మాజీ ఎమ్మెల్యే ఆశ్రమానికి సమీపంలో మహిళ మృతదేహం.. చంపిందెవరు?
11 February 2022, 16:21 IST
Unnao Dalit woman case | ఉత్తర్ప్రదేశ్ ఉన్నావ్లో ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. ఆ మహిళ దాదాపు రెండు నెలల క్రితం అదృశ్యమైంది. ఈ ఘటన వెనక సమాజ్వాదీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కుమారుడి హస్తం ఉందని బాధితురాలి కుటుంబం ఆరోపించింది. కాగా.. ఆ మాజీ ఎమ్మెల్యేకి చెందిన ఓ అశ్రమానికి సమీపంలోనే.. పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని వెలికితీశారు.
మాజీ ఎమ్మెల్యే ఆశ్రమానికి సమీపంలో మహిళ మృతదేహం
Unnao crime news | ఉత్తర్ప్రదేశ్ ఉన్నావ్లో.. కొన్ని నెలల క్రితం అపహరణకు గురైన ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. సమాజ్వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఫతేహ్ బహదూర్ సింగ్కు చెందిన ఆశ్రమానికి సమీపంలో ఆ మహిళ మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ వ్యవహారంలో ఆయన కుమారుడి హస్తం ఉందని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
చంపిందెవరు?
డిసెంబర్ 8న.. ఉత్తర్ప్రదేశ్ ఉన్నావ్కు చెందిన 22ఏళ్ల దళిత మహిళ అనూహ్యంగా అదృశ్యమైంది. ఆ తర్వాతి రోజు.. ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాజ్వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఫతేహ్ బహదూర్ సింగ్ కుమారుడు రాజోల్ సింగ్.. తన కుమార్తెను అపహరించాడని ఫిర్యాదులో పేర్కొంది.
నెల రోజులు గడిచినా.. కేసులో ఎలాంటి పురోగతి లభించలేదు. గత నెల 24న, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్.. లఖ్నవూ పర్యటనలో ఉండగా.. బాధితురాలి తల్లి ఆయన వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఆయన ఎదుటే తన శరీరానికి నిప్పంటించుకునేందుకు ప్రయత్నించింది. తన కుమార్తెను అపహరించారని, పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించింది.
Unnao case | ఈ ఘటన జరిగిన రోజే.. పోలీసులు రాజోల్ను అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం.. ఫతేహ్ బహదూర్ గతంలో కట్టిన ఆశ్రమానికి సమీపంలో.. ఓ మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. అది తన కుమార్తె మృతదేహమేనని ఆ తల్లి గుర్తించింది.
మరోవైపు.. అక్రమ సంబంధం వ్యవహారమే ఈ పరిణామాలకు దారితీసిన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు.
"రాజోల్ సింగ్ను రిమాండ్కు తరలించి విచారించాము. ఆ తర్వాత.. గురువారం నాడు మహిళ మృతదేహాన్ని వెలికితీశాము. ఆశ్రమానికి సమీపంలో మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. స్థానిక నిఘా వ్యవస్థ ద్వారా ఘటనాస్థలాన్ని గుర్తించాము. అక్రమ సంబంధం వ్యవహారమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. విచారణ జరుగుతోంది. నేరస్థులను విడిచిపెట్టము. త్వరలోనే మిగిలినవారిని అరెస్ట్ చేస్తాము," అని ఉన్నావ్ అదనపు ఎస్పీ శశి శేఖర్ సింగ్ మీడియాకు వెల్లడించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు పోలీసులు. కాగా మహిళపై దాడి జరిగిందని పోస్టుమార్టంలో తేలింది. అంతేకాకుండా ఆమె మెడను విరిచేశారాని, తలపై బలంగా కొట్టారని రిపోర్టులో స్పష్టమైంది.
రాజకీయ దుమారం..
ఎన్నికలు జరుగుతున్న ఉత్తర్ప్రదేశ్లో ఈ వ్యవహారం రాజకీయ దుమారానికి దారితీసింది. ఎస్పీపై బీఎస్పీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఘటనకు పాల్పడిన వారిని విడిచిపెట్టకూడదని, బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని బీఎస్పీ చీఫ్ మాయావతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
"దళిత మహిళ మృతదేహాన్ని ఎస్పీ నాయకుడి పొలాల్లో వెలికితీసిన ఘటన అత్యంత బాధాకరం, అత్యంత తీవ్రమైన విషయం. ఈ ఘటన వెనక ఎస్పీ నాయకుడి హస్తం ఉందని బాధితురాలి కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి," అని మాయావతి ట్వీట్ చేశారు.