Dhoni and Kapil at US Open: యూఎస్ ఓపెన్ మ్యాచ్ చూసిన లెజెండరీ కెప్టెన్లు కపిల్, ధోనీ
09 September 2022, 17:49 IST
- Dhoni and Kapil at US Open: యూఎస్ ఓపెన్ మ్యాచ్ కలిసి చూశారు టీమిండియా లెజెండరీ కెప్టెన్లు కపిల్, ధోనీ. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
యూఎస్ ఓపెన్ మ్యాచ్ చూస్తున్న ధోనీ
Dhoni and Kapil at US Open: టీమిండియాను రెండుసార్లు విశ్వవిజేతగా నిలిపిన కెప్టెన్లు వాళ్లు. ఇప్పుడు ఆ ఇద్దరూ కలిసి ఓ టెన్నిస్ మ్యాచ్ చూశారు. మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, ఎమ్మెస్ ధోనీ కలిసి యూఎస్ ఓపెన్లో కార్లోస్ అల్కరాజ్, జనిక్ సిన్నర్ మధ్య జరిగిన క్వార్టర్ఫైనల్ మ్యాచ్ను చూడటం విశేషం. దీనికి సంబంధించిన వీడియోను సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ తన ట్విటర్లో పోస్ట్ చేసింది.
ఇందులో ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా కూడా ఉన్నాడు. ధోనీ పక్కన కూర్చొని అతనితో మాట్లాడుతున్నాడు. న్యూయార్క్లోని ఆర్థర్ ఆషె స్టేడియంలో ఈ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. యూఎస్ ఓపెన్లో 5 గంటల 15 నిమిషాల పాటు సాగి రెండో లాంగెస్ట్ మ్యాచ్గా కూడా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ను చూస్తుండగా కెమెరా ధోనీ, కపిల్ వైపు తిరిగింది.
ఈ ఇద్దరినీ చూడగానే స్టేడియంలో ప్రేక్షకులు పెద్ద ఎత్తున అరవడం విశేషం. ఈ లెజెండరీ కెప్టెన్లకు అమెరికాలోనూ ఉన్న ఫాలోయింగ్కు ఇది నిదర్శనంగా చెప్పొచ్చు. కెమెరా ధోనీ వైపు తిరిగినప్పుడు తనను తాను బిగ్స్క్రీన్పై చూడగానే అతడు ముసిముసిగా నవ్వుతూ హాయ్ చెప్పాడు. ఆ తర్వాత అదే కెమెరాను మెల్లగా కపిల్ దేవ్ వైపు తిరిగింది.
ఇంతకుముందు ధోనీ ఈ ఏడాది జరిగిన వింబుల్డన్ టోర్నీకి కూడా వెళ్లాడు. ఆ సమయంలో ఇండియన్ క్రికెట్ టీమ్ ఇంగ్లండ్ టూర్లోనే ఉంది. దీంతో ధోనీ టీమ్ను కూడా కలిశాడు. ఈ మిస్టర్ కూల్ క్రికెటరే అయినా.. టెన్నిస్ అంటే చాలా ఇష్టపడతాడు. అందుకే వీలు చిక్కినప్పుడల్లా ఇలా గ్రాండ్స్లామ్స్ టోర్నీలకు వెళ్తుంటాడు. సచిన్ టెండూల్కర్ కూడా ఈ టెన్నిస్ మ్యాచ్లలో అప్పుడప్పుడూ స్పెషల్ అట్రాక్షన్గా కనిపిస్తుంటాడు.