Crime News | దుబాయ్ లో కొడుకు.. ఊళ్లో ఎఫైర్ నడుపుతున్న కోడలు.. మామకు తెలిసి..
28 April 2022, 15:19 IST
- ఓ కోడలు వివాహేతర సంబంధం కోసం.. మామనే చంపించింది. భర్త దుబాయ్ లో ఉండటంతో.. ప్రియుడి సాయంతో.. మామను అడ్డు తొలగించుకుంది.
ప్రతీకాత్మక చిత్రం
వివాహేతర సంబంధం ఎంతటి దారుణాన్నైనా చేయిస్తుంది. కట్టుకున్నవాడు, కన్నవాళ్లు, పుట్టినవాళ్లు.., ఎలాంటి బంధనైనా.. నాశనం చేస్తుంది. తాజాగా ఓ మహిళ కూడా.. అలాంటి పనే చేసింది. దుబాయ్ లో భర్త ఉంటే.. ఇక్కడ వివాహేతర సంబంధాన్ని నడిపించింది. విషయం మామకు తెలియడంతో.. తప్పు చేస్తున్నావని హెచ్చరించాడు. దీంతో కోపానికి గురైన కోడలు మామను అడ్డుతొలగించుకునేందుకు ప్లాన్ వేసింది. దీని కోసం ప్రియుడి సాయాన్ని తీసుకుంది.
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారంలో గంగారాం అనే వ్యక్తి రాత్రిపూట.. పొలంలో వడ్ల కుప్పకు కాపలాగా పడుకున్నాడు. తెల్లారే సరికి శవమై కనిపించాడు. అతడిని ఎవరో కొట్టి చంపుతుంటే.. పక్కనే మరో కుప్పపై పడుకున్న వ్యక్తి చూశాడు. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాడు. పోలీసులు విచారణ చేయడం మెుదలుపెట్టారు. దీంతో అసలు విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. హత్య చేయించేంత కోపం ఎవరికి ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తుండగా.. అవాక్కయ్యే విషయాలు పోలీసులకు తెలిశాయి.
గంగారాం హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు గుర్తించారు. మృతుడికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. చిన్న కొడుకు బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. అతడి భార్య లత అత్తమామల దగ్గరే ఉంటోంది. మదనపల్లి గ్రామానికి చెందిన దుంపటి శ్రీనివాస్ అనే దగ్గరి బంధువు.., గంగారాం పొలం కౌలు తీసుకొని సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే.. శ్రీనివాస్తో లతకు పరిచయం ఏర్పడింది. అదికాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.
కొడుకు దుబాయ్ లో ఉన్నాడు.. కోడలు ఇక్కడ వివాహేతర సంబంధం నడుపుతున్న విషయం మామ గంగారాం తెలుసుకున్నాడు. వెంటనే వెళ్లి కోడలితో మాట్లాడి.. మంచి పద్ధతి కాదని చెప్పాడు. కుటుంబం కోసం.. కొడుకు అక్కడ కష్టపడుతుంటే.. ఇక్కడ నువ్ వివాహేతర సంబంధం పెట్టుకోవడం సరికాదని హెచ్చరించాడు. ఈ విషయంపై మామ కోడలికి చాలాసార్లు గొడవలు అయ్యాయి. కోడలి తీరు మారకపోవడంతో.. శ్రీనివాస్ ని కౌలు మానిపించాడు.
ఈ విషయాన్ని కోడలు లత తట్టుకోలేక పోయింది. కోపంతో.. రగిలిపోయి.. పుట్టింటికి వెళ్లింది. కోతలు పూర్తైన వెంటనే.. తన పొలం తనకు ఇవ్వాలని.. ప్రియుడి శ్రీనివాస్ తో కలిసి వెళ్లి మామతో గొడవ పెట్టుకుంది. దీంతో పెద్దగా గొడవ జరిగింది. అప్పుడే ఎలాగైనా మామను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది కోడలు. ఇదే విషయాన్ని ప్రియుడికి చెప్పింది.
24న రాత్రి శ్రీనివాస్తో పాటు మదనపల్లి గ్రామానికి చెందిన సురేష్ అనే ఇద్దరు గన్నారం గ్రామానికి వచ్చారు. వడ్ల కుప్పపై పడుకున్న గంగారాం ఛాతీపైన కూర్చుని శ్రీనివాస్ వెదురు కర్రతో గొంతుపైన అదిమి పట్టుకుని.. పక్కనే ఉన్న రాయితో తలపై కొట్టి చంపాడు. దీనికి సురేష్ సహకరించాడు. గంగారం దగ్గర నుంచి వస్తున్న శబ్దాన్ని విని.. పక్క కుప్ప వద్ద కాపలాగా ఉన్న మరో వ్యక్తి అరుస్తూ వచ్చాడు. అప్పటికే.. ప్రియుడు శ్రీనివాస్, సురేశ్ పారిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేయగా.. అన్ని విషయాలు తెలిశాయి. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
టాపిక్