Shahi Idgah mosque: మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం - షాహీ ఈద్గా మసీదు వివాదం; మసీదు సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతి
14 December 2023, 17:41 IST
Krishna Janmabhoomi temple: మధుర లోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం - షాహీ ఈద్గా మసీదు వివాదం విషయంలో అలహాబాద్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వారణాసిలోని జ్ఞానవాపీ మసీదు తరహాలో షాహీ ఈద్గా మసీదు సర్వేకు అనుమతించింది.
అలహాబాద్ హై కోర్టు
Krishna Janmabhoomi temple: మధురలోని కృష్ణ జన్మభూమి ఆలయానికి ఆనుకుని ఉన్న షాహీ ఈద్గా మసీదును సర్వే చేసేందుకు అడ్వకేట్ కమిషనర్ను నియమించాలన్న అభ్యర్థనకు అలహాబాద్ హైకోర్టు అనుమతించింది.
మసీదు సర్వే
ఉత్తరప్రదేశ్లోని మథురలోని షాహీ ఈద్గా మసీదును సర్వే చేసేందుకు అడ్వకేట్ కమిషనర్ను నియమించేందుకు అలహాబాద్ హైకోర్టు గురువారం అనుమతించింది. నగరంలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయానికి ఆనుకుని ఉన్న షాహీ ఈద్గా ప్రాంగణాన్ని కోర్టు పర్యవేక్షణలో సర్వే చేసేందుకు హైకోర్టు అనుమతించింది. మసీదు ఒకప్పుడు హిందూ దేవాలయంగా ఉండేదని నిరూపించే ఆధారాలు మసీదు లోపల ఉన్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు. దాంతో, షాహీ ఈద్గా మసీదు సర్వేకు అనుమతిస్తూ, ఆ సర్వేను పర్యవేక్షించడానికి అడ్వకేట్ కమిషనర్ను నియమించేందుకు కోర్టు అంగీకరించింది.
డిసెంబర్ 18 కి వాయిదా..
ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 18వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఆ రోజు సర్వే కు సంబంధించిన విధివిధానాలను నిర్ణయిస్తామని కోర్టు పేర్కొంది. వారణాసిలోని జ్ఞానవాపీ మసీదులో నిర్వహించిన సర్వే తరహాలోనే మధురలోని షాహీ ఈద్గా మసీదు సర్వే జరగాలని కోర్టు పేర్కొంది. ఈ కేసులో హిందువుల తరఫున విష్ణు శంకర్ జైన్ వాదించారు. షాహీ ఈద్గా మసీదులో, “హిందూ ఆలయానికి సంబంధించిన అనేక ఆధారాలు ఉన్నాయి. అందువల్ల నిజానిజాలు తేల్చడానికి అడ్వొకేట్ కమీషనర్ ఆధ్వర్యంలో మసీదులో సర్వే జరగాల్సిన అవసరం ఉంది” అని ఆయన పేర్కొన్నారు. మసీదు ఉన్న భూభాగం శ్రీ కృష్ణ జన్మభూమి ఆలయంలో భాగమని, అక్కడ గతంలో హిందువులు పూజలు చేసేవారని ఆయన వాదించారు.
ఔరంగజేబు హయాంలో..
శ్రీ కృష్ణ జన్మభూమి ఆలయ భూమిలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు హయాంలో షాహీ ఈద్గా మసీదు నిర్మించారని చరిత్రలో ఉందని పిటిషనర్లు వాదించారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు 1669-70లో శ్రీకృష్ణుడి జన్మస్థలం సమీపంలోని కత్రా కేశవ్ దేవ్ దేవాలయంలోని 13.37 ఎకరాల ఆవరణలో మసీదును నిర్మించారు. ఆ మసీదును తొలగించాలని గతంలో మధుర కోర్టులో పలు పిటిషన్లు కూడా వేశారు.