Independence day 2023 : ఎర్ర కోట వేదికగా మణిపూర్లో శాంతి కోసం మోదీ పిలుపు..
15 August 2023, 9:11 IST
- Independence day 2023 : ఎర్ర కోటపై జాతీయ జెండాను ఆవిష్కరిచారు మోదీ. అనంతరం చేసిన ప్రసంగంలో మణిపూర్ హింస గురించి మాట్లాడారు.
ఎర్ర కోట వేదికగా మణిపూర్లో శాంతి కోసం మోదీ పిలుపు..
Independence day 2023 : మణిపూర్ ప్రజలకు దేశం అండగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మణిపూర్లో శాంతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయని వెల్లడించారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో.. ఎర్ర కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం చేసిన ప్రసంగంలో మణిపూర్ అంశాన్ని ప్రస్తావించారు మోదీ.
ఎర్ర కోట వేదికగా.. మణిపూర్లో శాంతి కోసం ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
"దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అహింస నెలకొంది. ముఖ్యంగా మణిపూర్.. హింసాత్మక ఘటనలతో రగిలిపోయింది. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితులు ఇప్పుడు కుదుటపడుతున్నాయి. కొన్ని రోజులగా.. మణిపూర్లో శాంతి గురించి వార్తలు వస్తున్నాయి. దేశ ప్రజలు మణిపూర్వాసులకు అండగా ఉంటారు. వారి బాధను దేశం అర్థం చేసుకుంటుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. శాంతితోనే సమస్యలను పరిష్కరించగలము. మణిపూర్ సమస్యను పరిష్కరించేందుకు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం కృషిచేస్తున్నాయి," అని మోదీ అన్నారు.
ఈ క్రమంలోనే మహిళా సాధికారత, దేశాభివృద్ధిని ప్రస్తావించారు మోదీ.
"మేము 2014లో అధికారంలోకి వచ్చాము. అప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ.. ప్రపంచవ్యాప్తంగా 10వ స్థానంలో ఉంది. కానీ ఇప్పుడు.. 5వ స్థానానికి చేరింది. ఇది 140 కోట్ల భారతీయుల శ్రమతోనే సాధ్యమైంది. అవినీతిని అంతం చేసి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాము," అని మోదీ అన్నారు.
"డెమొక్రసీ, డెమొగ్రఫీ, డైవర్సిటీ కారణంగా దేశాభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం తీసుకుంటున్న నిర్ణయాలు, రానున్న 1000ఏళ్లల్లో దేశ భవిష్యత్తును నిర్దేశిస్తాయి," అని మోదీ అభిప్రాయపడ్డారు.
దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సాంప్రదాయ నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు ఓ ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించారు మోదీ. దీని పేరు విశ్వకర్మ పథనం అని వెల్లడించారు. ఈ పథకానికి రానున్న నెలల్లో రూ. 13వేల కోట్లు నుంచి రూ. 15వేల కోట్ల వరకు కేటాయించనున్నట్టు స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే వారసత్వ రాజకీయాలపై మండిపడ్డారు.
"వారసత్వం, బుజ్జగింపు రాజకీయాలతో దేశం చాలా నష్టపోయింది. ఒక పార్టీకి కేవలం ఒక కుటుంబమే ఎలా నియంత్రించగలదు? ఇలాంటి వారికి.. కుటుంబ రాజకీయాలే మంత్రంగా మారుతుంది," అని మోదీ అన్నారు.
మువ్వన్నెల జెండా రెపరెపలు..
PM Modi Independence day speech : 77వ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో.. ప్రధాని మోదీ మంగళవారం ఉదయం తొలుత రాజ్ఘాట్కు వెళ్లారు. మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. దేశ క్షేమం కోసం ప్రార్థించారు.
అనంతరం రాజ్ఘాట్ నుంచి ఎర్ర కోటకు వెళ్లారు మోదీ. రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకి స్వాగతం పలికారు. కొన్ని క్షణాల తర్వాత.. ఎర్ర కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు మోదీ. అనంతరం ఐఏఎఫ్ హెలికాఫ్టర్.. మువ్వనెల జెండాపై పూల వర్షం కురిపించింది.
కేంద్ర మంత్రి అమిత్ షా, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్తో పాటు అనేక మంది ప్రముఖులు.. ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో పాల్గొని, ప్రధాని మోదీ ప్రసంగాన్ని లైవ్లో వీక్షించారు.