TS Ground Water Level : తెలంగాణలో పెరిగిన భూగర్భ జలాలు
25 September 2022, 20:11 IST
- Ground Water Level In Telangana : రాష్ట్రంలో గత ఏడేళ్లలో సగటున 4.26 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయని నీటిపారుదల, కమాండ్ ఏరియా డెవలప్మెంట్(ఐ అండ్ క్యాడ్) శాఖ తెలిపింది. దేశంలోనే అత్యధికంగా 83 శాతం మండలాల్లో భూగర్భ జలాలు పెరిగాయని పేర్కొంది.
భూగర్భ జలాలు పెరుగుదల
తెలంగాణ(Telangana)లో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల పునరుద్దరణ, చెక్ డ్యామ్ ల నిర్మాణం కారణంగా భూగర్భ నీటి లభ్యత పెరిగింది. ప్రస్తుతం 680 టీఎంసీల భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి. ఇది కృష్ణా బేసిన్(Krsihna Basin)లో తెలంగాణ రాష్ట్రానికి నీటి కేటాయింపు కంటే రెండింతలు ఎక్కువ. వర్షపాతం ఫలితంగా 2020తో పోలిస్తే ఈ సంవత్సరం భూగర్భ జలాల వాడకం ఎనిమిది శాతం తగ్గుదల ఉంది. చాలా కారణాలతో భూగర్భ జలాలను వాడటం తగ్గించారు.
అనేక ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఉంది. రైతులు మోటార్ల వాడకం తగ్గించారు. సాగునీటి కాల్వలను కూడా పునరుద్దరించారు. ఎక్కువ మంది వాటిపైనే ఆధారపడుతున్నారు. ఇళ్లల్లోనూ బోర్ల వాడకం తగ్గింది. ఈ కారణంగా భూగర్భ జలాల వాడకం తగ్గిపోయిందని నివేదికలో తెలిపారు.
2014లో 3.5 నుంచి ఈ ఏడాది 4.8కి భూగర్భజలల వాడకం పెరిగింది. మిషన్ కాకతీయ కింద 27,472 ట్యాంకుల పునరుద్ధరణ, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోయడం, మేజర్, మీడియం ట్యాంకులతో అనుసంధానం చేయడం ద్వారా నిర్ణీత వ్యవధిలో ఎంఐ ట్యాంకులను నింపడం వంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాల వల్ల నీటి మట్టాలు పెరిగాయి. ప్రాజెక్ట్లు, చెక్ డ్యామ్లు, పెర్కోలేషన్ ట్యాంకులు, రీఛార్జ్ షాఫ్ట్ల వంటి కృత్రిమ రీఛార్జ్ నిర్మాణాలు కూడా కారణమయ్యాయి.
అలాగే భూగర్భజలాలు, పరిశ్రమలు, వ్యవసాయం, పంచాయితీ రాజ్ శాఖ(Panchayat Raj Department)ల అధికారులతో కూడిన సబ్కమిటీ రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూనే ఉంది. ఇంకుడు గుంతల తవ్వకాన్ని ప్రోత్సహించడం కూడా భూగర్భ జలాల పెరుగుదలకు కారణంగా ఉంది. రాష్ట్రంలో ఉన్న విలువైన భూగర్బ జలాల(Ground Water)ను సక్రమంగా ఉపయోగించుకోవడానికి తీసుకోవల్సిన చర్యలను కూడా చెప్పారు.
రాష్ట్ర భూగర్భ జలవనరుల విభాగం, జాతీయ భూగర్భ జలవనరుల బోర్డు గత జూన్ లో విడుదల చేసిన నివేదిక ప్రకారం 2015 సీజన్ తో పోలిస్తే రాష్ట్రంలో 4.26 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి. గడిచిన దశాబ్దంతో పోలిస్తే పదిమీటర్ల లోపు భూగర్భ జలమట్టం ఉన్న విస్తీర్ణం 106 శాతం పెరిగినట్టుగా నివేదికలు చెబుతున్నాయి.
20 మీటర్ల కన్నా ఎక్కువ లోతులో భూగర్భ జలాలు ఉన్న ప్రాంతాలు గతంతో పోల్చితే 87 శాతం తగ్గాయి. మిషన్ కాకతీయలో భాగంగా 26,700 చెరువుల పునరుద్ధరణ, కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు ఎత్తిపోసి చెరువులు నింపడం, 638 చెక్ డ్యాంలు, 138 రీచార్జ్ షాఫ్ట్స్ల నిర్మాణంతోనే భూగర్భ జలాలు పెరిగినట్టుగా గత జూన్ లో అధికారులు వెల్లడించారు.