Dalit Bandhu Scheme : జిల్లా కలెక్టర్లకే 'దళితబంధు' లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలు
14 July 2023, 17:39 IST
- Minister Eshwar On Dalit Bandhu Scheme : రెండో విడత దళితబంధు లబ్ధిదారుల ఎంపిక విధానంపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే వీటిపై క్లారిటీ ఇచ్చారు మంత్రి ఈశ్వర్. జిల్లా కలెక్టర్లకే ఈ బాధ్యతలను అప్పగిస్తున్నట్లు తెలిపారు.
దళితబంధు
Dalit Bandhu Scheme in Telangana : దళితబంధు... హుుజురాబాద్ బైపోల్ సమయంలో తీసుకొచ్చిన ఈ స్కీమ్ ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. తొలి విడతలో భాగంగా... దాదాపు 35వేలకు మందికి అందజేశారు. అయితే స్థానిక ఎమ్మెల్యేలకు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను అప్పగించటం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. కేవలం అధికార పార్టీకి చెందిన కార్యకర్తలకే దళితబంధు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. ఇదే అంశంపై పలువురు హైకోర్టును కూడా ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం.... ఎమ్మెల్యేల ప్రమేయంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఎంపిక బాధ్యతలతో వారి ప్రమేయమే ఉండొద్దని స్పష్టం చేసింది. అయితే తాజాగా రెండో విడతకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈసారి కూడా పాత పద్ధతినే పాటిస్తారా...? అలా చేస్తే దరఖాస్తు విధానం ఉంటుందా...? అన్న చర్చ నడుస్తోంది. అయితే వీటిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. జిల్లా కలెక్టర్లకే లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రకటించారు.
శుక్రవారం కరీంనగర్ లోని క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి కొప్పుల ఈశ్వర్. జిల్లా కలెక్టర్లకే దళితబంధు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలు అప్పగించామని ప్రకటించారు. సంబంధిత జిల్లా మంత్రులు, జిల్లా కలెక్టర్ల తో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెప్పుకొచ్చారు. దళిత బంధు రెండో విడత కోసం సర్కార్ కేటాయించిన 1700 కోట్ల రూపాయల నిధుల్లో ఇప్పటికే 850 కోట్లు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు , అక్రమాలు జరుగుతున్నట్లు వస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు.
రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 1.30లక్షల దళిత కుటుంబాలకు పథకాన్ని అందించాలని సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఒక్కో నియోజకవర్గానికి 1,100 మంది చొప్పున హుజూరాబాద్ మినహా మిగతా 118 నియోజకవర్గాలు కలిపి మొత్తం 1,29,800 యూనిట్లను అందించనున్నారు. అర్హత కలిగిన వారిని గుర్తించేందుకు ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో అంటే... నేరుగా ఎంపిక చేస్తారా...? దరఖాస్తులను స్వీకరించి... పరిశీలించిన తర్వాత ప్రకటిస్తారా అనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. దళితబంధు పోర్టల్ ద్వారా ఎంపిక, పరిశీలన, యూనిట్ల మంజూరు ఉంటుందని పేర్కొన్నప్పటికీ.... అధికారికంగా మార్గదర్శకాలు వెలువడని పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడ్డారన్న వార్తలు రావటం... స్వయంగా కేసీఆర్ హెచ్చరించటం వంటివి కూడా జరిగాయి. ఇలాంటి నేపథ్యంలో... రెండో విడత దళితబంధు లబ్దిదారుల ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుందనే దానిపై మాత్రం స్పష్టత కరువైందన్న టాక్ వినిపిస్తోంది. అయితే కలెక్టర్లకే బాధ్యతలు అప్పగించినున్నట్లు మంత్రి చెప్పిన నేపథ్యంలో… దరఖాస్తుల విషయంలో స్పషత రావాలి.