Asaduddin Owaisi : ఓవైసీ ప్రయాణిస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్పై రాళ్ల దాడి!
08 November 2022, 12:16 IST
Asaduddin Owaisi stone pelting : అసదుద్దీన్ ఓవైసీ ప్రయాణిస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్పై రాళ్ల దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఏఐఎంఐఎం నేత షేర్ చేశారు.
వందే భారత్ ఎక్స్ప్రెస్లో అసదుద్దీన్ ఓవైసీ
Asaduddin Owaisi stone pelting incident : ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రయాణిస్తున్న రైలుపై రైళ్ల దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ పార్టీకి చెందిన నేత వారిస్ పఠాన్ తెలిపారు. కాగా.. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వలేదు.
గుజరాత్లో ఉన్న అసదుద్దీన్ ఓవైసీ.. సోమవారం సాయంత్రం అహ్మదాబాద్ నుంచి సూరత్కు వెళ్లేందుకు 'వందే భారత్' ఎక్స్ప్రెస్ ఎక్కారు. మార్గం మధ్యలో రైలుపై రాళ్ల దాడి జరిగింది!
"అసదుద్దీన్, సబీర్ కబ్లివాల్తో పాటు ఏఎఐఎంఐఎం జాతీయ బృందం.. అహ్మదాబాద్ నుంచి సూరత్కు వెళ్లేందుకు సోమవారం సాయంత్రం వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కింది. గుర్తుతెలియని వ్యక్తులు కొందరు రైలుపై రాళ్ల దాడి చేశారు," అని వారిస్ పఠాన్.. హిందీలో ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్వీట్తో పాటు షేర్ చేశారు.
Gujarat Assembly Elections AIMIM : గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ తరఫున ఓవైసీ తీవ్రస్థాయిలో ప్రచారాలు చేస్తున్న సమయంలో ఈ ఘటన జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనపై వెస్ట్ రైల్వే స్పందించింది.
"వందే భారత్ ఎక్స్ప్రెస్పై రాయితో దాడి చేశారు. ఇది నిజమే. అయితే.. దీని వల్ల ట్రైన్ లోపల ఉన్న గ్లాస్పై ఎలాంటి ప్రభావం పడలేదు. అంక్లేశ్వర్- భరూచ్ సెక్షన్ మధ్యలో ఈ ఘటన జరిగింది. ఈ-2 కోచ్ ఔటర్ గ్లాస్ స్వల్పంగా ధ్వంసమైంది. దీనిని అధికారులు రిప్లేస్ చేశారు. ఇన్నర్ గ్లాస్పై ప్రభావం పడలేదు," అని వెస్ట్ రైల్వే పీఆర్ఓ(పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్) సుమిత్ ఠాకూర్ తెలిపారు.
ఈ ఘటనపై ఏఐఎంఐఎం మండిపడింది. బీజేపీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది.
Asaduddin Owaisi latest news : "మోదీజీ.. ఇక్కడ ఏం జరుగుతోంది. వందే భారత్ను కొన్నిసార్లు పశువులు ఢీకొడుతున్నాయి. ఇక ఇప్పుడు రాళ్ల దాడి జరుగుతోంది. సూరత్కు సమీపంలో ఉన్నప్పుడు మేము ప్రయాణిస్తున్న రైలుపై రాళ్ల దాడి జరిగింది. గ్లాస్ పగిలింది. ఈ వెంటనే మరో రాయి వచ్చి పడింది. ఈ రైలులో ఓవైసీ సాహెబ్ కూడా ఉన్నారు. మా మీద ఎన్ని దాడులు జరిగినా.. మా గొంతుకను ఎవ్వరు అణచివేయలేరు," అని వారిస్ పఠాన్ పేర్కొన్నారు.
మరోవైపు.. వందే భారత్పై ఎవరు రాళ్లు విసురారు? అన్న ప్రశ్నకు ప్రస్తుతం సమాధానం దొరకలేదు. పోలీసులు కూడా దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
గుజరాత్లో 182 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 1,5 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు.. డిసెంబర్ 8న విడుదల కానున్నాయి.