TS Paddy Procurement : ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం.. ఇప్పటి వరకు 90 వేల మెట్రిక్ టన్నులు సేకరణ
21 April 2023, 17:21 IST
- Paddy Procurement in Telangana: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చురుగ్గా నడుస్తోంది. ఇప్పటివరకు 90వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.
తెలంగాణలో ధాన్యం కొనుగోలు (ఫైల్ ఫొటో)
Paddy Procurement in Telangana Updates: రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరించడానికి పౌరసరఫరాల శాఖ సర్వం సిద్దం చేసింది. ధాన్యం కొనుగోలు, ఏర్పాట్లపై ఇవాళ పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష నిర్వహించారు. నిన్నటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా 1131 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
యాసంగి ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందన్నారు మంత్రి గంగుల. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు అనుకూల విధానాలు, రైతుబందు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు, కాళేశ్వర జలాలతో పంట విస్థీర్ణం ఏటికేడు పెరుగుతూ రికార్డు స్థాయిలో ధాన్యాన్ని సేకరిస్తున్నామన్నారు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా రైతు పండించిన చివరి గింజను మద్దతు ధరతో కొనాలన్న ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తామన్నారు.. ప్రపంచవ్యాప్త నివేదికల్లో ఓవైపు యావత్ ప్రపంచంలో 20ఏళ్ల కనిష్టానికి బియ్యం ఉత్పత్తి పడిపోతుంటే, కేవలం తెలంగాణలో మాత్రమే బియ్యం ఉత్పత్తి ఆరింతలు పెరిగిందన్నారు ఇది తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ సాధించిన ఘనత అని పేర్కొన్నారు.
నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1131 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి వాటి ద్వారా 186 కోట్లు విలువ చేసే 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని మంత్రి ప్రకటించారు. అత్యధికంగా నల్గొండ, నిజమాబాద్ జిల్లాల్లో కొనసాగుతుందన్నారు. ధాన్యం కోతలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు స్థానిక యంత్రాంగం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. లక్ష్యం మేరకు సేకరణకు అవసరమైన 7031 పై చిలుకు కొనుగోలు కేంద్రాలు, గన్నీ బ్యాగులు, మాయిశ్చర్ మిషన్లు, వేయింగ్ మిషన్లు, హమాలీలును సమకూర్చుకున్నామని పేర్కొన్నారు. అకాల వర్షాల నేపథ్యంలో టార్పలిన్లను సైతం అందుబాటులో ఉంచామన్నారు. రైతులు ఫెయిర్ ఆవరేజి క్వాలిటీతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ధాన్యం అమ్ముకోవాలని మంత్రి సూచించారు.