Amrabad tiger: ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో టైగర్ సఫారీ .. వన్ డే టూర్ చేసేద్దామా?
25 November 2021, 16:32 IST
- ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ నల్లమలలో ఉన్న వన్య ప్రాణుల అభయారణ్యం. నవంబరు 17 నుంచి ఇక్కడ టైగర్ సఫారీ ప్రారంభమైంది. టూరిస్టులు ఈ టైగర్ రిజర్వ్లో పులులు, ఇత వన్యప్రాణులను దగ్గరి నుంచి చూసేలా ఎకో టూరిజం ప్యాకేజీ ఏర్పాటు చేశారు.
ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో సంచరిస్తున్న పులి
ఆమ్రాబాద్ ఆరో అతి పెద్ద రిజర్వ్ ఫారెస్ట్. ఇది 2611 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది. రాయల్ బెంగాల్ టైగర్ ఈ టైగర్ రిజర్వ్లో ఉంది. స్లోత్ బేర్, మచ్చల జింక, చింకారా, నీల్గాయి, సాంబార్, బ్లాక్ బక్, చౌసింఘా వంటి వన్యప్రాణులు ఉన్నాయి.
నేషనల్ హైవే -765 ఈ అభయారణ్యం మధ్య నుంచి 65 కి.మీ. పొడువునా వెళుతుంది. శ్రీశైలం దీని గుండానే వెళ్లాలి.
ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్, ఐఎఫ్ఎస్ అధికారి రోహిత్ గొప్పిడి, ఇతర ఉన్నతాధికారులు ఈ టైగర్ సఫారీ టూర్ను రూపొందించారు. టైగర్ సఫారీ సందర్శించాలంటే ఆన్ లైన్లో బుక్ చేసుకోవచ్చు. వీకెండ్లో వెళ్లొచ్చేలా ఈ ప్యాకేజీ రూపొందించారు.
ప్యాకేజీలో భాగంగా మూడు అంశాలు ఉన్నాయి. కాటేజీల్లో స్టే, జంగిల్ సఫారీ, ఫారెస్ట్ ట్రెక్ ఆకట్టుకుంటాయి.
ఆమ్రాబాద్ పోయి రావాల్సిందే..
ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పర్యాటకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ ప్యాకేజీలో భాగంగా ఒక రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు మన్ననూర్ సీబీఏటీ చేరుకోవాలి. ఆర్డర్ ప్రాతిపదికన ఇక్కడి చింకారా హాల్లో లంఛ్ చేయొచ్చు.
మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 వరకు ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ గురించి ఎగ్జిబిషన్, షార్ట్ మూవీ ప్రదర్శన ఉంటుంది.
సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్య జంగిల్ సఫారీ ఉంటుంది. ఇందుకోసం 4 గంటలకు రిసెప్షన్ వద్ద రిపోర్ట్ చేయాలి. 8 గంటల వరకు చింకారా హాల్కు తిరిగి వస్తారు. 8 గంటలకు రాత్రి భోజనం చేస్తారు. 9 గంటలకు రాత్రి బస చేస్తారు.
ఉదయం 6 గంటలకు మళ్లీ రిసెప్షన్ వద్ద రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఫారెస్ట్ ట్రెక్ ఉంటుంది. ట్రెక్ పూర్తయ్యాక 9 గంటలకు మన్ననూర్ సీబీఈటీకి చేరుకోవాలి. ఉదయం 9 గంటలకు చింకారా హాల్లో బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది. 10 గంటలకు తిరుగు ప్రయాణం ఉంటుంది.
అటవీ అధికారుల వాహనాల్లో..
టైగర్ సఫారీలో భాగంగా మిమ్మల్ని అటవీ శాఖ వాహనాల్లో తీసుకెళతారు. తిరిగి వచ్చి కాటేజీలో రాత్రి బస చేస్తారు. మరుసటి రోజు ఫారెస్ట్ ట్రెక్లో లోకల్ చెంచులు గైడ్లుగా వ్యవహరిస్తారు.
అడవి గురించి ఎన్నో విషయాలు వాళ్లు చెబుతుంటారు. మీరు వెళ్లిన దారిలో అక్కడ వన్య ప్రాణులు ఎలా సంచరించాయో, అక్కడ ఏయే ఆహారం తీసుకున్నాయో వివరిస్తారు.
చివరగా ఉమా మహేశ్వర స్వామి ఆలయంలో దర్శనం చేయించి వారి వాహనం ద్వారా వెనక్కి తీసుకొస్తారు.
పులి కనిపిస్తుందా?
టైగర్ చూసే అవకాశం చాలా తక్కువేనని అధికారులు చెబుతున్నారు. పదిసార్లు వెళితే ఒకసారి కనిపించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇది ఒక ఎడ్యుకేషనల్ టూర్లా ఉపయోగపడుతుంది. అడవుల సంరక్షణ, జంతువులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత తెలుస్తుంది. చెంచుల సంస్కృతి తెలుసుకోవచ్చు. మీకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.
బుక్ చేసుకోవాలనుకునే వారు ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అధికారిక వెబ్ సైట్లో బుక్ చేసుకోవచ్చు. ఇద్దరి నుంచి 12 మంది వరకు బుక్ చేసుకోవచ్చు. ఇద్దరికైతే రూ. 4,600, నలుగురికైతే రూ. 7 వేలు, ఆరుగురికైతే రూ. 9,500, 8 మందికి అయితే రూ. 12 వేలు, 10 మందికి రూ. 14,500, 12 మందికి రూ. 17 వేలు వసూలు చేస్తారు. గైడ్స్కు రూ. 200 చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది.
ఇక్కడ ఆమ్రాబాద్ అటవీ అధికారులు మిషన్ ఫ్రీ ఆఫ్ ప్లాస్టిక్ను అమలు చేస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగించకుండా వారికి సహకరించాలి.