Karnataka election results 2023 Live: కర్ణాటకలో కాంగ్రెస్ హవా.. 135 సీట్లలో ఆధిక్యం
13 May 2023, 20:33 IST
- Karnataka election results 2023: కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో ఇప్పటివరకు కాంగ్రెస్ హవా కనిపిస్తోంది. లైవ్ అప్డేట్స్ కోసం ఈ హెచ్టీ తెలుగు పేజ్ని ఫాలో అవ్వండి.
Karnataka results: ఆ 8 మంది ఎమ్మెల్యేలు ఓటమిపాలు..
Karnataka results: 2018 నాటి ఎన్నికల అనంతరం, బీజేపీ ప్రభుత్వం కుప్పకూలడంతో కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. 2019 లో 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో ఆ ప్రభుత్వం కుప్పకూలి, యెడియూరప్ప ముఖ్యమంత్రిగా బీజేపీ సర్కారు మరోసారి ఏర్పడింది. అలా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో పలువురు ఈ సారి ఎన్నికల్లో కూడా బీజేపీ తరఫున బరిలో నిలిచారు. వారిలో 8 మంది ఓటమి పాలు కావడం విశేషం.
రేపు సాయంత్రం 5 గంటలకు కర్నాటక సీఎల్సీ భేటీ; సీఎం ఎవరో తేలేది అప్పుడే..
మే 14, ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు కాంగ్రెస్ పార్టీ నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల సమావేశం జరుగుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత రణ్ దీప్ సూర్జేవాలా ప్రకటించారు. మే 14, ఆదివారం సాయంత్రం 5 గంటలకు జరిగే కర్నాటక సీఎల్పీ (CLP) సమావేశంలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల తమ కాబోయే ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు.
Karnataka Results: కాంగ్రెస్ విజయంపై సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న మీమ్స్
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ ఊహించిన స్థాయి కన్నా ఎక్కువ సీట్లను సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై సోషల్ మీడియా పెద్ద ఎత్తున స్పందించింది. ఒకవైపు, ఫలితాలపై సీరియస్ చర్చ సాగగా.. మరోవైపు, హాస్యభరిత మీమ్స్ కూడా సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి.
కాంగ్రెస్ దే కర్నాటక; 136 సీట్లతో ఘనంగా అధికారంలోకి..
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోరు ముగిసింది. ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 224 సీట్లకు గానూ 136 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ఘనంగా అధికార పీఠాన్ని అధిష్టించబోతోంది. 2018లో జరిగిన ఎన్నికల్లో 80 సీట్లలో గెలిచిన కాంగ్రెస్ ఈ సారి మరో 56 సీట్లను అదనంగా గెల్చుకోగలిగింది. మరోవైపు, గత ఎన్నికల్లో 104 సీట్లలో గెలిచి, అతి పెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ ఈ సారి 39 స్థానాలను పోగొట్టుకుని 65 సీట్లకు పరిమితమైంది. మరోవైపు, ఆశించిన స్థాయిలో సీట్లను గెల్చుకోలేకపోయిన జేడీఎస్ 19 సీట్లను గెల్చుకుంది. గత ఎన్నికల్లో 37 సీట్లలో జేడీఎస్ విజయం సాధించింది.
UP civic body poll: యూపీ స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం
UP civic body poll results: ఉత్తర ప్రదేశ్ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. రాష్ట్రంలోని మొత్తం 17 మున్సిపల్ కార్పొరేషన్లను కైవసం చేసుకుంది. 199 మున్సిపల్ కౌన్సిల్స్ లో 98 కౌన్సల్స్ లో విజయం సాధించింది.
కాంగ్రెస్ పార్టీకి ప్రధాని మోదీ అభినందనలు
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. కర్నాటక బరిలో ప్రధాన ప్రత్యర్థులైన బీజేపీ, కాంగ్రెస్ ల హోరాహోరీ పోరులో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో.. ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ విస్తృతంగా ప్రచారం చేశారు. రాష్ట్రంలో పార్టీ విజయం కోసం ప్రధాని మోదీ చేసిన కృషి ఫలించలేదు.
Priyanka on Karnataka results: ‘ప్రజలను ఏకం చేసే రాజకీయాలకు లభించిన విజయం ఇది’: ప్రియాంక గాంధీ
Priyanka on Karnataka results: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. ఇది దేశ ప్రజలను ఏకం చేసేందుకు రాజకీయాలు చేసేవారి విజయమన్నారు. ఇది విభజన రాజకీయాలు చేసే వారికి చెంపపెట్టు వంటి విజయమని వ్యాఖ్యానించారు.
‘‘ద్రవిడ భూమి నుంచి బీజేపీని తుడిచిపెట్టుకుపోయింది’’: తమిళనాడు సీఎం స్టాలిన్
దక్షిణాదిలో బీజేపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందిస్తూ, కాంగ్రెస్ కు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గేలకు ఆయన అభినందనలు తెలియ జేశారు. కర్నాటకలో బీజేపీ పరాజయంతో దక్షిణాదిన బీజేపీ అధికారంలో లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. 2024 లోక్ సభ ఎన్నికల కోసం బీజేపీకి వ్యతిరేకంగా అన్ని భావ సారూప్య పార్టీలు కలిసి రావాలని ఆయన కోరారు.
మ్యాజిక్ మార్క్ కు చేరువవుతున్న కాంగ్రెస్
మధ్యాహ్నం 3.15 గంటల వరకు కాంగ్రెస్ పార్టీ 105 స్థానాల్లో విజయం సాధించింది. మెజారిటీకి అవసరమైన 113 స్థానాల మ్యాజిక్ మార్క్ కు మరో 10 సీట్ల దూరంలో ఉంది. మరో 31 సీట్లలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. మరోవైపు, బీజేపీ 44 సీట్లు గెల్చుకుంది. 20 సీట్లలో ఆధిక్యతలో ఉంది. జేడీఎస్ 14 సీట్లను గెల్చుకుంది. ఆరు స్థానాల్లో ఆధిక్యతలో ఉంది.
Karnataka results: కుమారస్వామి ఆశలు గల్లంతు; పోరాటం కొనసాగుతుందన్న జేడీఎస్ నేత
Karnataka results: మరోసారి కింగ్ మేకర్ గానో, లేక అదృష్టం కలిసివస్తే, మళ్లీ ముఖ్యమంత్రిగానో అవతరిస్తానని జేడీఎస్ నేత కుమార స్వామి (HD Kumaraswamy) కన్న కలలు కల్లలయ్యాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో (karnataka assembly elections 2023) కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించనుందని తేలడంతో కుమార స్వామి ఆశలు గల్లంతయ్యాయి. కింగ్ మేకర్ గా కుమార స్వామి (HD Kumaraswamy) నిలిచే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ సైతం నిర్ధారించడంతో, కుమార స్వామితో పొత్తు కోసం అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ప్రయత్నాలు కూడా చేశాయి. ఫలితాల అనంతరం, కాంగ్రెస్ తోనో, బీజేపీతోనో పొత్తు పెట్టుకుంటామని కుమార స్వామి కూడా ప్రకటించారు.
ప్రేమను ఎంచుకున్నారు.. ద్వేషాన్ని కాదు: రాహుల్
మధ్యాహ్నం 2.38 రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ పేదల కోసం నిలబడిందని అన్నారు. ద్వేషాన్ని కాదని కర్ణాటక ప్రజలు ప్రేమను ఎంచుకున్నారని అన్నారు. ఇది కర్ణాటక ప్రజల విజయమని అన్నారు.
కాంగ్రెస్ జోరు.. 135 సీట్లలో ఆధిక్యం
పార్టీ | ఆధిక్యం | గెలుపు |
కాంగ్రెస్ | 113 | 22 |
బీజేపీ | 54 | 10 |
జేడీఎస్ | 18 | 3 |
ఇండిపెండెంట్స్ | 2 | 02 |
ఇతరులు | 2 | 2 |
Karnataka election result 2023: జేడీఎస్ కుమారస్వామి అడ్డాలో కాంగ్రెస్ జెండా
Karnataka election result 2023: కర్నాటకలో రామనగర (Ramanagara) జేడీఎస్ కు కంచుకోట వంటిది. జేడీఎస్ వ్యవస్థాపక నేత, మాజీ ప్రధాని దేవేగౌడ నుంచి కుమార స్వామి వరకు ఈ అసెంబ్లీ సీటు నుంచి సునాయాసంగా విజయం సాధించారు. కానీ 2023 ఎన్నికల్లో ఈ సీటు జేడీఎస్ కు ఝలక్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో రామ నగర నుంచి జేడీఎస్ తరఫున కుమారస్వామి కుమారుడు నిఖిల్ పోటీ చేశారు. కంచుకోట వంటి స్థానంలో తమ గెలుపు సులభమేనని వారు భావించారు. కానీ అనూహ్యంగా, కాంగ్రెస్ (congress) వేవ్ లో ఆ సీటు కూడా చేరింది. కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్ హుస్సేన్ చేతిలో నిఖిల్ ఓటమి పాలయ్యారు.
లోక్సభ ఎన్నికలకు దిక్సూచి: సిద్ధారామయ్య
‘లోక్ సభ సమయానికి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుంది. ఇంకా ఎక్కువ సీట్లు గెలుస్తాం. మాకు వనరులు చాలా తక్కువ. ఒక్కో అభ్యర్థిపై రూ.10 కోట్ల వరకు ఖర్చు చేశారు. మేము బి ఫారం ఇచ్చాం. కొంచెం సహాయం చేసాం. దేశాన్ని కాంగ్రెస్ రహితంగా మారుస్తామని బీజేపీ చెప్పేది. కానీ అన్ని రాష్ట్రాల్లో బీజేపీ లేదు. పశ్చిమబెంగాల్, కేరళ, తెలంగాణ, ఒడిశాలో బీజేపీ లేదు. హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీలో బీజేపీ లేదు. రానున్న లోక్ సభ ఎన్నికలకు ఇది దిక్సూచి..’ అని సిద్ధరామయ్య అన్నారు.
కాంగ్రెస్ 133.. ఫలితాల టేబుల్ ఇక్కడ చూడండి
పార్టీ | ఆధిక్యం | గెలుపు |
కాంగ్రెస్ | 129 | 4 |
బీజేపీ | 63 | 2 |
జేడీఎస్ | 22 | 0 |
ఇండిపెండెంట్ | 2 | 2 |
ఇతరులు | 2 | 2 |
132 సీట్లలో కాంగ్రెస్ ఆధిక్యం
కర్ణాటక అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఆ పార్టీ ఇప్పటి వరకు 3 సీట్లలో గెలిచింది. మరో 129 సీట్లలో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 66 సీట్లలో ఆధిక్యంలో ఉంది. జేడీఎస్ 22 సీట్లలో ఆధిక్యంలో ఉంది.
కర్ణాటకలో మోదీని, కేసీఆర్ను తిరస్కరించారు: రేవంత్
‘కర్ణాటకలో బీజేపీ కుట్రలను ప్రజలు తిప్పికొట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ వైపు స్పష్టమైన తీర్పు ఇస్తున్నారు. శ్రీరాముణ్ణి అడ్డుపెట్టుకుని పార్టీ విస్తరించాలనుకోవడం బీజేపీ మానుకోవాలి. భజరంగ్ బలిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూశారు. శ్రీరాముణ్ణి అవమానించిన వారిని భజరంగబలి ఆశీర్వదించడు. కర్ణాటకలో బీజేపీ ఓడించి మోదీని, జేడీఎస్ను ఓడించి కేసీఆర్ను తిరస్కరించారు. దేశంలో ఇవే ఫలితాలు రాబోతున్నాయి. తెలంగాణలోను స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఎంఐఎం విధానాన్ని ప్రజలంతా నిశితంగా గమనిస్తున్నారు..’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
మీడియా ముందుకు సిద్ధరామయ్య
సిద్ద రామయ్య మీడియాతో మాట్లాడుతున్నారు. ‘కాంగ్రెస్కు తగినంత మెజారిటీ లభించింది. 130 సీట్లకు పైగా గెలుచుకుంటామని నమ్ముతున్నా. 130 దాటుతామని నమ్ముతున్నా. ఇది కాంగ్రెస్ పార్టీకి భారీ విజయం. కర్ణాటక ప్రజలు మార్పు కోరుకున్నారు. కర్ణాటక ప్రజలు బీజేపీ ప్రభుత్వ పాలనతో విసిగిపోయారు. భారీగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. 2008లో గానీ 2018లోగానీ బీజేపీకి ప్రజలు అధికారం కట్టబెట్టలేదు. ఆపరేషన్ కమలతో వాళ్లు అధికారంలోకి వచ్చారు. విపరీతమైన ధనం ఖర్చు పెట్టారు. కాంగ్రెస్, జేడీఎస్ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారు. ప్రజలు బీజేపీకి గుణపాఠం చెప్పారు. కర్ణాటక ప్రజలు రాజకీయంగా పరిణితి కలిగి ఉన్నవారు. వారికి ఏ పార్టీ రాష్ట్రాన్ని కాపాడుతుందో తెలుసు. రాష్ట్రంలో ఉన్న సెక్యులర్ పరిస్థితులను చెడగొట్టి విధ్వేషపు రాజకీయాలు చేసిన బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పారు..’ అని వివరించారు.
Karnataka result: ఓటమిని అంగీకరించిన బీజేపీ; గుణపాఠంగా తీసుకుంటామన్న సీఎం బొమ్మై
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం దాదాపు ఖాయమైన నేపథ్యంలో.. బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి బస్వరాజు బొమ్మ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తున్నట్లు అందులో తెలిపారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ లక్ష్యాలను చేరుకోలేకపోయిందని బొమ్మై పేర్కొన్నారు. పూర్తిగా ఫలితాలు వెల్లడైన తరువాత పూర్తి స్థాయిలో ఆత్మ విమర్శ చేసుకుంటామన్నారు. ఫలితాలపై సంపూర్థ విశ్లేషణ చేసి, తప్పులను సరిదిద్దుకుంటామని తెలిపారు. ‘‘ఒక జాతీయ పార్టీగా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా ఈ ఎన్నికల్లో గెలుపు, ఓటములకు సంబంధించిన పూర్తి స్థాయి సమీక్ష జరుపుతాం. వివిధ స్థాయిల్లో ఏయే విషయాల్లో దెబ్బతిన్నామనే విషయాన్ని విశ్లేషిస్తాం’’ అని వివరించారు.
కన్నీళ్లు పెట్టుకున్న శివకుమార్
కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివశంకర్ ఇప్పుడే తన నివాసం నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ‘అందరికీ నమస్కారం. కర్ణాటక ప్రజలందరికీ సాష్టాంగ నమస్కారం. పార్టీ శ్రేణులు, నేతలు చాలా కష్టపడ్డారు..’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ విజయానికి కృషి చేశారని అన్నారు.
Karnataka election results: ఎన్నికల ఫలితాల టేబుల్
పార్టీ | ఆధిక్యం | గెలుపు |
కాంగ్రెస్ | 128 | 2 |
బీజేపీ | 66 | 0 |
జేడీఎస్ | 22 | 0 |
ఇండిపెండెంట్స్ | 4 | 0 |
ఇతరులు | 2 | 0 |
మొత్తం | 222 | 2 |
‘కింగ్ మేకర్’ కలలు కల్లలు
కాంగ్రెస్, బీజేపీలకు తగిన మెజారిటీ రాకుండా తనకు 30 సీట్లు లభిస్తే కింగ్ మేకర్గా ఉండొచ్చనుకున్న జేడీఎస్ నేత కుమారస్వామి కలలు కల్లలయ్యాయి. జేడీఎస్ శ్రేణుల్లో ఫలితాలు నిరాశను కలిగించాయి.
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య?
కర్ణాటక నూతన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఉపముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
130 సీట్లకు పెరిగిన కాంగ్రెస్ ఆధిక్యత
కర్ణాటకలో కాంగ్రెస్ 130 సీట్లలో విజయం నమోదు చేసుకోబోతోంది. బీజేపీ 66 సీట్లలో, జేడీఎస్ 22 సీట్లలో ఆధిక్యం కనబరుస్తోంది.
Karnataka election results: ప్రాంతాల వారీగా కర్నాటక ఫలితాల ముఖచిత్రం
Karnataka election results: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల (karnataka assembly elections 2023) ఫలితాల్లో.. బెంగళూరు, కోస్టల్ కర్నాటకలను మినహాయిస్తే, మిగతా అన్ని ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగింది. ముఖ్యంగా, గత ఎన్నికల్లో బీజేపీ అధిక సంఖ్యలో స్థానాలను గెల్చుకున్న ప్రాంతాల్లో కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పాగా వేయగలిగింది.
రేపు కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో పార్టీ మెజారిటీ మార్కును దాటి 128 స్థానాల్లో ఆధిక్యత సాధించడంతో కాంగ్రెస్ శాసనసభా పక్షం (CLP) సమావేశం రేపు ఉదయం బెంగళూరులో జరగనుంది.
128 సీట్లకు పెరిగిన కాంగ్రెస్ ఆధిక్యం
కాంగ్రెస్ ఆధిక్యం 128 సీట్లకు పెరిగింది. బీజేపీ 67, జేడీఎస్ 22 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. ఫలితాల సరళి ఇలాగే కొనసాగితే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుంది.
పరిమితమవుతున్న జేడీఎస్ సీట్లు
తొలుత జేడీఎస్ 30 సీట్లలో ఆధిక్యత కనబరచగా తాజా సరళిలో కేవలం 23 సీట్లలోనే ఆధిక్యం కనబరుస్తోంది. అలాగే కాంగ్రెస్ 124 సీట్లలో ఆధిక్యత కనబరుస్తూ గద్దెనెక్కే దిశగా ముందుకు సాగుతోంది.
పార్టీ | గెలుపు | ఆధిక్యం |
కాంగ్రెస్ | 124 | |
బీజేపీ | 70 | |
జేడీఎస్ | 23 | |
ఇండిపెండెంట్ | 5 | |
ఇతరులు | 2 |
124 సీట్లలో కాంగ్రెస్ ఆధిక్యం
ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముందుకు సాగుతున్నకొద్దీ కాంగ్రెస్కు బలం పెరుగుతూ వస్తోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ 124 సీట్లలో ఆధిక్యత కనబరుస్తోంది. బీజేపీ 69 సీట్లలో, జేడీఎస్ 24 సీట్లలో ఆధిక్యత కనబరుస్తోంది.
సిద్ధరామయ్య తొలి స్పందన ఇదే
224 మంది సభ్యులున్న కర్ణాటక శాసనసభలో 120 సీట్లకు పైగా గెలిచి సొంతంగా అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య అన్నారు. "కాంగ్రెస్ పార్టీ 120 సీట్లకు పైగా గెలుస్తుంది. ఇది ఇంకా ప్రారంభ దశ. ఇంకా కౌంటింగ్ పూర్తి కావాలి. కాంగ్రెస్ సొంత బలంతో 120 సీట్లకు పైగా సాధించి అధికారంలోకి వస్తుంది" అని అన్నారు.
121 సీట్లలో కాంగ్రెస్ ఆధిక్యం
కాంగ్రెస్ మ్యాజిక్ మార్కు 113 దాటేసి 121 సీట్లలో ఆధిక్యంలో ఉంది.
పార్టీ | గెలుపు | ఆధిక్యం |
కాంగ్రెస్ | 0 | 121 |
బీజేపీ | 0 | 72 |
జేడీఎస్ | 0 | 24 |
ఇతరులు | 0 | 7 |
‘40% నినాదాన్ని ప్రజలు ఆమోదించారు’: సచిన్ పైలట్
అధికార బిజెపికి వ్యతిరేకంగా తమ పార్టీ లేవనెత్తిన "అవినీతి" అంశం విజయంలో నిర్ణయాత్మకంగా మారిందని సచిన్ పైలట్ అన్నారు. సచిన్ పైలట్ మాట్లాడుతూ.. "కాంగ్రెస్కు మెజారిటీ లభిస్తుంది. మేం లేవనెత్తిన ఇచ్చిన '40 శాతం కమీషన్ ప్రభుత్వం' అనే నినాదాన్ని ప్రజలు అంగీకరించారు..’ అని అన్నారు.
డీకే శివకుమార్ టీమ్ ఉత్కంఠ
కర్ణాటక ఎన్నికల ఫలితాల సరళిని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ఎంపీ డీకే సురేశ్ శనివారం బెంగళూరులోని సదాశివనగర్లోని తమ నివాసంలో తెలుసుకుంటున్న దృశ్యం. ఎమ్మెల్సీ ఎస్.రవి, కేపీసీసీఐటీ సెల్ అధ్యక్షుడు రఘునందన్ రామన్న, కేపీసీసీ కోశాధికారి వినయ్ కార్తీక్, ప్రధాన కార్యదర్శి విజయ్ ముకుంద్ తదితరులు వారి వెంట కనిపించారు.
Karnataka results live: కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు?
కాంగ్రెస్కు తగిన మెజారిటీ వస్తే కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారా? ప్రజాధరణ ఎక్కువగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అవుతారా? అన్న చర్చ ఉత్కంఠకు దారితీస్తోంది.
కర్ణాటక ఎలక్షన్ రిజల్ట్స్ టేబుల్: కొనసాగుతున్న కాంగ్రెస్ ఆధిక్యం
పార్టీ | ఆధిక్యం | గెలుపు |
కాంగ్రెస్ | 118 | 0 |
బీజేపీ | 75 | 0 |
జేడీఎస్ | 24 | 0 |
ఇతరులు | 7 | 0 |
లింగాయత్ ఓట్లలో చీలిక.. 30 శాతం వరకు కాంగ్రెస్కు
లింగాయత్ల ఓట్లలో చీలిక ఏర్పడినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీరిలో 30 నుంచి 40 శాతం ఓట్లు బీజేపీ నుంచి కాంగ్రెస్కు మొగ్గు చూపినట్టు అంచనా వేస్తున్నారు.
కాంగ్రెస్కు దక్కిన దళితుల మద్దతు
ఎస్సీ ఓట్లు గతంలో బీఎస్పీకి మద్దతుగా పడేవి. గత ఎన్నికల అనంతరం బీఎస్పీ ప్రభావం కనుమరుగైంది. ఈ నేపథ్యంలో దళితులు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారు.
ధరల పెరుగుదల, నిరుద్యోగిత ప్రభావం
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల దుస్థితి, పట్టణ ప్రాంతాలలో మంచినీటి సమస్య తదితర అంశాలపై అధికార బిజెపి పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ఎగ్జిట్ పోల్స్లో విశ్లేషించింది. ఈ వ్యతిరేకత కారణంగానే బిజెపి అధికారం కోల్పోయే అవకాశాలు కనబడుతున్నాయని ముందుగానే అంచనా వేసింది.
40 శాతం సర్కారు నినాదం ఫలించిందా?
ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలోని అవినీతిని ఎండగడుతూ చేసిన ‘40% సర్కారు’ కమీషన్ నినాదం ద్వారా కాంగ్రెస్ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లగలిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆకర్షనీయమైన మేనిఫెస్టో వల్ల ఆ పార్టీకి లాభం చేకూరింది.
సిలిండర్, పెట్రోలు ధరల ప్రభావం?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోయే స్థితికి రావడానికి సిలిండర్ ధరల పెరుగుదల, పెట్రోలు, డీజిల్ పెరుగుదల ప్రభావం చూపిందని ఎన్నికల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఎస్సీ, ఎస్టీ సీట్లలో కాంగ్రెస్ సంపూర్ణ ఆధిక్యం
ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ సీట్లలో ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ సంపూర్ణ ఆధిక్యం కనబరుస్తోంది. మొత్తంగా రాష్ట్రంలో కాంగ్రెస్ 43 శాతం ఓట్లతో ముందంజటలో ఉంది. బీజేపీ 36.1 శాతం ఓట్లు దక్కించుకుంది. జేడీఎస్ 13 శాతం ఓట్లు దక్కించుకుంది.
స్పష్టంగా కాంగ్రెస్కు ఆధిక్యం
కాంగ్రెస్కు ఇప్పటి వరకు 119 సీట్లలో స్పష్టమైన ఆధిక్యం కనబడుతోంది. అయితే చివరి వరకు ఫలితాలు ఉత్కంఠగా మారనున్నాయి.
Karnataka results live: ప్రజలు బీజేపీతో విసిగిపోయారు. సిద్దరామయ్య
కర్ణాటకలో నరేంద్ర మోడీ, అమిత్ షాల ప్రచారం ఏ మాత్రం మార్పు తీసుకురాలేదని సిద్ధరామయ్యా అన్నారు. బీజేపీతో ప్రజలు విసిగిపోయారన్నారు. తాను మొదటి నుంచి చెబుతున్నది నిజమైందని సిద్ధరామయ్య విశ్లేషించారు.
కర్ణాటక ఫలితాలు లైవ్: బీజేపీ నేతలకు ఎదురుదెబ్బ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో పలు రౌండ్లలో బీజేపీ అగ్రనేతలు వెనుకంజలో ఉన్నారు. బళ్లారి రూరల్ లో శ్రీరాములు, చిక్కనాయకనహళ్లిలో మధుస్వామి వెనుకంజలో ఉన్నారు. సిర్సిలో విశ్వేశ్వర్ హెగ్డే కాగేరి కేవలం 23 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రాజాజీనగర్ లో సురేష్ కుమార్ 510 ఓట్ల వెనుకంజలో ఉన్నారు.
117 సీట్లలో కాంగ్రెస్ ఆధిక్యం
పార్టీ | ఆధిక్యం | గెలుపు |
కాంగ్రెస్ | 117 | 0 |
బీజేపీ | 71 | 0 |
జేడీఎస్ | 28 | 0 |
ఇతరులు | 4 | 0 |
మ్యాజిక్ నెంబర్ నిలబెట్టుకుంటుందా?
కాంగ్రెస్ 115 స్థానాల్లో, బీజేపీ 72 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శరవేగంగా జరుగుతుండగా, ఉదయం 10.40 గంటలకల్లా కాంగ్రెస్ మెజారిటీపై స్పష్టమైన అంచనాకు వచ్చింది.224 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీలో 113 మ్యాజిక్ నంబర్. ప్రస్తుతం కాంగ్రెస్ 115 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఓట్ల లెక్కింపు తర్వాత బెంగళూరులో సమావేశం నిర్వహించి ఎమ్మెల్యేల మధ్య ఐక్యతను కాపాడేందుకు కాంగ్రెస్ నేతలు వ్యూహరచన చేస్తున్నారు.
దక్షిణ కన్నడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుత ట్రెండ్
మంగళూరులో రెండో రౌండ్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి యూటీ ఖాదర్ కు 13024,5795 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి సతీష్ కుంపాలకు 7279 ఓట్లు వచ్చాయి.
బెల్తంగడి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి హరీష్ పూంజాకు 30183,25212 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి రక్షిత్ శివరాంకు 4971 ఓట్లు వచ్చాయి.
సులియా అసెంబ్లీ నియోజకవర్గంలో నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి భాగీరథి మురళికి 20563,17618 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణప్పకు 2945 ఓట్లు లభించాయి.
కర్ణాటక అసెంబ్లీ తాజా ఫలితాలు
పార్టీ | ఆధిక్యం | గెలుపు |
కాంగ్రెస్ | 112 | 0 |
బీజేపీ | 73 | 0 |
జేడీఎస్ | 27 | 0 |
ఇతరులు | 3 | 0 |
లింగాయత్ సామాజిక వర్గం బలంగా ఉన్న చోట్ల కూడా బీజేపీ వెనకంజ
బీజేపీకి సాంప్రదాయక మద్దతుదారుగా ఉన్న లింగాయత్ సామాజిక వర్గం బలంగా ఉన్న చోట్ల కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.
49 సీట్లలో కేవలం 1000 ఓట్ల ఆధిక్యం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠగా ఉన్నాయి. సుమారు 49 సీట్లలో ఇరు పార్టీలు కేవలం 1000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నాయి. 32 సీట్లలో కేవలం 500 ఓట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. చివరివరకు ఫలితాలు ఉత్కంఠగా మారనున్నాయి.
నా తండ్రి ముఖ్యమంత్రి కావాలి
రాష్ట్రంలో కాంగ్రెస్ కు సంపూర్ణ మెజారిటీ వస్తుందని, వరుణ నియోజకవర్గంలో తన తండ్రి భారీ మెజార్టీతో గెలుస్తారని యతీంద్ర సిద్ధరామయ్య అన్నారు. కర్ణాటక ప్రయోజనాల దృష్ట్యా తన తండ్రి ముఖ్యమంత్రి కావాలని అన్నారు.
ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఎదురుదెబ్బ
ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సొంత జిల్లా హవేరి జిల్లాలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఐదు స్థానాల్లో, బీజేపీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా
కాంగ్రెస్ అభ్యర్థి డీకే శివకుమార్ కు భారీ ఆధిక్యం
కనకపుర అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. శివకుమార్ 9730,2812 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. జేడీఎస్ అభ్యర్థి బి. నాగరాజు 1316 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి ఆర్. అశోక్ మూడో స్థానంలో నిలిచారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ముందంజ
పార్టీ | ఆధిక్యం | గెలుపు |
కాంగ్రెస్ | 117 | 0 |
బీజేపీ | 77 | 0 |
జేడీఎస్ | 26 | 0 |
ఇతరులు | 5 | 0 |
బెంగళూరు రూరల్ కౌంటింగ్ ఫలితాలు
దొడ్డబళ్లాపుర - బీజేపీ ఆధిక్యం - ధీరజ్ మునిరాజు
దేవనహళ్లి- కాంగ్రెస్ నేత- కేహెచ్ మునియప్ప
నేలమంగళ - కాంగ్రెస్ ఆధిక్యం - ఎన్. శ్రీనివాస్
హోసకోటే - కాంగ్రెస్ ఆధిక్యం - శరత్ బచ్చెగౌడ
బళ్లారి ప్రస్తుత చిత్రం
Siraguppa
కాంగ్రెస్ - బి.ఎం.నాగరాజ్ - 4455
బీజేపీ- సోమలింగప్ప - 3370
కేఆర్పీపీ- దారప్ప నాయక్- 863
1085 ఆధిక్యంలో కాంగ్రెస్
సందూర్
కాంగ్రెస్ - ఇ.తుకారాం - 5964
బీజేపీ-శిల్పా రాఘవేంద్ర -2038
కేఆర్పీపీ- కేఎస్ దివాకర్- 2765
3199 ఆధిక్యంలో కాంగ్రెస్
బళ్లారి రూరల్
కాంగ్రెస్ నాగేంద్ర - 10009
బీజేపీ-శ్రీరాములు-8661
1348 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్
యడ్యూరప్ప కుమారుడి వెనుకంజ
యడ్యూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర శిఖారిపుర నియోజకవర్గంలో వెనకంజలో ఉన్నారు.
కాంగ్రెస్కు 45.3 శాతం ఓట్లు
ఎలక్షన్ కమిషన్ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు కాంగ్రెస్కు 45.3 శాతం ఓట్లు లభించాయి. బీజేపీకి 38.8 శాతం ఓట్లు లభించాయి. జేడీఎస్కు 7.7 శాతం ఓట్లు లభించాయి.
మాది చిన్న పార్టీ.. పెద్ద డిమాండ్లేవీ లేవు: కుమారస్వామి
తమది చిన్న పార్టీ అని, తమకు ఎలాంటి డిమాండ్లు లేవని జేడీఎస్ నేత కుమారస్వామి అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఎవరూ సంప్రదించలేదన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
పార్టీ | ఆధిక్యం | గెలుపు |
కాంగ్రెస్ | 121 | 0 |
బీజేపీ | 79 | 0 |
జేడీఎస్ | 22 | 0 |
ఇతరులు | 2 | 0 |
కర్ణాటకలో కాంగ్రెస్ కు ఆధిక్యం
కాంగ్రెస్ 105, బీజేపీ 67, జేడీఎస్ 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
రెండో రౌండ్లోనూ బీజేపీ అభ్యర్థి శ్రీరాములుకు ఎదురుదెబ్బ తగిలింది.
నిప్పానీలో బీజేపీ అభ్యర్థి శశికళ జోల్లె వెనుకంజలో ఉన్నారు.
బెంగళూరు ప్రాంతంలో కాంగ్రెస్ హవా
బెంగళూరు ప్రాంతంలో కాంగ్రెస్ 28 సీట్లకు గాను 17 సీట్లలో ఆధిక్యత కనబరుస్తోంది. సెంట్రల్ కర్ణాటకలో పోటాపోటీ ఉంది.
హైదరాబాద్ కర్ణాటకలో కాంగ్రెస్ ఆధిక్యత
హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలోని 40 సీట్లలో 20 సీట్లు కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోబోతోంది. అయితే కోస్టల్ కర్ణాటకలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తోంది.
పలువురు మంత్రుల వెనకంజ
కర్ణాటక ప్రస్తుత మంత్రివర్గంలోని పలువురు మంత్రులు ప్రారంభ రౌండ్లలో వెనుకంజలో ఉన్నారు.
జగదీష్ శెట్టర్ కు ఎదురుదెబ్బ
హుబ్బళ్లి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్ శెట్టర్ వెనుకంజలో ఉన్నారు.
కాంగ్రెస్ జోరు.. కమలం బేజారు
ఇప్పటివరకు కాంగ్రెస్ 105 సీట్లలో, బీజేపీ 65 సీట్లలో ముందంజలో ఉన్నాయి.. జేడీఎస్ 15 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. ఇతరులు 3 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు.
దక్షిణ కన్నడలో ట్రెండ్స్ ఇలా
బీజేపీ సులియా అభ్యర్థి భాగీరథి మురళి 400 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
బెల్తంగడి బీజేపీ అభ్యర్థి హరీష్ పూంజా 1300 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
పుత్తూరు కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ రాయ్ 1500 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
కుమారస్వామికి ఎదురుదెబ్బ
చెన్నపట్నలో తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసింది.
బీజేపీ అభ్యర్థి సీపీ యోగేశ్వర్ ముందంజలో ఉన్నారు.
జేడీఎస్ నేత కుమారస్వామికి ఎదురుదెబ్బ తగిలింది.
ముధోల్ లో బీజేపీ అభ్యర్థి గోవింద్ కర్జోల్ ముందంజలో ఉన్నారు.
ఈసీ ట్రెండ్స్..
ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ ప్రకారం.. కాంగ్రెస్ 12 స్థానాల్లో లీడ్లో ఉంది. బీజేపీ 8 స్థానాల్లో ముందంజలో ఉంది. జేడీఎస్ 1 సీటులో ఆధిక్యంలో ఉంది.
100 సీట్ల ఆధిక్యం..!
ఎర్లీ ట్రెండ్స్లో బీజేపీకి 100 సీట్ల ఆధిక్యం లభించింది. కాంగ్రెస్ 94 సీట్లల్లో ముందంజలో ఉంది. జేడీఎస్ 26 సీట్లల్లో లీడ్లో ఉంది.
90కిపైగా సీట్లల్లో..
ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం బీజేపీకి 93 సీట్లల్లో ఆధిక్యం లభించింది. కాంగ్రెస్ 80 సీట్లల్లో ముందజంలో ఉంది. జేడీఎస్ 21 సీట్లల్లో లీడ్ను కొనసాగిస్తోంది.
హుబ్బళ్లీలో బొమ్మై పూజలు..
ఓవైపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగుతుంటే.. మరవైపు సీఎం బసవార్ బొమ్మై హుబ్బళ్లీకి వెళ్లారు. అక్కడి హనుమాన్ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆధిక్యంలో బీజేపీ
ఎర్లీ ట్రెండ్స్లో అధికార బీజేపీ ఆధిక్యంలో ఉంది. దాదాపు 53 స్థానాల్లో లీడ్లో ఉంది. 45 చోట్ల కాంగ్రెస్ లీడ్లో ఉంది. జేడీఎస్ 12 స్థానాల్లో ఆధిక్యాన్ని పొందింది.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ షురూ..
దేశ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం. నేడు కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. 2,615 అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
కాంగ్రెస్ సంబరాలు..
ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభానికి ముందే.. సంబరాలు మొదలుపెట్టింది కాంగ్రెస్. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సందడి వాతావరణం మధ్య వేడుకలు జరుగుతున్నాయి.
నన్ను ఏ పార్టీ సంప్రదించలేదు..
ఎన్నికల ఫలితాలకు ముందు కీలక వ్యాఖ్యలు చేశారు జేడీఎస్ నేత కుమారస్వామి. తనను ఏ పార్టీ సంప్రదించలేదన్నారు. తనది ఓ చిన్న పార్టీ అని, తనకు డిమాండ్లేవీ లేవన్నారు.
కింగ్ మేకర్..!
ఈసారి గెలుపుపై బీజేపీ, కాంగ్రెస్లు ధీమాగా ఉన్నాయి. కింగ్ మేకర్ అవ్వాలని జేడీఎస్ అభిప్రాయపడుతోంది. రెండు పార్టీలు తమను సంప్రదించాయని, పొత్తులపై నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది. ఆయా పార్టీలు జేడీఎస్ మాటలను కొట్టిపారేశాయి.
పటిష్ట భద్రత
ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనున్న 36 కేంద్రాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టారు. కేంద్రాల్లోకి చెకింగ్ చేసిన తర్వాతే అనుమతినిస్తున్నారు.
2018 ఎన్నికల్లో
2018 ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ మెజారిటీని అందుకోలేకపోయింది. కాంగ్రెస్- జేడీఎస్లు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అది కొంతకాలం తర్వాత కూలిపోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చింది.
గెలుపుపై ధీమా..
గెలుపుపై ప్రధాన పార్టీలన్నీ ధీమాగా ఉన్నాయి. కాగా.. జేడీఎస్ మాత్రం కింగ్ మేకర్గా అవతరించాలని ఆశలు పెట్టుకుంటోంది. బీజేపీ, కాంగ్రెస్లు తమను సంప్రదించాయని చెబుతోంది. ఈ మాటలను ఆయా పార్టీలు కొట్టిపారేశాయి.
8 గంటలకు షురూ..
ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. మొత్తం 36 కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. ఫలితాలు వెలువడేసరికి సాయంత్రం దాటొచ్చు. కాగా.. మధ్యాహ్నం నాటికి స్పష్టత వచ్చేస్తుంది!
మేజిక్ ఫిగర్..
224 అసెంబ్లీ సీట్లున్న కర్ణాటకలో 113 మేజిక్ ఫిగర్గా ఉంది.
సర్వేలు- ఎగ్జిట్ పోల్స్..
ఎన్నికల అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్.. కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యంలో ఉంటుందని చెబుతున్నాయి. కొన్ని హంగ్ ఏర్పడుతుందని అంటున్నాయి.
224 అసెంబ్లీ సీట్లు..
కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ సీట్లున్నాయి. వీటికి మే 10న ఎన్నికలు జరిగాయి. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది.
నేడే ఎన్నికల ఫలితాలు..
కర్ణాటకలో నేడు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకొన్ని గంటల్లో ప్రారంభంకానుంది.