Sangareddy Collector : గంజాయి సాగు చేస్తే రైతుబంధు, విద్యుత్ కనెక్షన్ కట్
13 September 2023, 12:03 IST
- Sangareddy Latest News:గంజాయి సాగు చేస్తే రైతుబంధు, విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తామని స్పష్టం చేశారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్. మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు సంబంధిత శాఖల సమన్వయంతో మరింత గట్టి నిఘాతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.
సంగారెడ్డి కలెక్టర్ సమీక్ష
Sangareddy Collector: మత్తు పదార్థాలకు ఎవరూ బానిసలు కాకుండా అవగాహన కల్పించడంతో పాటు వాటిని సమూలంగా అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యతని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, రవాణా తదితర అంశాలపై సమావేశంలో చర్చించి, నియంత్రణకు చేపట్టాల్సిన చర్యల గురించి నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… దేశ భవిష్యత్తుకు కీలకమైన యువతను, విద్యార్థులను నిర్వీర్యం చేస్తున్న మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు నిరోధానికి కలిసికట్టుగా కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సమాజానికి పెను ప్రమాదకరంగా మారిన మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో మరింత గట్టి నిఘాతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆబ్కారీ, పొలీసు, రవాణా,రెవెన్యూ, అటవీ, వ్యవసాయ, విద్య, వైద్య, తదితర శాఖలు సమన్వయంతో పనిచేస్తూ జిల్లాలో మత్తుపదార్థాల విక్రయం, అక్రమంగా గంజాయి సాగుచేస్తున్న వారిని సమాచారం ఇవ్వాలన్నారు. అక్రమ మాదకద్రవ్యాల రవాణా, విక్రయంపై ఏమైనా సమాచారం తెలిస్తే వెంటనే కమిటీ దృష్టికి తెస్తే నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి సాగు చేసినట్లయితే రైతుబంధు ఆపివేయడం, విద్యుత్ కనెక్షన్ కట్ చేయడం జరుగుతుందన్నారు. నారాయఖేడ్ ప్రాంతంలో కొందరు రైతులు గంజాయి సాగు చేయటంతో కలెక్టర్ ఈ విధంగా హెచ్చరించారు.
విద్యార్థుల ప్రవర్తనపై నిఘా పెట్టండి - జిల్లా ఎస్పీ రమణ కుమార్
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం రమణ కుమార్ మాట్లాడుతూ… మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు గురించి విద్యార్థులు, యువతకు అవగాహన కల్పించేందుకు విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టాలన్నారు. తల్లిదండ్రులకు కూడా అవగాహనా కలిపిస్తే, పిల్లలు మాదకద్రవ్యాలు సేవించడం వంటి వ్యసనాల జోలికి వెళ్లకుండా కాపాడుకునేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు ఎక్కడి నుండి జిల్లాకు చేరుతున్నాయి, ఏయే ప్రాంతాల్లో ఎవరు వీటిని విక్రయిస్తున్నారు, ఏ ప్రాంతాలకు జిల్లా మీదుగా రవాణా జరుగుతోంది అనే వివరాలకు పక్కాగా గుర్తిస్తూ, వాటి మూలాలను అడ్డుకోగలిగితే చాలా వరకు మత్తు పదార్థాలు వినియోగాన్ని నియంత్రించవచ్చన్నారు. ఆ దిశగా, పోలీస్, ఎక్సైజ్, రవాణా తదితర శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలని కోరారు. మత్తు పదార్థాల నియంత్రణకు ఎక్సయిజ్ తదితర శాఖలకు తమ పోలీసు శాఖ ద్వారా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని అన్నారు. పాఠశాల, కళాశాల విద్యార్థులు మత్తుపదార్థాలకు బానిసలు కాకుండా అటు తల్లిదండ్రులతో పాటు, ఉపాధ్యాయులు వారి నడవడిక, ప్రవర్తనను గమనిస్తుండాలన్నారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపులలో డ్రగ్స్ అమ్మకుండా చూడాలన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, డిఆర్ఓ నగేష్,ఆర్టీఓ రవీందర్ రెడ్డి ,డీఈఓ వెంకటేశ్వర్లు, వ్యవసాయాధికారి నరసింహారావు, వైద్య ఆరోగ్య శాఖ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ గాయత్రీ దేవి ఫారెస్ట్ , ఎక్సైజ్ అధికారులు, డిఎస్పీ, సీఐ లు, తదితరులు పాల్గొన్నారు.