Sangareddy Drugs: సంగారెడ్డిలో డ్రగ్ తయారీ యూనిట్లపై దాడులు, పలువురి అరెస్ట్
28 December 2023, 7:11 IST
- Sangareddy Drugs: సంగారెడ్డి జిల్లాలో డ్రగ్ తయారీ యూనిట్లపై దాడులు నిర్వహించి రూ. 70 లక్షల విలువైన ముడిపదార్థాలను,నలుగురు నిందితులు అదుపులోకి తీసుకున్నారు.
డ్రగ్స్ తయారీ ముఠా అరెస్ట్
Sangareddy Drugs: నిషేధిత ఆల్ప్రజోలం డ్రగ్ తయారీ యూనిట్లపై సంగారెడ్డి జిల్లా పోలీసులు దాడులు నిర్వహించి రూ. 70 లక్షల విలువ గల ఆల్ప్రజోలం డ్రగ్ తయారీకి వినియోగించే ముడిపదార్థాలను స్వాధీనపరుచుకున్నట్టు సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు.
సంగారెడ్డి రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో గల ఫసల్వాడి గ్రామం శివార్లలో నిషేధిత ఆల్ప్రజోలం తయారీ యూనిట్లను గుర్తించి, సుమారు 70 లక్షల విలువైన ముడిపదార్థాలు మరియు రెండు డిస్టిలేషన్ యూనిట్లను, నేరస్తులు వినియోగించిన మొబైల్ ఫోన్ లను, కల్లులో ఉపయోగించే ఔషదాన్ని, కమల్ బ్రహ్మానందగౌడ్, చిరుగోరి డేవిడ్, కొండాపురం శివ, వినోద్ కుమార్ సకినాల @ వినయ్ అనే నలుగురు నిందితులను అదుపులోనికి తీసుకున్నట్టు ఎస్పీ రూపేష్ తెలిపారు.
జైలులో పరిచయమై ....
బ్రహ్మానంద గౌడ్, డేవిడ్లు 2018 లో అండర్ ట్రయల్ నేరస్తులుగా కంది జైలులో పరిచయమయ్యారు. ఇద్ధరిది ఒకే నేర ప్రవృత్తి కలిగి ఉన్నందున అక్రమంగా అల్ప్రాజోలం తయారీ యూనిట్ను ప్రారంభించాలని నిర్ణయించుకొన్నారు. రెండేళ్ల క్రితం బెయిల్పై వచ్చిన బ్రహ్మానందగౌడ్ పటాన్చెరులో డేవిడ్ కుటుంబ సభ్యులకు సహాయంగా ఉన్నాడు.
ఆరు నెలల క్రితం డేవిడ్ కూడా బెయిల్పై వచ్చి, అల్ప్రజోలం తయారీలో తమకున్న గత అనుభవంతో, ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న కెమిస్ట్ అయినటువంటి కొండాపురం శివ అనే వ్యక్తిని నియమించుకొని, మార్కెట్లో లభించే మధ్యవర్తిత్వ రసాయనాలను సేకరించి ఆల్ప్రాజోలం రహస్య యూనిట్ను ప్రారంభించారు.
తమ వ్యాపారానికి సహాయం చేయడానికి, యూనిట్ను పర్యవేక్షించడానికి స్థానిక నివాసి అయిన వినోద్కుమార్ను నియమించుకొని, ప్లాన్ ప్రకారం సంగారెడ్డి శివారులోని ఫసల్వాడి గ్రామంలో ఒక ఇంటిలో మొదటి అంతస్తులో సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ని అద్దెకు తీసుకొని, మెటీరియల్ అంతా పై ఇంటికి మార్చి, డిస్టిలేషన్ చేస్తూ ఆల్ప్రాజోలమ్ తయారిని ప్రారంభించారని నాలుగు రోజుల నుండి డిస్టిలేషన్ ప్రక్రియలో ఉన్న రసాయానాలను, నలుగురు నిందితులను,ముడి పదార్ధాలను,సామాగ్రిని, వాహనాలను, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
ఈ మధ్య కాలంలో అనేక మంది యువకులు, విద్యార్థులు డ్రగ్స్ ,గంజాయి కి అలవాటు పడి, వివిధ రకాల నేరాలు చేయడం మరియు ఇతర సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం జరుగుతుందని ఎస్పీ వివరించారు. డ్రగ్స్ మహమ్మారి మత్తులో అనేక కుటుంబాలు బలి అవుతున్నాయని పరిసర ప్రాంతాలలో ఏదైనా అనుమానిత, రహస్య కార్యకలాపాలు జరుగుతున్నాయని గుర్తించిన వెంటనే జిల్లా పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.