TS EAMCET 2023 : ముగిసిన ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ - భారీగా మిగిలిపోయిన సీట్లు, వివరాలివే
24 August 2023, 22:12 IST
- TS EAMCET 2023 Latest News: టీఎస్ ఎంసెట్ ప్రత్యేక కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా ఆగస్టు 24వ తేదీతో ముగిసింది. ఈ విద్యాసంవత్సరంలో 16,296 సీట్లు మిగిలిపోయాయి.
తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ 2023
Telangana EAMCET 2023: తెలంగాణలో ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ముగిసింది. ఆగస్టు 26వ తేదీతో స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది. అయితే ఈ విద్యాసంవత్సరంలో సీట్లు భారీగా మిగిలిపోయాయి. దాదాపు 16వేలకు పైగా సీట్లు మిగిలినట్లు అధికారులు తెలిపారు. ఇందులోఅత్యధికంగా సీఎస్ఈ, ఐటీ కోర్సుల్లో 5,723 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 178 ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో 85,671 సీట్లు ఉండగా... ఇప్పటివరకు 69,375 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 16, 296 సీట్లు మిగిలిపోయాయి. యాజమాన్యాల వారీగా మిగిలిన సీట్లను పరిశీలిస్తే.. 14,511 సీట్లు ప్రైవేట్ కాలేజీల్లో మిగిలిపోయాయి. అయితే స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా ఆయా కాలేజీలు విద్యార్థులు చేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఫలితంగా మరికొన్ని సీట్లు భర్తీ అయ్యే అకాశం ఉన్నప్పటికీ...మిగిలే సీట్ల సంఖ్య ఎక్కువగా ఉండనుంది.
ఇక స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్లో స్పీట్లు పొందిన వారు ఈ నెల 29లోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఆయా తేదీల్లోగా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని స్పష్టం చేశారు.
ఏపీ ఇంజినీరింగ్ కౌన్సిలింగ్లో ఇలా….
AP EAPCET Counselling: ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈఏపీసెట్-2023 తొలి విడత కౌన్సిలింగ్ పూర్తైంది. రాష్ట్ర వ్యాపంగా 94,580మంది ప్రవేశాలు పొందారని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ప్రకటించారు. ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి రాష్ట్రంలోని 253 కళాశాలల్లో 94,580 మందికి సీట్లు కేటాయించారు.
కన్వీనర్ కోటాలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,21,306 సీట్లు ఉన్నాయి. తొలి విడత కేటాయింపులు పూర్తైన తర్వాత మిగిలిన 26,726 సీట్లను తుది విడత కౌన్సెలింగ్లో భర్తీ చేయనున్నార. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,986 మంది విద్యార్థులు 31,36,318 ఆప్షన్లను ఎంపిక చేసుకున్నారు. నిబంధనల ప్రకారం ఆయా కళాశాలల్లో బ్రాంచిల్లో సీట్లను కేటా యించినట్టు వివరించారు. 26 యూనివర్శిటీ ఇంజినీరింగ్ కళాశాలల్లో 5,813 సీట్లు, 221 ప్రైవేటు కళాశాలల్లో 84,956 సీట్లు, ఆరు ప్రైవే టు విశ్వవిద్యాలయాల్లో 3,811 సీట్లను భర్తీ చేశారు. 530 సీట్ల భర్తీకి సంబంధించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి జాబితాలు వచ్చిన తర్వాత అభ్యర్థులకు సీట్లు కేటాయించనున్నారు.
ఈ ఏడాది ఏపీ ఈఏపీ సెట్లో 1,57,319 మంది అర్హత సాధించారు. కౌన్సెలింగ్ కోసం 1,03,171 మంది రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 1,00986 మంది చేరాలి అనుకుంటున్న కోర్సులు, కోరుకున్న కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకున్నారు. ఏపీలోని ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 4,103 ఇంజనీరింగ్ సీట్లు ఉండగా 3,811 భర్తీ అయ్యాయి. ప్రభుత్వ వర్సిటీ కాలేజీల్లో 7,455 సీట్లు ఉండగా వాటిలో 5,813 సీట్లు భర్తీ అయ్యాయి.ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో 1,09,748 సీట్లకు గాను 84,956 నిండాయి.
కౌన్సిలింగ్ నేపథ్యంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ సర్వర్లు మొరాయిం చడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గుర య్యారు. ఏ కళాశాలలో సీటు వచ్చిందో చూసు కునేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మొదటి విడత కౌన్సెలింగ్లో సీట్ల అలాట్మెంట్కు సంబంధించి ఫోన్లకు బుధవారం మెసేజీలు వచ్చాయి.
మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 17న సీట్లు కేటాయించాల్సి ఉంటే.. దానిని 23కు వరకు పొడిగించారు. సీట్లు కేటాయింపు తర్వాత వివరాలు చూసుకోడానికి, అలాట్మెంట్ లెటర్ డౌన్ లోడ్ చేసుకునేందుకు అభ్యర్థులు ఒకేసారి ప్రయత్నించడంతో సర్వర్ మొరాయించింది. గురువారం కూడా ఇదే పరిస్థితి ఉంది. దీంతో కాల్ లెటర్ల కోసం విద్యార్ధులు ఎదురు చూస్తున్నారు. సమస్య త్వరలోనే పరిష్కరిస్తామని సాంకేతిక విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.