India vs Sri Lanka Asia Cup Super-4 Match: గెలిస్తేనే.. నిలిచేది.. భారత్కు చావో రేవో?
06 September 2022, 11:52 IST
- India vs Sri Lanka: పాకిస్థాన్ చేతిలో సూపర్-4 తొలి మ్యాచ్లో కంగు తిన్న భారత్.. తన తర్వాతి మ్యాచ్ లంక జట్టులో ఆడనుంది. ఈ మ్యాచ్ టీమిండియాకు చావో రేవో లాంటిది. ఇందులో ఓడితే టీమిండియాకు ఆసియ కప్ ఫైనల్ అవకాశాలు దాదాపు మూసిపోయినట్లే.
భారత్-శ్రీలంక
India vs Sri Lanka Asia Cup 2022: పాకిస్థాన్, హాంకాంగ్ లాంటి జట్లను ఓడించి ఆసియా కప్ను ఘనంగా ఆరంభించిన టీమిండియాకు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆదివారం నాడు పాక్తో జరిగిన సూపర్-4 మ్యాచ్లో భారత్ ఓడిపోవడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. టోర్నీలో ఫైనల్ చేరాలంటే మంగళవారం నాడు శ్రీలంకతో జరగనున్న మ్యాచ్లో తప్పక గెలవాల్సిందే. ఇందులో నెగ్గితే ఫైనల్కు చేరడానికి భారత్కు మెండుగా అవకాశాలుంటాయి. మంగళవారం నాడు రాత్రి 7.30 గంటలకు శ్రీలంకతో సూపర్-4 మ్యాచ్లో ఢీకొట్టనుంది రోహిత్ సేన.
టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో అంతకుముందు మ్యాచ్తో పోలిస్తే పాక్తో మ్యాచ్లో కాస్త కుదురుకుంది. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నారు. అయితే ఎక్కువ సేపు క్రీజులో నిలబడకపోవడం ఆందోళన కలిగిస్తుంది. దాదాపు నెల గ్యాప్ తర్వాత జట్టులోకి పునరాగమనం చేసిన విరాట్ కోహ్లీ ఫామ్ అందిపుచ్చుకోవడం భారత్కు కలిసొచ్చే అంశం. అతడు వరుసగా రెండు అర్ధ శతకాలు చేశాడు. బౌండరీలు సులువుగా బాదేస్తున్నప్పటికీ.. పాత కోహ్లీని గుర్తుకు తీసుకొచ్చేలా వేగంగా ఆడాల్సి ఉంది. మిడిలార్డర్ సమస్య వేధిస్తోంది. గత మ్యాచ్లో రిషభ్ పంత్ విఫలం కావడంతో.. ఈ మ్యాచ్లో అతడి స్థానంలో దినేశ్ కార్తీక్కు అవకాశమివ్వచ్చు. గత మ్యాచ్కు గాయం కారణంగా దూరమైన ఆవేశ్ ఖాన్ తిరిగి జట్టులోకి వస్తే.. దీపక్ హుడాపై వేటుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జట్టులో మార్పులు తప్పవా?
ఇక బౌలింగ్ విషయానికొస్తే.. గత మ్యాచ్లో బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. హార్దిక్ పాండ్య, యజువేంద్ర చాహల్ దారళంగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో ఈ సారి జట్టులో మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాహల్.. స్థానంలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు తీసుకునే అవకాశాలున్నాయి. గాయం కారణంగా జడేజా జట్టుకు దూరం కావడంతో ఆరో బౌలింగ్ ఆప్షన్ భారత్కు లేదు. ఈ కారణంగా ఈ సారి అక్షర్ పటేల్ను తీసుకునే ఛాన్స్ ఉంది.
ఆత్మవిశ్వాసంతో బరిలోకి లంక జట్టు..
మరోపక్క శ్రీలంక జట్టు సూపర్-4 తొలి మ్యాచ్లో అఫ్గానిస్థాన్ను ఓడించి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. గ్రూప్లో అఫ్గాన్ చేతిలో కంగు తిన్న లంక జట్టు.. ఆ పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. కెప్టెన్ శనక, నిశాంక, కుశాల్ మెండిస్, గుణతిలక, రాజపక్స బ్యాటింగ్లో కీలకంగా మారారు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతున్నారు. బౌలింగ్ విషయానికొస్తే స్పినర్లు హసరంగ, తీక్షణ మెరుగ్గా రాణస్తున్నారు. వీరితో భారత బ్యాటర్లు జాగ్రత్తగా ఉండాల్సిందే.
తుదిపోరుకు వెళ్లడానికి భారత్ అవకాశాలు..
సూపర్-4లో ఒక్కో జట్టు మిగిలిన మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన టీమ్లు ఫైనల్కు చేరుకుంటాయి. ఇప్పటికే భారత్.. పాక్, అఫ్గానిస్థాన్పై శ్రీలంక గెలిచాయి. ఇప్పుడు లంక చేతిలోనూ భారత్ ఓడితే తుదిపోరుకు వెళ్లే దారులు దాదాపు మూసుకుపోయినట్లయితే. అఫ్గానిస్థాన్పై పాకిస్థాన్ గెలిచే అవకాశాలు ఎక్కువ కాబట్టి ఆ జట్టు తుదిపోరుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలా జరిగితే పాకిస్థాన్, శ్రీలంక మధ్య జరిగే చివరి సూపర్-4 మ్యాచ్లో గెలిచిన జట్టు మూడు విజయాలతో అగ్రస్థానంలోకి వెళ్తుంది. ఓడిన జట్టు రెండో స్థానాన్ని దక్కించుకునే ఛాన్స్ ఉంది.