Sanjay Raut news | సంజయ్ రౌత్ భార్యకు ఈడీ పిలుపు
04 August 2022, 17:11 IST
మనీ లాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా, ఆయన భార్య వర్ష రౌత్కు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. పాత్రా చాల్ ల్యాండ్ స్కామ్ కేసులో విచారణకు హాజరు కావాలని వర్షకు ఈడీ సమన్లు జారీ చేసింది.
సంజయ్ రౌత్, ఆయన భార్య వర్ష (ఫైల్ ఫొటో)
Sanjay Raut news | రూ. 1034 కోట్ల పాత్రా చాల్ భూ కుంభకోణం కేసులో కొన్ని రోజుల క్రితం సంజయ్ రౌత్ను ఈడీ అరెస్ట్ చేసింది. తాజాగా, ఆయన భార్యను కూడా విచారించాలని నిర్ణయించింది.
Sanjay Raut news | పాత్రా చాల్ భూ కుంభకోణం
గొరేగావ్ ప్రాంతంలో జరిగిన పాత్రా చాల్ భూ కుంభకోణంలో సంజయ్ రౌత్ పాత్రపై ఈడీ విచారిస్తోంది. ఈ కుంభకోణంలో రూ. 1034 కోట్ల మేర అవినీతి జరిగినట్లు ప్రాథమిక ఆధారాలను ఈడీ సంపాదించింది. అనంతరం, ఆదివారం రాత్రి సంజయ్ రౌత్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. తాజాగా, ఆయన భార్య వర్షకు కూడా సమన్లు జారీ చేశారు.
Sanjay Raut news | జనవరిలోనే..
గతంలోనూ ఒక సారి సంజయ్ రౌత్ భార్య వర్ష రౌత్ను ఈడీ ప్రశ్నించింది. ఈ సంవత్సరం జనవరిలో పీఎంసీ బ్యాంక్ స్కామ్ కేసు విషయమై ఆమెను ఈడీ ప్రశ్నించింది. మాధురి ప్రవీణ్ రౌత్ బ్యాంక్ ఖాతా నుంచి వర్ష రౌత్ ఖాతాకు రూ. 55 లక్షలు బదిలీ కావడానికి సంబంధించిన వివరాలను వర్ష నుంచి ఈడీ సేకరించింది.
Sanjay Raut news | సంజయ్ రౌత్ కస్టడీ పొడగింపు
మరోవైపు, మనీ లాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఈడీ కస్టడీని పొడగిస్తూ ముంబైలోని స్థానిక కోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు ఆగస్ట్ 8 వరకు సంజయ్ రౌత్ ఈడీ కస్టడీని పొడిగించింది. ఈ కేసు దర్యాప్తులో ఈడీ గణనీయమైన ప్రగతి సాధించిందని ఈ సందర్బంగా కోర్టు వ్యాఖ్యానించింది.