karnataka Camp Politics : ఓవైపు ఫలితాలు.. మరోవైపు క్యాంప్ పాలిటిక్స్!హైదరాబాద్ లోని ఈ హోటల్స్ బుక్!
13 May 2023, 10:52 IST
- Karnataka Election Results 2023: కర్ణాటక ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండగా… బీజేపీ వెనకబడింది. ఫలితాల వేళ ప్రధాన పార్టీలు క్యాంప్ రాజకీయాలకు తెరలేపినట్లు తెలుస్తోంది.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు
karnataka Camp Politics: కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ఎగ్జిట్స్ పోల్స్ లో కాంగ్రెస్ కే మొగ్గు ఉందని చెప్పగా... ఇవాళ్టి ఫలితాల్లో కూడా ఆ ట్రెండ్ కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. వందకు పైగా స్థానాల్లో ముందంజలో ఉండగా....బీజేపీ వెనకబడింది. దాదాపు కర్ణాటకలోని అన్ని ప్రాంతాల్లో కూడా హస్తం హవా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే... పూర్తి స్థాయి ఫలితాలు రాకముందే... ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలపై ఫోకస్ పెట్టేశాయి. కీలక నేతలను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం సీఎంగా ఉన్న బొమ్మై సొంత ప్రాంతంలో కూడా కాంగ్రెస్ దూసుకెళ్తోంది. ఫలితంగా బీజేపీ శ్రేణులు అంతర్మథనంలో పడినట్లు కనిపిస్తోంది. అయితే అధికారంలోకి రావాలంటే 113 సీట్లను గెలవాల్సి ఉంటుంది. తాజా ఫలితాలను చూస్తే.... సింగిల్ గా ఈ మార్క్ ను దాటే పరిస్థితి కనిపించటం లేదు. కాంగ్రెస్ కూడా దగ్గరి వరకు చేరుకునేలా కనిపిస్తోంది. 113 మార్క్ ను దాటే అవకాశం కూడా ఉంది. అయితే ఒకవేళ మెజార్టీ స్థానాలు రాకపోతే... మళ్లీ జేడీఎస్ కింగ్ కావటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఇండిపెండెంట్ గా గెలిచే వారు కీలకం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీలు... క్యాంపు రాజకీయాలకు తెరలేపినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులు చేజారకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బెంగళూరులో ప్రధాన హోటళ్లన్నీ బుకింగ్ అయినట్లు తెలుస్తోంది.
కేవలం కర్ణాటకలోనే కాకుండా... హైదరాబాద్ లోనూ స్టార్ హోటళ్ళను బుక్ చేసినట్లు సమాచారం. ఇందులో నోవాటెల్, తాజ్ కృష్ణ, పార్క్ హయత్ హోటల్స్ ఉన్నాయి. అయితే ఇవీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు బుక్ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయి ఫలితాలను రాగానే... గెలిచిన అభ్యర్థులందర్నీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాంప్ లకు తరలించనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఈ వ్యవహరాలను లోతుగా పర్యవేక్షిస్తున్నారు. ఇక స్వతంత్ర ఎమ్మెల్యేలతో కూడా ఇప్పటికే చర్చలు షురూ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మెజార్టీ సీట్లలో కాంగ్రెస్ దూసుకెళ్తుండగా... ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు జోష్ లో ఉన్నారు.
మొత్తంగా దక్షిణాదిలో బీజేపీకి కీలకమైన కర్ణా టకలో చేదు ఫలితాలు చవిచూస్తే… ఇతర రాష్ట్రాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు రావొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే… తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో దూసుకెళ్లే అవకాశం లేకపోలేదు.