Dharani Committee : ధరణి దరఖాస్తుల గడువు పొడిగింపు, ఈ నెల 17 వరకు అవకాశం
12 March 2024, 16:49 IST
- Dharani Committee : ధరణి పోర్టల్ సమస్యలపై దరఖాస్తుల గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 17 వరకు దరఖాస్తుల గడువు పొడిగించింది. కేటీఆర్ కుటుంబానికి భూములు బదలాయించారని ధరణి కమిటీ సంచలన ఆరోపణలు చేసింది.
రణి దరఖాస్తుల గడువు పొడిగింపు
Dharani Committee : ధరణి పోర్టల్ లో పెండింగ్ సమస్యల పరిష్కారానికి దరఖాస్తుల గడువును పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 17వ తేదీ వరకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. అయితే ధరణి పెండింగ్ దరఖాస్తులకు మార్చి 1 నుంచి 9 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ డ్రైవ్లో ఇప్పటి వరకు 1.06 లక్షల దరఖాస్తులకు రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి, డెస్క్వర్క్ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిశీలనకు తహశీల్దార్ ఆఫీస్ సిబ్బందిని స్పెషల్ టీములుగా నియమించారు. ఈ టీమస్ ధరణి పెండింగ్ దరఖాస్తులకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నాయి. క్షేత్రస్తాయిలో పరిశీలించి, దరఖాస్తుదారుడు ఉన్నారా? లేదా? అనేది నిర్థారించుకుంటున్నాయి. ధరణి పోర్టల్లో ఆర్డీవోలు, తహసీల్దారులకు లాగిన్ రాగానే పెండింగ్ అప్లికేషన్ల పని త్వరలో ప్రారంభం అవుతుందని అధికారులు తెలిపారు. ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఓ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ధరణిలో మార్పుల తర్వాతే పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం మొదలవుతుందని ధరణి కమిటీ సభ్యులు అంటున్నారు. స్పెషల్ డ్రైవ్లో లక్షకు పైగా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. తహసీల్దార్లు, ఆర్డీవోలు, జాయింట్ కలెక్టర్లకు లాగిన్ రాగానే ఇవి పరిష్కారం అవుతాయన్నారు.
కేటీఆర్ కుటుంబానికి భూములు బదిలీ
ధరణి కమిటీ (Dharani Committee)సంచలన ఆరోపణలు చేసింది. సోమవారం ఈ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. దేశంలో అతిపెద్ద భూకుంభకోణం బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిందని విమర్శించారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని, అయినా ఆ భూములను మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబానికి (KTR Family)బదలాయించారని ఆరోపించారు. 2014 వరకు భూహక్కుల విషయంలో సమాన న్యాయం ఉండేదని, కానీ 2015 నుంచి చాలా మంది రైతులు భూములపై హక్కులు(Land Rights) కోల్పోయారని తమ పరిశీలనలో తేలిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరితో, ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే భూరికార్డులను ప్రక్షాళన చేసిందన్నారు. ఒక దివాలా తీసిన కంపెనీకి ధరణి పోర్టల్ అప్పజెప్పి ఈ వ్యవహారాన్ని నిడిపించిందని కమిటీ ఆరోపించింది.
భారీగా ఫిర్యాదులు
ధరణి పోర్టల్ పై రైతుల నుంచి భారీగా ఫిర్యాదులు అందుతున్నాయని కమిటీ సభ్యులు తెలిపారు. గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచితంగా నిర్ణయాలతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని కమిటీ పేర్కొంది. ధరణి పోర్టల్ (Dharani Portal)పై వస్తున్న సమస్యల పరిష్కారానికి మార్గాలు వెతుకుతున్నట్లు కమిటీ తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ధరణి పోర్టల్ రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణిపై కమిటీని నియమించింది. ధరణి పోర్టల్ పై వస్తున్న ఫిర్యాదులు, పోర్టల్ పనితీరుపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది.
ధరణి పోర్టల్ తో ప్రతీ సేవకు ధర
గత బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS) ధరణి పోర్టల్ను అక్టోబరు 29, 2020న అందుబాటులోకి తెచ్చింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూ రికార్డుల నమోదు చేసే అధికారిక పోర్టల్గా ధరణిని ప్రకటించింది. అయితే అప్పటి వరకు రైతులకు భూహక్కులకు సంబంధించిన సేవలను ఉచితంగా పొందే అవకాశం ఉండేది. దరఖాస్తు చేసుకుంటే పట్టాదారు పాస్ పుస్తకం నుంచి ఇతర అన్ని రకాల సేవలు ఉచితంగానే హక్కుదారులకు అందేవి. కానీ ధరణి పోర్టల్ వచ్చాక ప్రతి సేవకు ఒక ధరను నిర్ణయించారు. ఈ ధరణితో భూరికార్డుల ప్రక్షాళలో తప్పులు జరిగాయని రైతులు వాపోతున్నాయి. తమ భూమిని వేరొకరి పేరుపై నమోదు చేశారని ఫిర్యాదు వచ్చాయి.