్గొన్నారు.  ధరలను అదుపు చేయడంలో విఫలమైన మోడీ వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. అంబానీ... ఆదానీలకు దోచి పెట్టేందుకే గ్యాస్ ధరలు పెంచారని తలసాని ఆరోపించారు. తెలంగాణ లో అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు కలలు కంటున్నారని, 2024 లో కేంద్రంలో BJP ప్రభుత్వ పతనం ఖాయమన్నారు.  కంటోన్మెంట్ లోని ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఆర్మీ హాస్పిటల్ లో అనుమతించడం లేదని తలసాని ఆరోపించారు. 

Fri, 03 Mar 202307:38 AM IST

విశాఖ నుంచి పరిపాలనా కార్యక్రమాలు

విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో  సిఎం జగన్మోహన్‌ రెడ్డి కీలక ప్రకటన చేశారు.  త్వరలోనే తాను విశాఖపట్నం తరలి రానున్నట్లు చెప్పారు. విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధాని చేస్తున్నట్లు తెలిపారు. 

Fri, 03 Mar 202307:23 AM IST

బచ్చుల అర్జునుడు అంత్యక్రియల్లో పాల్గొన్న చంద్రబాబు

గుండెపోటుతో చికిత్స పొందుతూ  మరణించిన టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జును అంత్యక్రియలు మచిలీపట్నంలో జరిగాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ నాయకుడి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 

Fri, 03 Mar 202305:55 AM IST

ఏపీలో పుష్కలమైన అవకాశాలున్నాయన్న బుగ్గన

ఆంధ్రప్రదేశ్ లో సమృద్ధిగా సహజ వనరులు, అవకాశాలను అంది పుచ్చుకునేందుకు సిద్ధమైన  నైపుణ్యమైన  మానవవనరులు ఏపీలో ఉన్నాయని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.  వనరులు, వసతులు, ఆయా ప్రాంతాలలో ఉన్న అవకాశాలతోనే పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఏపీలో వనరులు అపారం..అవకాశాలు పుష్కలమని తెలిపారు.  వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని,  నైపుణ్య మానవ వనరులకు ఆంధ్రప్రదేశ్‌ చిరునామాగా ఉందన్నారు.  రెన్యువబుల్ ఎనర్జీ  రంగంలో అవకాశాలకు ఏపీకి పోటీయే లేదని గ్లోబల్ సమ్మిట్‌లో వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా మూడుసార్లు మొదటి స్థానం ఏపీదేనన్నారు. 

 

Fri, 03 Mar 202305:33 AM IST

కృష్ణా నదిలో ముగ్గురు యువకుల గల్లంతు

కృష్ణాజిల్లా చోడవరంలో  కృష్ణానదిలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గత రాత్రి నదీ తీరంలో మద్యం  సేవించేందుకు వచ్చిన యువకులు నీటిలోకి దిగడంతో గల్లంతయ్యారు. గల్లంతైన వారి  కోసం గజ ఈతగాళ్లతో పోలీసులు గాలింపు ప్రారంభించారు. ఘటనా స్థలం వద్ద స్కార్పియో వాహనం నిలిపి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మద్యం మత్తులో ప్రమాదానికి గురైనట్లు అనుమానిస్తున్నారు. 

Fri, 03 Mar 202305:30 AM IST

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రారంభం

విశాఖ ఆంధ్రా, యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి జగన్, ముఖేష్ అంబానీ సహా పలువురు ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ప్రారంభోత్సవంలో  పాల్గొన్నారు. 

Fri, 03 Mar 202304:25 AM IST

విశాఖ వేదికగా ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్

 విశాఖలో ఉదయం 10.15 గంటలకు గ్లోబల్ ఇన్వెస్టర్స్  సదస్సును  సీఎం జగన్  ప్రారంభించనున్నారు.  రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఒకే వేదికపైకి దేశ, విదేశీ కార్పొరేట్ దిగ్గజాలు వస్తున్నాయని ప్రభుత్వం చెబుతోంది.  కార్పొరేట్ దిగ్గజాలతోపాటు 45కు పైగా దేశాల నుంచి ప్రతినిధుల రానున్నారు.  ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం  వాణిజ్యవేత్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  14 కీలక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రముఖ కార్పొరేట్ ప్రతినిధుల ప్రసంగాలు.. ఒప్పందాలు  జరుగనున్నాయి. 

Fri, 03 Mar 202304:22 AM IST

రుయాలో రోగుల డబ్బుల మళ్లింపు

తిరుపతి  రుయా ఆస్పత్రిలో డేటా ఎంట్రీ ఆపరేటర్లపై కేసు నమోదు చేశారు.  ఆరోగ్య ఆసరా నిధులు పక్కదారి పట్టించినట్లు గుర్తించారు. 35 మంది నకిలీ రోగుల పేరిట నిధులు స్వాహా చేశారు.  డేటా ఎంట్రీ ఆపరేటర్లు తిరుమల, శివ, చెంచయ్యపై కేసు నమోదు చేశారు. 

Fri, 03 Mar 202304:22 AM IST

గుడివాడ అమర్‌నాథ్‌, కొడాలి నానిలకు వారెంట్లు

మంత్రి గుడివాడ అమర్నాథ్‍, మాజీ మంత్రి కొడాలి నానిలకు నాన్‍బెయిలబుల్ వారెంట్‌లు జారీ అయ్యాయి.  2018లో ప్రత్యేక హోదా, రైల్వేజోన్ డిమాండ్ చేస్తూ స్టేషన్‍లోకి అనధికారికంగా  ప్రవేశించినందుకు  అమర్నాథ్‍తో పాటు పలువురు వైసీపీ నేతలపై రైల్వే అధికారులు కేసు నమోదు చేశారు. - ఫిబ్రవరి 27న కోర్టుకు హజరుకాకపోవడంతో నాన్‍బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.  మరో కేసులు విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు కొడాలి నానికి వారెంట్లు జారి చేసింది. 

Fri, 03 Mar 202304:20 AM IST

పోలీసులపై తాగుబోతు వీరంగం

విశాఖ ఎయిర్‍పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి వీరంగం చేశాడు. - మద్యం తాగి అర్ధరాత్రి ఇద్దరు కానిస్టేబుళ్లపై  దాడికి పాల్పడ్డాడు.  దాడిలో కానిస్టేబుల్‍కు తీవ్రగాయాలు కావడంతో   ఆస్పత్రికి తరలించారు. 

Fri, 03 Mar 202305:36 AM IST

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయనివ్వాలని ఆదేశం

ఏపీలో ఉద్యోగులను గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు ఉద్యోగులను అవకాశం కల్పించాలంటూ చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఓటేసేందుకు వెసులుబాటు కల్పించాలని సీఈఓ ఆదేశించారు. పోలింగ్‌లో పాల్గొని వచ్చే వారు విధులకు ఆలస్యంగా హాజరయ్యేందుకు అనుమతివ్వాలని సీఈఓ ఆదేశాలు జారీ చేశారు.