TSPSC Group 1 : బిగ్ బ్రేకింగ్ - తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు
19 February 2024, 17:04 IST
- TSPSC Cancelled Group 1 Notification: గ్రూప్ -1 పరీక్షపై కీలక నిర్ణయం తీసుకుంది టీఎస్పీఎస్సీ. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేసింది.
తెలంగాణ గ్రూప్ 1
TSPSC Cancelled Group 1 Notification: గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేసింది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది. 503 పోస్టుల తో ఇచ్చిన గత నోటిఫికేషన్ కు రెండు సార్లు ఎగ్జామ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. రెండు సార్లు కూడా పరీక్ష రద్దు అయింది. త్వరలోనే 60 పోస్టులను కలిపి 563 పోస్టుల తో కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు TSPSC సిద్థమవుతున్నట్లు తెలుస్తోంది.
గ్రూప్ 1 పరీక్ష ఇప్పటికి రెండుసార్లు రద్దవడంతో అభ్యర్థులు నిరాశకు లోనవుతున్నారు. అయితే గతంలో టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ సమయంలో పరీక్షలు మళ్లీ నిర్వహించాలని పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
2022లో నోటిఫికేషన్….2 సార్లు పరీక్ష
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022 ఏప్రిల్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం 503 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రకటన జారీ అయింది. 2022 అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. ఆ తర్వాత ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం వెలుగు చూడటంతో పరీక్షను కమిషన్ రద్దు చేసింది. ఆ తర్వాత మరోసారి పరీక్షను నిర్వహించింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇందులో భాగంగా… 2023 జూన్ 11 రెండోసారి పరీక్షను నిర్వహించారు. 2023 జూన్లో నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు 2.33 లక్షల మంది ప్రిలిమ్స్ పరీక్ష రాశారు. పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయని, అభ్యర్థుల బయో మెట్రిక్ తీసుకోలేదని, ప్రిలిమినరీ పరీక్ష రోజున ఇచ్చిన విద్యార్ధుల సంఖ్యకు.. తుది కీ విడుదల సమయంలో ఇచ్చిన హాజరు సంఖ్యకు పొంతన లేదంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు న్యాయస్థానం పరీక్ష రద్దు చేసి మరోసారి నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా రద్దు చేయాలని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ న్యాయ నిపుణులతో చర్చించి సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. గతేడాది అక్టోబరు నుంచి విచారణ జరగలేదు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఇప్పటికే కొత్త పాలక మండలి ఏర్పడింది. దీంతో గ్రూప్-1 పరీక్ష నిర్వహణపై క్లారిటీ ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా… సుప్రీంలో దాఖలు చేసిన అప్పీలు పిటిషన్ వెనక్కు తీసుకునేందుకు అనుమతివ్వాలని పిటిషన్ వేసింది. తీవ్రమైన జాప్యం, విద్యార్ధుల ఎదురు చూపుల నేపథ్యంలో ఆలస్యం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో…. గ్రూప్ 1 నోటిఫికేషన్ ను మొత్తం రద్దు చేసింది. ఫలితంగా త్వరలోనే కొత్త నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే 60 కొత్త పోస్టుల పెంపునకు కూడా సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీటిని కలిపితే మొత్తం 563 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై కూడా రేపోమాపో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక అభ్యర్థుల వయోపరిమితిని కూడా పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఫలితంగా వచ్చే కొత్త నోటిఫికేషన్ లో వయోపరిమితిపై కూడా స్పష్టత రానుంది.