Ram Gopal Varma : చిక్కుల్లో రామ్ గోపాల్ వర్మ.. ద్రౌపదీ ముర్ముపై ఆ 'ట్వీట్' వల్లే!
25 June 2022, 8:44 IST
- Ram Gopal Varma comments on Murmu : ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ముపై రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదాస్పదమైంది. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు అందింది.
చిక్కుల్లో రామ్ గోపాల్ వర్మ..
Ram Gopal Varma comments on Murmu : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్న.. చిక్కుల్లో పడ్డారు! ఎన్డీఏ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా నిలిచిన ద్రౌపదీ ముర్ముపై ఆయన ఓ ట్వీట్ చేయడం ఇందుకు కారణం. ఆ ట్వీట్పై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణా బీజేపీ నేత గూడూర్ నారాయణ రెడ్డి.. వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
‘పాండవులు ఎవరు?’
త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 21న.. ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది ఎన్డీఏ కూటమి. ద్రౌపదీ ముర్ము ఓ గిరిజన నేత. ఎస్టీ అయిన ద్రౌపదీ మూర్ము.. గతంలో ఒడిశా మంత్రిగా, ఝార్ఖండ్ గవర్నర్గా పనిచేశారు. రాష్ట్రపతిగా ఎన్నికైతే.. అత్యున్నత స్థానాన్ని అధిరోహించిన తొలి గిరిజన మహిళగా, మొత్తం మీద ఆ పదవిని చేపట్టిన రెండో మహిళగా ముర్ము చరిత్రలో నిలిచిపోతారు.
ద్రౌపదీ ముర్ముపై ఈ నెల 22న రామ్ గోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశారు. 'ద్రౌపదీ.. రాష్ట్రపతి అయితే.. మరి పాండవులు ఎవరు? మరీ ముఖ్యంగా.. కౌరవులు ఎవరు?' అని ఆయన ఆ ట్వీట్లో రాసుకొచ్చారు. (మహాభారతంలోని ద్రౌపదీ, పాండవులు, కౌరవులను ఉద్దేశించి ట్వీట్ చేశారు వర్మ)
ఇప్పుడు ఆ ట్వీట్ రామ్ గోపాల్ వర్మను చిక్కుల్లోకి నెట్టింది. హైదరాబాద్లోని అబిడ్స్ రోడ్డు పోలీస్ స్టేషన్లో ఆయనపై ఫిర్యాదు దాఖలైంది. ఎస్సీ/ఎస్టీ సమాజాన్ని కించపరిచే విధంగా రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారని నారాయణ రెడ్డి ఆరోపించారు. ఎస్సీ/ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని పోలీసుల వద్ద డిమాండ్ చేశారు. డైరక్టర్పై కఠిన చర్యలు చేపట్టాలని తేల్చిచెప్పారు.
"ఎస్సీ-ఎస్టీలను కించపరిచే విధంగా ఆ ట్వీట్ ఉంది. ద్రౌపదీని రాష్ట్రపతి అంటున్నారు. కేవలం ద్రౌపదీ, పాండువులు, కౌరవులను ప్రస్తావించి ఉంటే.. మాకు అభ్యంతరం ఉండేది కాదు. కానీ రాష్ట్రపతిని సంబోధించారు. మా బీజేపీ నేతలు, కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి," అని నారాయణ అన్నారు.
స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎంపిక చేసిన ద్రౌపదీ ముర్ముపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అని నారాయణ అభిప్రాయపడ్డారు. రామ్ గోపాల్ వర్మపై కఠిన చర్యలు చేపడతామని పోలీసులు తనకు హామీనిచ్చినట్టు చెప్పుకొచ్చారు.
మరోవైపు తన ట్వీట్పై వివాదం రాజుకోవడంతో రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఆ వ్యవహారంపై స్పష్టతనిస్తూ.. మరో ట్వీట్ చేశారు.
"వ్యంగ్యంగానే నేను అలా అన్నాను. ఎవరిని కించపరిచేందుకు, బాధపెట్టేందుకు నేను అలా అనలేదు. మహాభారతంలోని ద్రౌపదీ.. నాకు అత్యంత ఇష్టమైన క్యారక్టర్. కానీ.. అలాంటి పేర్లు మనుషులకు పెట్టడం చాలా అరుదు. అందుకే నాకు సడెన్గా ద్రౌపదీ గుర్తొచ్చింది. అంతే. ఎవరిని కించపరిచేందుకు ప్రయత్నించలేదు," అని రామ్ గోపాల్ వర్మ అన్నారు.