Goddess Lakshmi Blessings : కార్తీక పౌర్ణమి నాడు ఈ 5 పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది
26 November 2023, 13:00 IST
- Karthika Pournami 2023 : కార్తీక పౌర్ణమి రోజున మనం చేసే కొన్ని పనులతో లక్ష్మీదేవి అనుగ్రహం పొందొచ్చు. ఈ విషయాన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమి రోజున చేయాల్సిన 5 పనులు ఏంటో చూద్దాం..
కార్తీక పౌర్ణమి
కార్తీక మాసం అన్ని మాసాలలోకెల్లా ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. ఈసారి కార్తీక పౌర్ణమి నవంబర్ 26 మధ్యాహ్నం మెుదలై.. నవంబర్ 27 మధ్యాహ్నం ముగుస్తుంది. ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేసి దానధర్మాలు చేస్తే నెల మొత్తం పూజలు చేసినంత ఫలితం లభిస్తుందని నమ్మకం. సాధారణంగా ఈ మాసంలో శివుడు, విష్ణుమూర్తిని పూజిస్తారు. శాస్త్రాల ప్రకారం, కార్తీక పౌర్ణమి రోజున కొన్ని ప్రత్యేక కార్యాలు చేయడం వల్ల లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది, జీవితంలో ఎప్పుడూ డబ్బు, ధాన్యాల కొరతను ఎదుర్కోకుండా కాపాడుతుంది. ఈరోజున చేయాల్సిన పనులు ఏంటో చూద్దాం..
లేటెస్ట్ ఫోటోలు
కార్తీక మాసంలో విష్ణువు నీటిలో ఉంటాడని విశ్వాసం. కార్తీక పౌర్ణమి రోజున గంగా లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేయడం వల్ల జీవితంలోని అన్ని పాపాలు తొలగిపోతాయని చెబుతారు. శ్రీ హరివిష్ణువు అనుగ్రహం వల్ల పుణ్యం లభిస్తుందని చెబుతారు. నదీ స్నానంతో ఉన్న దోషాలు పోతాయి.
హిందూ ధర్మ శాస్త్రాలలో సాధారణంగా పౌర్ణమి తిథిని శ్రీ హరికి అంకితం చేస్తారు. అయితే కార్తీక పౌర్ణమి ఉదయం విష్ణువు మత్స్య రూపానికి తులసిని సమర్పించి, సత్యనారాయణ కథను విని, పంచామృతంతో అభిషేకం చేసి, శివుడికి పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి. లక్ష్మీదేవికి, తులసి చెట్టుకు నెయ్యి దీపం వెలిగించాలి.
కార్తీక పౌర్ణమి రోజున ఆరుగురు తపస్వులకు కృత్తిక పూజ కూడా చేయాలి. కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడు ఉదయించిన తర్వాత కార్తీక స్వామికి ప్రీతి, సంతతి, క్షమా, అనసూయ, శివ, సంభూతి అనే ఆరుగురు తల్లులను పూజించాలి. ఈ రోజున ఆయనను పూజించడం వల్ల సంపద, శక్తి, ఓర్పు, ధాన్యం పెరుగుతాయని చెబుతారు.
కార్తీక పౌర్ణమి నాడు, నదిలో లేదా చెరువులో దీపదానం చేయడం విశిష్టమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. సాయంత్రం, ఈ క్రింది మంత్రాన్ని పఠించి, దీపం వెలిగించి, నది-చెరువులో స్నానం చేయండి. 'కీటా: పతంగా : మశకాశ్చ వృక్షా: జలే స్థలే యే నివసంతి జీవా: దృష్ట్యా ప్రదీపం నచ జన్మ భాగిన :' దీపాన్ని వెలిగించేప్పుడు ఈ మంత్రాన్ని పఠించాలి. ఇలా దీపదానం చేయడం వల్ల అకాల మరణ భయం తొలగిపోయి ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుందని నమ్మకం.
పౌర్ణమి రోజున అన్నదానం, వస్త్రాలు, పాదరక్షలు దానం చేయడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుంది. అప్పులు తొలగిపోతాయి. ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. కార్తీక పౌర్ణమి అత్యంత పవిత్రమైనది ఈరోజున మీరు పైన చెప్పిన విషయాలు పాటిస్తే.. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది.