TS Weather Alert : మండే ఎండల్లో చల్లటి వార్త.. పలు జిల్లాలకు వర్ష సూచన!
20 April 2023, 15:16 IST
- Weather Updates Telugu States: ఓవైపు భానుడి భగభగలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే పలు జిల్లాలకు వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ. ఈ మేరకు వివరాలను పేర్కొంది.
పలు ప్రాంతాలకు వర్ష సూచన..!
Rain Alert to Telangana: తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఓ వైపు ఉక్కపోతతో వేడితో జనం అల్లాడుతున్నారు. ఉత్తర తెలంగాణలో తీవ్ర వేడిగాలులు వీస్తున్నాయి. బుధవారం పలు జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే మండే ఎండల్లో తెలంగాణకు వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అకాశం ఉందని పేర్కొంది.
ఏప్రిల్ 24వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి,కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపుతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 30- 40 కి. మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఇక మిగతా జిల్లాల్లో మాత్రం మోస్తరు వర్షాలు పడుతాయని తెలిపింది.
ఇక ఏపీలో చూస్తే ఎండలు మండుతున్నాయి. ఐఎండీ అంచనాల నేపథ్యంలో ఏపీ విపత్తుల శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ 125 మండలాల్లో వడగాల్పులు, శుక్రవారం 40మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇక రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు తగినంత స్థాయిలో నీరు తాగాలని చెబుతున్నారు. నేరుగా ఎండ ఇంట్లో పడకుండా జాగ్రత్త పడాలని.. ఈ మేరకు తగిన చర్యలు తీసుకువాలని అంటున్నారు.బయటికు వెళ్లవలసి వస్తే… గొడుగు, టోపీ, సన్స్క్రీన్ ధరించాలని అడ్వైజ్ చేస్తున్నారు. కచ్చితంగా బయటకు వెళ్లాల్సి వస్తే సాయంత్రం తర్వాత వెళ్తే బెటర్ అని చెబుతున్నారు.