US winter storm : భీకర మంచు తుపాను ధాటికి అమెరికాలో 31మంది మృతి!
26 December 2022, 7:33 IST
- US winter storm death toll : మంచు తుపాను.. అమెరికాను గడగడలాడిస్తోంది. ఈ విపత్తు ధాటికి ఇప్పటికే 31మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
న్యూయార్క్లోని ఓ ప్రాంతంలో పరిస్థితి ఇలా..
US winter storm death toll : అమెరికాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా తూర్పు అమెరికా ప్రాంతాల్లో.. లక్షలాది మందిపై ఈ మంచు తుపాను ప్రభావం పడింది. వేరువేరు ఘటనల్లో ఇప్పటివరకు 31మంది ప్రాణాలు కోల్పోయారు.
క్రిస్మస్ జరగలేదు..!
న్యూయార్క్లోని బఫెల్లో ప్రాంతంలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న మంచు కారణంగా ప్రజలు బయటకు కూడా రాలేని పరిస్థితి నెలకొంది. అత్యవసర సేవలు కూడా నిలిచిపోయాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సంక్షోభం నెలకొంది. బయట ఉంచిన వాహనాలు మంచులో కూరుకుపోయాయి.
US winter storm 2022 : "బయటకి వెళుతుంటే.. ఏదో యుద్ధభూమిలోకి దిగుతున్నట్టు అనిపిస్తోంది. రోడ్డు పక్కన ఉంచిన వాహనాలు మంచులో కూరుకుపోయాయి. పరిస్థితులు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాయి. ఈ మంచు తుపాను గురించి ఈ ఒక్కరోజే కాదు.. తర్వాతి తరం వారు కూడా మాట్లాడుకుంటారు. పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి. ఇప్పట్లో ఇది ముగిసేడట్టు కూడా కనిపించడం లేదు," అని న్యూయార్క్ గవర్నర్ కేథీ హోచుల్ తెలిపారు.
అమెరికాలో మంచు తుపాను క్రిస్మస్ వేడుకలపై ప్రభావం చూపించింది. ముఖ్యంగా దేశంలోని తూర్పు ప్రాంతాల్లో.. క్రిస్మస్ నాడు అంధకారం అలుముకుంది. కొన్ని ప్రాంతాల్లో మంగళవారం వరకు విద్యుత్ పునరుద్ధరణ జరగకపోవచ్చు!
విమాన సేవలు బంద్..
US winter storm today : దశాబ్దాల్లోనే అత్యంత శక్తివంతమైన మంచు తుపానుగా దీనిని పరిగణిస్తున్నారు. అనేక దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలు రద్దు అయ్యాయి. ఆదివారం ఒక్క రోజే.. 2400 యూఎస్ విమానాలు ఎగరలేదు. శనివారం ఆ సంఖ్య 3,500గాను.. శుక్రవారం 6000గాను ఉంది. పలు ప్రాంతాల్లో విమానాశ్రయాలే మూతపడిపోయాయి. ఆట్లాంటా, చికాగో, డెన్వర్, డెట్రాయిట్, న్యూయార్క్ విమానాశ్రయాల్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. హాలీడే సీజన్లో ట్రిప్స్కు ప్లాన్ చేసుకున్న వారందరు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ప్లాన్లను రద్దు చేసుకుని, ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా హాలీడే సీజన్లో పలు వ్యాపారాలు దారుణందా దెబ్బతిన్నాయి!
US winter storm latest updates : కొలొరాడోలో నలుగురు, న్యూయార్క్లో 12మందితో కలిపి మొత్తం మీద మంచు తుపాను ధాటికి 31మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇంకొన్ని రోజుల పాటు తూర్పు అమెరికాపై మంచు తుపాను ప్రభావం ఉంటుందని అధికారులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్త విని ప్రజలు ఇంకా భయపడిపోతున్నారు.