విద్యను కాషాయీకరిస్తే తప్పేంటి..? - ఉపరాష్ట్రపతి వెంకయ్య
20 March 2022, 7:34 IST
- మెకాలే విధానాన్ని దేశం నుంచి పూర్తిగా తిరస్కరించాలన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. విద్యను కాషాయీకరణ చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారని… కానీ కాషాయీకరిస్తే తప్పేముంది? అని ప్రశ్నించారు. హరిద్వార్ లో మాట్లాడిన ఆయన… ఈ వ్యాఖ్యలు చేశారు.
విద్యను కాషాయీకరిస్తే తప్పేముంది? ఉపరాష్ట్రపతి
దేశంలోని విద్యావిధానంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. 'విద్యను కాషాయీకరణ చేస్తున్నట్లు విమర్శిస్తున్నారు. కానీ కాషాయంతో తప్పేముంది?' అని ప్రశ్నించారు. మెకాలే విధానాన్ని దేశం నుంచి పూర్తిగా తిరస్కరించాలన్నారు. ఇది విదేశీ భాషా మాధ్యమాన్ని రుద్దుతుందని వ్యాఖ్యానించారు.నూతన విద్యావిధానంలో భారతీయత కేంద్రబిందువని చెప్పుకొచ్చారు. ప్రజలంతా వలసవాద మనస్తత్వాన్ని వదిలి భారతీయ సంస్కృతిని తెలుసుకుని గర్వించాలని సూచించారు.
హరిద్వార్లోని దేవ్ సంస్కృతి విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన 'సౌత్ ఆసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పీస్ అండ్ రీకన్సెలియేషన్'ను శనివారం ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... ప్రతి ఒక్కరూ మాతృభాషను ప్రేమించాలని కోరారు. వీలైనన్నీ ఎక్కువ భాషలు నేర్చుకోవాలని సూచించారు. సంస్కృతి, వారసత్వ సంపద, పూర్వీకులు దేశానికి గర్వకారణమన్న ఆయన.. ప్రతి ఒక్కరూ మన మూలాల్లోకి వెళ్లాలని పేర్కొన్నారు. భారతదేశం ‘వసుధైవ కుటుంబకం’ ‘సర్వేభవంతు సుఖిన’ వంటి నినాదాలను జీవన విధానాలుగా మార్చుకుందని గుర్తు చేశారు.
ప్రకృతికి దగ్గరగా జీవించే విధానాన్ని విద్యార్థులు అలవరుచుకోవాలని సూచించారు ఉపరాష్ట్రపతి వెంకయ్య. ప్రకతి అనేది మంచి ఉపాధ్యాయుడు వంటిందన్నారు. ప్రకృతి, సంస్కృతి.. మంచి భవిష్యత్తుకు నాంది పలుకుతుందన్నారు.